
ఆధారం: నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో
2022 వరకు మూడేళ్లలో 2,837 బాల్య వివాహాలు
తెలంగాణలో 170, ఏపీలో 77 నమోదు
అత్యధికంగా కర్ణాటకలో 672, తమిళనాడులో 401 కేసులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో బాల్య వివాహాలను అరికట్టడానికి, బాల్య వివాహాలతో సంబంధం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి కేంద్రం సంబంధిత చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తోంది. అందులో భాగంగా 2024 నవంబర్ 27న ‘బాల్ వివాహ ముక్త్ భారత్’ ప్రచారాన్ని ప్రారంభించింది. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా అవగాహన పెంపొందించడం, ఈ ఘటనలు ఎక్కడ జరిగినా నిరోధించేలా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సహకారం అందించడం వంటి చర్యలను కేంద్రం చేపట్టింది.
బాల్య వివాహాల నిషేధ పర్యవేక్షణ అధికారులను నియమించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఇచ్చింది. మరోవైపు కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి వ్యవహారాల మంత్రిత్వ శాఖలో ‘మిషన్ శక్తి’ పథకం కింద బేటీ బచావో బేటీ పఢావో పథకాన్ని అమలు చేస్తోంది. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ కూడా బాల్య వివాహాలను అరికట్టే విషయంలో ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా 1098 అనే నెంబర్తో చైల్డ్ హెల్ప్లైన్ను ప్రవేశపెట్టింది.
మరోవైపు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వద్ద అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, 2020 నుంచి 2022 వరకు మూడేళ్లలో దేశంలో 2,837 బాల్య వివాహాలు జరిగాయి. ఇందులో అత్యధికంగా 2021లో 1,050 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రాల పరంగా చూస్తే ఈ మూడేళ్లలో అత్యధికంగా కర్ణాటకలో 672 , తమిళనాడులో 401, పశ్చిమబెంగాల్లో 324 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో 170, ఆంధ్రప్రదేశ్లో 77 బాల్య వివాహాలు జరిగాయి.