
ముంబై: ప్రయాణికుల మాదిరిగా విమానం నుంచి దిగిన కొందరు.. కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో స్మగ్లర్లుగా పట్టుబడటాన్ని మనం అప్పుడప్పుడూ చూస్తుంటాం. వీరు బంగారం లాంటి విలువైన వస్తువులను తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు చిక్కుతుంటారు. తాజాగా ముంబైలోని భారత కస్టమ్స్ అధికారులు థాయిలాండ్ నుండి వస్తున్న విమాన ప్రయాణికుడిని స్మగ్లింగ్ ఆరోపణలతో అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా కస్టమ్స్ అధికారులు వన్యప్రాణుల అక్రమ రవాణాను అడ్డుకున్నారు. థాయిలాండ్ నుండి భారత్కు వస్తున్న ప్రయాణికుని నుండి 16 సజీవ పాములను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని విమానాశ్రయంలోని కస్టమ్స్ అధికారులు తెలిపారు. సదరు ప్రయాణికుడిని అరెస్టు చేసినట్లు కస్టమ్స్ ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది. తదుపరి దర్యాప్తు జరుగుతోందని వెల్లడించింది.
ఈ సజీవ పాములు విషపూరితం కానివని అధికారులు తెలిపారు. జూన్ ప్రారంభంలో థాయిలాండ్ నుంచి డజన్ల కొద్దీ పాములను అక్రమంగా రవాణా చేస్తున్న ప్రయాణీకుడిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఇదేవిధంగా కొద్దిరోజుల వ్యవధిలో బల్లులు, సన్బర్డ్ల తదితర 100 జీవులను తరలిస్తున్న మరో ప్రయాణికుడిని కూడా అధికారులు అడ్డుకున్నారు.
ఇది కూడా చదవండి: భారత్-పాక్ సరిహద్దుల్లో కలకలం.. ఆ కుళ్లిన మృతదేహాలు ఎవరివి?