
మహమ్మారి వ్యాప్తిలో దేశంలోనే రెండో స్థానం
కరోనాతో మరో వ్యక్తి మృతి
13కి చేరిన మృతుల సంఖ్య
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ మళ్లీ తీవ్ర ప్రభావం చూపుతోంది. కరోనా కారణంగా బుధవారం 65 ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడు. అతడు నోటి క్యాన్సర్, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లు సమాచారం. ఇప్పటివరకు ఢిల్లీలో కరోనా కారణంగా 13 మంది మరణించగా, ప్రస్తుతం 620 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జూన్ 15న ఒక్కరోజే ముగ్గురు మరణించారు. వీరిలో 57 ఏళ్ల మహిళకు డయాబెటిస్, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నాయి. 57 ఏళ్ల పురుషుడికీ అదే రకమైన అనారోగ్య సమస్యలున్నాయి. మరణించిన 83 ఏళ్ల మహిళకు డయాబెటిస్, హైబీపీ, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఉంది.
తగ్గుతున్న కేసుల సంఖ్య
ఢిల్లీలో గత మూడు రోజులుగా కరోనా యాక్టివ్ కేసుల సంఖ్యలో కొంత తగ్గుదల కనిపిస్తోంది. యాక్టివ్ కేసులు తగ్గాయి. కొత్త కేసులు నమోదు కాలేదు. ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో 212 మంది బాధితులు కోలుకున్నారు. ఢిల్లీలో ఈ ఏడాది జనవరి 1 నుంచి ఇప్పటివరకు 1,960 కేసులు నమోదయ్యాయి. కాగా, దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కరోనా కేసుల్లో ఢిల్లీ రెండో స్థానంలో ఉంది. కొత్త వేరియంట్లు సాధారణంగా వేగంగా వ్యాపిస్తాయి. అయితే ఇవి గత వేరియంట్ల మాదిరిగా ప్రాణాంతకం కాకపోవచ్చని వైద్య నిపు ణులు చెబుతున్నారు.
వృద్ధులు, గర్భిణులు, చిన్న పిల్లలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారిలో కరోనా కొత్త వేరియంట్లతో ముప్పు అధికంగా ఉంటుంది. కేసుల పెరుగుదలపై భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు సూచిస్తున్నారు. జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు. మాస్కులు ధరించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, జన సమూహాల్లోకి వెళ్లకపోవడం వంటి జాగ్రత్తలు పాటిస్తే వైరస్ వ్యాప్తిని నియంత్రించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.