అయోధ్య ఎయిర్‌పోర్ట్‌కు మహర్షి వాల్మికి పేరు! | Ayodhya airport to be called Maharishi Valmiki International Airport Ayodhya Dham | Sakshi
Sakshi News home page

అయోధ్య ఎయిర్‌పోర్ట్‌కు మహర్షి వాల్మికి పేరు!

Dec 29 2023 5:01 AM | Updated on Dec 29 2023 5:01 AM

Ayodhya airport to be called Maharishi Valmiki International Airport Ayodhya Dham - Sakshi

న్యూఢిల్లీ: అయోధ్యలో భవ్య రామమందిరం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆ పట్టణంలో ఇప్పటికే పూర్తయిన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రధాని మోదీ శనివారం ప్రారంభించనున్నారు. నూతన విమానాశ్రయం సహా రూ.11,100 కోట్లకుపైగా విలువైన మౌలిక వసతుల ప్రాజెక్టులను ఆయన ప్రారంభిస్తారు. అయోధ్య ఎయిర్‌పోర్ట్‌కు ‘మహర్షి వాల్మికీ అంతర్జాతీయ విమానాశ్రయం, అయోధ్యధామ్‌’గా నామకరణం చేసే వీలుంది. 

సంబంధిత వివరాలను ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఏటా 10 లక్షల మంది విమానప్రయాణికుల రాకపోకలకు అనువుగా రూ.1,450 కోట్లతో నిర్మించిన నూతన ఎయిర్‌పోర్ట్, పూర్తయిన అయోధ్య ధామ్‌ జంక్షన్‌ తొలి దఫా, అయోధ్య రైల్వేస్టేషన్, రోడ్లు, పౌర వసతుల ప్రాజెక్టులను మోదీ ప్రారంభిస్తారు. ఉత్తరప్రదేశ్‌లో రూ.2,300 కోట్ల విలువైన మూడు రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితమివ్వనున్నారు.

కొత్తగా రెండు అమృత్‌ భారత్, ఆరు కొత్త వందేభారత్‌ రైళ్లను జెండా ఊపి ప్రారంభిస్తారు.  సువిశాలంగా కొత్తగా నిర్మించిన అయోధ్య, రామపథ్, బక్తిపథ్, ధర్మపథ్, శ్రీరామజన్మభూమి పథ్‌ రోడ్లను ప్రారంభిస్తారు. అధునాతన సదుపాయాలతోపాటు తక్కువ విద్యుత్‌ను వినియోగించుకునేలా పర్యావరణహిత నిర్మాణం, వాననీటి సంరక్షణ, వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్, మురుగునీటి శుద్ధి ప్లాంట్, సౌరవిద్యుత్‌ ప్లాంట్‌వంటి ఎన్నో ప్రత్యేకతలు ఉన్న అయోధ్య ఎయిర్‌పోర్ట్‌ను ఫై స్టార్‌ గ్రీన్‌ రేటింగ్‌ వచ్చేలా నిర్మించారు.

Advertisement
 
Advertisement
Advertisement