చెన్నై: ప్రస్తుతం తమిళనాడులో పరిస్థితులు చాలా గంభీరంగా మారాయి. టీవీకేకు ప్రభుత్వ ఏర్పాటు అభ్యర్థణను అక్కడి గవర్నర్ తిరస్కరించడంతో ఇప్పుడు అక్కడ ఏం జరగనుందా అనే టెన్షన్ మెుదలైంది. ఈ నేపథ్యంలోనే రకరకాల ఉహగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే డీఎంకే అధినేత స్టాలిన్..ఆ పార్టీ ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు అక్కడి వార్త పత్రికలు కథనాలు ప్రచురించాయి.
తమిళ తంబీల రాజకీయాలపైనే ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. టీవీకే మ్యాజిక్ ఫిగర్కు ఇంకా 5 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరముంది. దానికోసం విజయ్ పలు చిన్న పార్టీల మద్దతుని అభ్యర్థించారు. వారు త్వరలో తమ నిర్ణయాన్ని తెలియజేస్తామన్నారు. ఈ ఉద్రిక్తతల నడుమ డీఎంకే అధినేత స్టాలిన్ తమ పార్టీ ఎమ్మెల్యేలతో కీలక సమావేశం నిర్వహించినట్లు తమిళనాడు పత్రికలు పేర్కొన్నాయి.
ఆ సమావేశంలో ఎమ్మెల్యేలందరికీ కఠినమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది " రాష్ట్రంలో మేము మంచి ప్రతిపక్ష పార్టీగా పనిచేయాలనుకుంటున్నాం. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా మేము కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సీనియర్ కార్యవర్గ నాయకులతో సంప్రదించిన తర్వాత మేము కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చు. డీఎంకే నాయకులంతా మే 10వ తేదీ వరకూ చెన్నైలోనే ఉండాలి. డీఎంకే ప్రణాళికలకు ఎటువంటి ఆటంకం తలెత్తవద్దు". అని వారికి తెలిపినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి.
అయితే ఇది వరకే స్టాలిన్ టీవీకే అంశమై ప్రకటన విడుదల చేశారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన విజయ్ని తాము ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోమని స్పష్టం చేశారు. అలాగే ఒకవేళ వీసీకే, సీపీఐ, సీపీఎం పార్టీలు విజయ్కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకుంటే తాము అడ్డుకోమన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం స్టాలిన్ ఏం నిర్ణయం తీసుకుంటారా అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.


