రెండేళ్ల లోపు పిల్లలకు దగ్గు సిరప్‌ వద్దు! | Centre Issues An Advisory To States On Use Of Cough Syrups For Children, More Details Inside | Sakshi
Sakshi News home page

రెండేళ్ల లోపు పిల్లలకు దగ్గు సిరప్‌ వద్దు!

Oct 3 2025 9:56 PM | Updated on Oct 4 2025 11:08 AM

Centre Issues an Advisory to States on Use of Cough Syrups for Children

వైద్యులు, తల్లిదండ్రులకు కేంద్రం హెచ్చరిక

న్యూఢిల్లీ: రెండేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న చిన్నారులకు దగ్గు, జలుబు మందులను సూచించవద్దని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం ఒక అడ్వైజరీ జారీ చేసింది. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో దగ్గు సిరప్‌ తాగి 11 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలపై డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ (డీజీహెచ్‌ఎస్‌) ఈ మేరకు శుక్రవారం స్పందించింది. చిన్నారులకు దగ్గు సిరప్‌ సిఫారసు చేసే విషయంలో వైద్యులు జాగ్రత్తగా ఉండాలని కోరింది. 

సాధారణంగా ఐదేళ్లలోపు పిల్లలకు దగ్గు సిరప్‌లను సిఫారసు చేయవద్దని కోరింది. ఆపై వయస్సుండే చిన్నారులకు కూడా సరైన మోతాదు, నిర్ణీత కాలావధి, వైద్యుల సరైన పర్యవేక్షణ వంటి అంశాల ఆధారంగానే ప్రిస్క్రైబ్‌ చేయాలంది. అదేవిధంగా, వైద్యుల సలహాలను తీసుకోకుండా యథేచ్ఛగా దగ్గు సిరప్‌ను వాడరాదని తల్లిదండ్రులను కోరింది. 

ఈ విషయంలో వీరికి సరైన అవగాహన కల్పించాలని వైద్యులను కోరింది. ‘పిల్లల్లో దగ్గు సంబంధ వ్యాధులు వాటంతటవే లేదా ఔషధాలతో పనిలేకుండానే చాలావరకు తగ్గిపోతాయి. తగినంత హైడ్రేషన్, విశ్రాంతి, సహాయక చర్యల ద్వారా ఇటువంటి వాటిని తగ్గించుకోవచ్చు’అని అది పేర్కొంది. అదే సమయంలో, సరైన ప్రమాణాలను పాటిస్తూ తయారైన ఉత్పత్తులను వాడాలని ఆరోగ్య విభాగాలు, ఆస్ప త్రులకు సూచించింది. ప్రభుత్వ వైద్యసంస్థలతో ్చపాటు అన్ని ప్రైవేట్‌ ఆస్పత్రులు తమ అడ్వైజరీని పాటించేలా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కోరింది.

సిరప్‌లలో కల్తీ సత్యదూరం
దగ్గు మందు తాగిన అనంతరం కిడ్నీలు ఫెయిలై మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారా జిల్లాలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల సంఖ్య 9కి చేరిందని డీజీహెచ్‌ఎస్‌ తెలిపింది. అదేవిధంగా, పొరుగు నున్న రాజస్తాన్‌లో సికార్‌లో సంభవించిన ఓ మరణం దగ్గు మందు తాగడంతో అవయవాలు ఫెయిలై సంభవించినట్లు అధికారులు గుర్తించారు. చనిపోయిన 9 మంది చిన్నారుల్లో కనీసం ఐదుగురు కోల్‌డ్రెఫ్, ఒకరు నెక్స్‌ట్రో సిరప్‌ తాగినట్లు తేల్చారు. వైరల్‌ జ్వరాల కేసుల విషయంలో ప్రైవేట్‌ ఆస్పత్రుల డాక్టర్లు అప్రమత్తంగా ఉండాలని డీజీహెచ్‌ఎస్‌ తెలిపింది. 

ఇటువంటి కేసులను తీసుకోవద్దని, గుర్తించిన వెంటనే నేరుగా ప్రభుత్వ ఆస్పత్రులకు పంపించాలని కోరింది. అదేవిధంగా, డెక్స్‌ట్రో మెథోర్ఫాన్‌ హైడ్రోబ్రోమైడ్‌ సిరప్‌లతో తీవ్ర అనారోగ్యం బారినపడుతున్న ఘటనల నేపథ్యంలో రాజస్తాన్‌లో ఈ సిరప్‌ వాడినట్లుగా గుర్తించిన 1,420 చిన్నారులను పరిశీలనలో ఉంచామంది. అయితే, చిన్నారుల మరణాలకు దగ్గు మందు కల్తీయే కారణమన్న ఆరోపణలకు తగు ఆధారాలు లేవని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. కిడ్నీలు ఫెయిలయ్యేందుకు అవకాశమున్న డైఇథలీన్‌ గ్లైకాల్‌(డీఈజీ) లేదా ఇథిలీన్‌ గ్లైకాల్‌(ఈజీ) రసాయనాలు ఈ దగ్గు సిరప్‌లలో లేవని శాంపిళ్ల పరీక్షల్లో తేలినట్లు స్పష్టం చేసింది. సిరప్‌లలో కల్తీ జరిగిందన్న ఆరోపణలు నిరాధారాలంటూ కొట్టిపారేసింది. 

ప్రజలకు సూచనలు
చిన్నారులకు దగ్గు వచ్చినప్పుడు తక్షణమే డాక్టర్‌ను సంప్రదించాలి.
OTC (ఓవర్ ది కౌంటర్) దగ్గు మందులు దయచేసి వాడకూడదు.
సహజ చికిత్సలు (తేనె, తులసి, గోరువెచ్చని నీరు) డాక్టర్ సూచనతో మాత్రమే వాడాలి.
ఈ మార్గదర్శకాలు పిల్లల ఆరోగ్యాన్ని కాపాడేందుకు తీసుకున్న కీలక చర్యలు. మీ ఇంట్లో చిన్నారులు ఉంటే, దగ్గు మందుల వాడకంపై అత్యంత జాగ్రత్తగా వ్యవహరించండి.

ఇదీ చదవండి: 
అమెరికా-పాక్‌లు! నాకు నువ్వు.. నీకు నేను!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement