సుప్రీం జడ్జిగా కర్ణాటక సీజే | Collegium recommends Karnataka Chief Justice Prasanna B. Varale for SC judgeship | Sakshi
Sakshi News home page

సుప్రీం జడ్జిగా కర్ణాటక సీజే

Jan 20 2024 6:28 AM | Updated on Jan 20 2024 6:28 AM

Collegium recommends Karnataka Chief Justice Prasanna B. Varale for SC judgeship - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జజ్టిస్‌  ప్రసన్న బి.వరాలే పేరును కొలీజియం సిఫార్సు చేసింది. ఆయన స్థానంలో జస్టిస్‌ పి.ఎస్‌.దినేశ్‌కుమార్‌ను కర్ణాటక హైకోర్టు సీజేగా నియమించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ సారథ్యంలోని సుప్రీంకోర్టు కొలీజియం శుక్రవారం సమావేశమై ఈ మేరకు పలు నిర్ణయాలు తీసుకుంది.

జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్, జస్టిస్‌ సి.టి.రవికుమార్‌ అనంతరం సుప్రీంకోర్టులో ఎస్సీ సామాజిక వర్గం నుంచి మూ డో న్యాయమూర్తిగా జస్టిస్‌ వరాలే నిలవనున్నారు. ‘‘జస్టిస్‌ ఎస్‌.కె.కౌల్‌ రిటైర్మెంట్‌తో గత డిసెంబర్‌ 25 నుంచి సుప్రీంకోర్టులో ఒక న్యాయమూర్తి స్థానం ఖాళీగా ఉంది. న్యాయమూర్తులపై పనిభారం ఎక్కువగా ఉన్నందున ఖాళీలుండరాదు. అందుకే జస్టిస్‌ వరాలే పేరును సిఫార్సు చేస్తున్నాం’’ అని కొలీజియం పేర్కొంది.

56 మంది సుప్రీం న్యాయవాదులకు సీనియర్‌ హోదా
11 మంది మహిళలతో సహా 56 మంది న్యాయవాదులను సీనియర్‌ న్యాయవాదులుగా సుప్రీంకోర్టు నియమించింది. ఈ మేరకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. వీరిలో తెలుగు న్యాయవాది శ్రీధర్‌ పోతరాజు కూడా ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement