
పశ్చిమ చంపారణ్: బీహార్లోని వాల్మీకి పులుల అభయారణ్యానికి సమప గ్రామాల్లో మళ్లీ అడవి ఏనుగుల సంచారం మొదలైంది. తాజాగా బిసాహా గ్రామ సమీపంలో ఆరు అడవి ఏనుగుల గుంపు కనిపించింది. దీంతో గ్రామస్తుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. నేపాల్లోని చిత్వాన్ నుంచి వస్తున్న అడవి ఏనుగులు పొలాల్లోకి చొరబడి వరి, చెరకు పంటలను ధ్వంసం చేస్తున్నాయి.
ఏనుగుల గుంపును చూసిన గ్రామస్తులు వాటిని తరిమికొట్టేందుకు టార్చ్లు వెలిగించి సందడి చేసి, వాటిని తరిమికొట్టారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏనుగులు సుమారు 10 ఎకరాల్లోని పంటలను ధ్వంసం చేశాయి. చేతికొచ్చిన చెరకు, వరి పంటలు కళ్ల ముందే పూర్తిగా నాశనం కావడంతో రైతులు ఏనుగుల ఆగడాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వాల్మీకినగర్ రేంజర్ రాజ్కుమార్ పాశ్వాన్ మీడియాతో మాట్లాడుతూ నష్టపోయిన పంటలపై సర్వే చేస్తున్నామని, నిబంధనల ప్రకారం రైతులకు నష్టపరిహారం ఇచ్చే ప్రక్రియను కూడా పూర్తి చేస్తామని తెలిపారు. నేపాల్లోని చిత్వాన్ నుంచి ఏనుగులు ఇటువైపు తరలివస్తున్న మాట వాస్తవమేనని నేచర్ ఎన్విరాన్మెంట్ అండ్ వైల్డ్లైఫ్ సొసైటీ ప్రాజెక్ట్ మేనేజర్ అభిషేక్ పేర్కొన్నారు. ఏనుగుల గుంపు గ్రామాల్లోకి చొరబడకుండా తగిన చర్యలు చేపడుతున్నామని అటవీశాఖ అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: World Students Day: అబ్ధుల్ కలాం స్ఫూర్తిగా..