న్యాయ వ్యవస్థ  స్వతంత్రత కాపాడేందుకే కొలీజియం | Collegium imperfect but preserves independence of judges | Sakshi
Sakshi News home page

న్యాయ వ్యవస్థ  స్వతంత్రత కాపాడేందుకే కొలీజియం

Jun 10 2025 6:19 AM | Updated on Jun 10 2025 6:19 AM

Collegium imperfect but preserves independence of judges

కొలీజియం వ్యవస్థలో లోపాలున్న మాట నిజమే  

న్యాయవ్యవస్థ పదేపదే పారదర్శకత నిరూపించుకోవాలి  

జడ్జీలు సైతం ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగమే  

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ వెల్లడి  

సాక్షి, న్యూఢిల్లీ:  సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకానికి ఉద్దేశించిన కొలీజియం వ్యవస్థలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ.. న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడేందుకు ఇది ముఖ్యమైన భద్రతా వ్యవస్థగా కొనసాగుతోందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ చెప్పారు. కొలీజియం వ్యవస్థపై విమర్శలు వస్తున్నాయని అంగీకరించారు. ఈ వ్యవస్థ పరిపూర్ణం కాదని చెప్పారు. కానీ, కార్యనిర్వాహక వర్గం జోక్యం నుంచి న్యాయమూర్తులను రక్షించడంలో కొలీజియం అత్యంత కీలకమని స్పష్టం చేశారు. 

అమెరికా పర్యటనలో ఉన్న జస్టిస్‌ సూర్యకాంత్‌ తాజాగా సియాటెల్‌ యూనివర్సిటీలోని ‘రౌండ్‌ గ్లాస్‌ ఇండియా సెంటర్‌’లో జరిగిన కార్యక్రమంతోపాటు మరో రెండు చోట్ల కీలక ప్రసంగాలు చేశారు. సుప్రీంకోర్టు ఇటీవల చేపట్టిన పలు చర్యలను ప్రస్తావించారు. న్యాయ వ్యవస్థలో పారదర్శకతను మెరుగుపర్చేందుకే వీటిని అమల్లోకి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. ప్రజల్లో విశ్వాసం పెంచుకోవడానికి న్యాయవ్యవస్థ పదే పదే తమ పారదర్శకతను నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కొలీజియంపై వస్తున్న విమర్శలను నిరాకరించలేమని, ఈ వ్యవస్థను మరింత మెరుగుపర్చాలన్న సంకల్పంతో న్యాయ వ్యవస్థ ముందడుగు వేస్తోందని ఉద్ఘాటించారు.  

న్యాయం అంటే సిద్ధాంతం, బాధ్యత  
న్యాయమూర్తులు అంటే అపరిమిత అధికారం కలిగినవారు కాదని... వారు కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగమేనని జస్టిస్‌ సూర్యకాంత్‌ స్పష్టం చేశారు. రాజ్యాంగ విలువలను నిలబెట్టే విధంగా వ్యవహరించాలని న్యాయమూర్తులకు సూచించారు. కోర్టులు అధికారాన్ని ప్రదర్శించే వ్యవస్థలుగా కాకుండా, ప్రజాస్వామ్య ప్రయాణంలో భాగస్వాములై ఉండాలని పేర్కొన్నారు. న్యాయం అనేది తాత్కాలికంగా పంపిణీ చేయాల్సిన ఉత్పత్తి కాదని.. అది ఒక సిద్ధాంతం, ఒక బాధ్యత అని తేలి్చచెప్పారు. స్వేచ్ఛ, సమానత్వం, స్వయంపాలన అనేవి అనుకోకుండా వచ్చినవి కాదని, ఇవన్నీ సుదీర్ఘమైన పోరాటాల ఫలితంగా సమాజానికి లభించాయని జస్టిస్‌ సూర్యకాంత్‌ గుర్తుచేశారు. సుప్రీంకోర్టులో సీనియారిటీ ఆధారంగా, ప్రస్తుత సీజేఐ జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ తరువాత జస్టిస్‌ సూర్యకాంత్‌ 2025 నవంబర్‌లో భారత సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించే అవకాశాలున్నాయి.   
 

Advertisement
 
Advertisement
Advertisement