సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి వచ్చే ఏడాది జరిగే ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ తన కార్యాచరణను వేగవంతం చేసింది. ప్రధాన ప్రతిపక్షం సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ)కి కీలకంగా ఉన్న ‘పీడీఏ’(వెనుకబడిన, దళిత, మైనారిటీ) అస్త్రాన్ని దీటుగా ఎదుర్కొనే మిషన్– 2027 వ్యూహాన్ని ఖరారు చేసింది. ఈ మేరకు యూపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పంకజ్ చౌదరి 64 మంది సభ్యుల జంబో కమిటీ వివరాలను శుక్రవారం విడుదల చేశారు. ఈ కమిటీలో 19 మంది ఉపాధ్యక్షులు, 8 మంది ప్రధాన కార్యదర్శులు, 19 మంది కార్యదర్శులు, ఆరుగురు ప్రాంతీయ అధ్యక్షులు ఉన్నారు.
కుల సమీకరణాలకే ప్రాధాన్యం
యూపీలో అధికారం నిలబెట్టుకోవాలంటే నాన్–యాదవ్ ఓబీసీలు అత్యంత కీలకం. అందుకే, యూపీ బీజేపీ తన కార్యవర్గంలో ఏకంగా ఓబీసీ నేతలకు 20కి పైగా కీలక పదవులను కట్టబెట్టింది. గత కమిటీలో ఓబీసీ నేతలు 18 మంది మాత్రమే కాగా, ఈసారి వారి ప్రాతినిథ్యాన్ని మరింతగా పెంచింది. రాజ్భర్, బింద్, గుర్జర్, సైని తదితర వర్గాలకు సముచిత స్థానం కల్పించారు.
పార్టీలోని ఆరుగురు ప్రాంతీయ అధ్యక్షుల్లో నలుగురు (నవాబ్ సింగ్ నగర్–పశ్చిమ యూపీ, పూరన్ లాల్ లో«దీ–బ్రిజ్, రామ్ కిషోర్ సాహు–కాన్పూర్, అశోక్ చౌరాసియా–కాశీ) ఓబీసీ వర్గానికే చెందిన వారు కావడం విశేషం. మిగిలిన రెండు ప్రాంతాలకు బ్రాహ్మణ, భూమిహార్ వర్గాలకు చెందిన అవధేష్ ద్వివేది (అవ«ద్), వినోద్ రాయ్ (గోరఖ్పూర్) లను ఎంపిక చేశారు. ప్రధాన కార్యదర్శుల్లో ఎనిమిది మందిగాను ముగ్గురు ఓబీసీ వర్గానికి చెందినవారే.


