సాక్షి,చెన్నై: తమిళనాడు సీఎం విజయ్, త్రిషలపై బహిరంగ సభలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేసులో డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ను శుక్రవారం తమిళనాడు పోలీసులు అధికారికంగా అరెస్ట్ చేశారు. మద్రాస్ హైకోర్టు ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ను తిరస్కరించిన కొద్దిసేపటికే పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.
జూన్ 22న సీఎం విజయ్ పుట్టినరోజు సందర్భంగా నటి త్రిష సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక పోస్ట్ షేర్ చేశారు. అయితే, తిరుచెందూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ ఆ తర్వాత ఆత్తూరులో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఆ పోస్ట్ను ప్రస్తావిస్తూ నటి త్రిష, సీఎం విజయ్ల వ్యక్తిగత జీవితంపై తీవ్ర పరువు నష్టం కలిగించేలా, అవమానకరమైన రీతిలో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి, తాజాగా అరెస్ట్ చేశారు.
ఈ నెల జూన్ 20న తమిళనాడు తూత్తుకుడి జిల్లా ఆత్తూరులో జరిగిన ఒక సంక్షేమ కార్యక్రమ వేదికగా.. సీఎం విజయ్ సినిమా రంగాన్ని వీడి రాజకీయాల్లోకి రావడం, విజయ్-త్రిషల వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావించడం, అసెంబ్లీలో విజయ్ వ్యవహరిస్తున్న శైలిని ఎగతాళి చేస్తూ అనితా రాధాకృష్ణన్ మాట్లాడటంతో ఈ వివాదం మొదలైంది.
నటి ఇంట్లో సంతోషంగా గడిపే ముఖ్యమంత్రి విజయ్.. ఇప్పుడు అసెంబ్లీ అనే ఊబిలో చిక్కుకుపోయి, నలువైపులా ఇరుక్కుపోయానే అనే మానసిక ఆందోళనలో ఉన్నారని వ్యాఖ్యానించారు. సినిమా షూటింగ్ల కంటే రాజకీయం, రాష్ట్ర పాలన ఎంతో భిన్నమైనవని సూచించారు.
తాను ఒక వ్యాపారవేత్తనని పేర్కొంటూ, తన దుకాణంలోకి ఒక కస్టమర్ అప్పు కోసం వచ్చాడా లేదా నగదుతో వస్తువులు కొనడానికి వచ్చాడా అనేది వారి ముఖం చూసి చెప్పగలనని అనితా రాధాకృష్ణన్ ఈ సందర్భంగా ఉదాహరించారు. అదేవిధంగా, అసెంబ్లీలో ముఖ్యమంత్రి విజయ్ ముఖంలో కనిపిస్తున్న గందరగోళాన్ని చూస్తే, ‘ఓరి దేవుడా.. నన్ను ఎంతటి పెద్ద ఉచ్చులో బిగించేశారు’ అని ఆయన లోలోపల సహాయం కోసం అర్థించేలా ఉన్నట్లు తనకు అనిపించిందని ఆయన వ్యంగ్యంగా మాట్లాడారు.
అసెంబ్లీలో ముఖ్యమంత్రి హావభావాలను తప్పుబడుతూ ఎమ్మెల్యే రాధాకృష్ణన్ చేసిన వ్యాఖ్యల వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. టీవీకే నేతల ఫిర్యాదుతో స్పందించిన ఆత్తూరు పోలీసులు అనితా రాధాకృష్ణన్పై భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తాజాగా న్యాయ స్థానం ముందస్తు బెయిల్ తిరస్కరించడంతో పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు.


