Election Commission of India: మోగింది ఎన్నికల భేరీ | Election Commission announces dates for Jammu Kashmir and Haryana assembly polls | Sakshi
Sakshi News home page

Election Commission of India: మోగింది ఎన్నికల భేరీ

Aug 17 2024 5:54 AM | Updated on Aug 17 2024 7:17 AM

Election Commission announces dates for Jammu Kashmir and Haryana assembly polls

జమ్మూకశ్మీర్, హరియాణా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం  

జమ్మూకశ్మీర్‌లో మూడు దశల్లో, హరియాణాలో ఒక దశలో పోలింగ్‌  

అక్టోబర్‌ 4న ఓట్ల లెక్కింపు:  సీఈసీ రాజీవ్‌ కుమార్‌

 ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో తొలిసారిగా ఎన్నికల సందడి   

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో దశాబ్ద కాలం తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఆర్టీకల్‌ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన అనంతరం తొలిసారిగా ఎన్నికల సందడి ప్రారంభం కాబోతోంది. జమ్మూకశ్మీర్‌తోపాటు హరియాణా శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. 

90 స్థానాలున్న జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీకి మూడు దశల్లో, 90 స్థానాలున్న హరియాణా అసెంబ్లీకి ఒక దశలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈసీ) రాజీవ్‌ కుమార్‌ మీడియా సమావేశంలో వెల్లడించారు.

 జమ్మూకశ్మీర్‌లో సెపె్టంబర్‌ 18, సెపె్టంబర్‌ 25, అక్టోబర్‌ 1న, హరియాణాలో అక్టోబర్‌ 1న ఎన్నికలు జరుగుతాయని, రెండు రాష్ట్రాల్లో అక్టోబర్‌ 4న ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని తెలియజేశారు. జమ్మూకశ్మీర్‌లో మొదటి దశలో 24 సీట్లకు, రెండో దశలో 26 సీట్లకు, మూడో దశలో 40 సీట్లకు ఎన్నికలు జరుగుతాయి. ఇక్కడ చివరిసారిగా 2014 నవంబర్‌–డిసెంబర్‌లో ఐదు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.

 జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలను సాధారణంగా ఐదు దశల్లో నిర్వహిస్తుంటారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికలు ఏడు దశల్లో జరిగాయి. దీనిపై విమర్శలు వచ్చాయి. అందుకే జమ్మూకశ్మీర్‌లో తక్కువ సమయంలోనే ఎన్నికలు నిర్వహిస్తామంటూ ఇచి్చన హామీని నిలబెట్టుకుంటున్నామని రాజీవ్‌ కుమార్‌ చెప్పారు. ఈసారి కేవలం మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు పూర్తి చేయబోతున్నామని తెలిపారు. 

జమ్మూకశ్మీర్‌లో భద్రతా అవసరాల వల్లే..  
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను మరికొన్ని రోజుల్లో ప్రకటిస్తామని రాజీవ్‌ కుమార్‌ చెప్పారు. జమ్మూకశ్మీర్‌లో భద్రతా అవసరాలను దృష్టిలో పెట్టుకొని మహారాష్ట్ర ఎన్నికల షెడ్యూల్‌ను వాయిదా వేసినట్లు వివరించారు. 2019లో హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దాదాపు ఒకే సమయంలో జరిగాయి. ఈ ఏడాది, వచ్చే ఏడాది ఆరంభంలో మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీ శాసనసభ ఎన్నికలు సైతం జరగాల్సి ఉందని, వీటిలో రెండు రాష్ట్రాలకు కలిపి ఒకసారి ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు రాజీవ్‌ కుమార్‌ పేర్కొన్నారు. 

జమ్మూకశ్మీర్, హరియాణాలో పోలింగ్‌ పూర్తయిన తర్వాత మిగిలిన రాష్ట్రాల షెడ్యూల్‌ ప్రకటిస్తామన్నారు. మీడియా సమావేశంలో రాజీవ్‌ కుమార్‌తోపాటు ఎన్నికల సంఘం కమిషనర్లు జ్ఞానేశ్‌ కుమార్, సుఖ్‌బీర్‌సింగ్‌ సంధూ పాల్గొన్నారు. జమ్మూకశ్మీర్‌లో ప్రత్యేక ప్రతిపత్తి కలి్పస్తున్న ఆర్టీకల్‌ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమరి్థంచిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది సెపె్టంబర్‌ 30వ తేదీలోగా జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించింది.

ముగ్గురు జెంటిల్‌మెన్‌ మళ్లీ వచ్చేశారు  
ముగ్గురు పెద్దమనుషులు(జెంటిల్‌మెన్‌) మళ్లీ వచ్చేశారని మీడియా సమావేశంలో సీఈసీ రాజీవ్‌ కుమార్‌ చమత్కరించారు. తన సహచర కమిషనర్లు జ్ఞానేశ్‌ కుమార్, సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధూను విలేకరులకు పరిచయం చేశారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో సోషల్‌ మీడియాలో ‘లాపతా జెంటిల్‌మెన్‌’ అంటూ ట్రోలింగ్‌ నడిచింది. ‘లాపతా లేడీస్‌’ చిత్రాన్ని ప్రస్తావిస్తూ కేంద్ర ఎన్నికల సంఘంలోని ముగ్గురు సభ్యులు కనిపించకుండాపోయారని, లోక్‌సభ ఎన్నికల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని, రాజకీయ నాయకులు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్నారని నెటిజన్లు విమర్శలు గుప్పించారు. జూన్‌ 3న విలేకరుల సమావేశంలో రాజీవ్‌ కుమార్‌ మాట్లాడుతూ... లాపతా జెంటిల్‌మన్లు త్వరలో తిరిగివస్తారని చెప్పారు. తాము ఎక్కడికీ వెళ్లలేదని, ఇక్కడే ఉంటున్నామని పేర్కొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement