బాంబు బెదిరింపుల వేళ.. విమానంలో పేలుడు పదార్థాలు | Ammunition cartridge found In Dubai-Delhi Air India flight | Sakshi
Sakshi News home page

బాంబు బెదిరింపుల వేళ.. విమానంలో పేలుడు పదార్థాలు

Nov 2 2024 4:05 PM | Updated on Nov 2 2024 4:50 PM

Ammunition cartridge found In Dubai-Delhi Air India flight

ఢిల్లీ: దేశంలో వరుసగా బాంబు బెదిరింపులు వస్తున్న వేళ షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. తాజాగా ఓ విమానంలో పేలుడు పదార్థాలు లభించడం తీవ్ర కలకలం సృష్టించింది. దుబాయ్‌ నుంచి దేశ రాజధాని ఢిల్లీకి వచ్చిన ఎయిర్‌ ఇండియా విమానంలో క్యాట్రిడ్జ్‌(పేలుడు పదార్థం) దొరకడం పలు అనుమానాలకు తావిస్తోంది.

వివరాల ప్రకారం.. అక్టోబర్‌ 27వ తేదీన దుబాయ్‌ నుంచి ఢిల్లీకి ఎయిర్‌ ఇండియా విమానం చేరుకుంది. ప్రయాణీకులందరూ విమానం దిగిన తర్వాత విమానంలోని ఓ సీటులో క్యాట్రిడ్జ్‌ను సిబ్బంది గుర్తించారు. ఈ క్రమంలో ఎయిర్‌ ఇండియా సంస్థలకు చెందిన అధికారులు మాట్లాడుతూ.. ఢిల్లీకి వచ్చిన ఎయిర్‌ ఇండియా ఫ్లైట్‌ AI916 సీటు జేబులో క్యాట్రిడ్జ్(పేలుడు పదార్థం) దొరికింది. అయితే, అప్పటికే ప్రయాణికులంతా సురక్షితంగా దిగారు. భద్రతా ప్రొటోకాల్‌ను పాటిస్తూ ఈ విషయంపై ఎయిర్‌పోర్ట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పుకొచ్చారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు పోలుసులు కూడా వెల్లడించారు.

ఇదిలా ఉండగా.. ఇటీవలి కాలంలో విమానాలు, స్కూల్స్‌, హోటల్స్‌కు బాంబు బెదిరింపు కాల్స్‌ పెరిగిన విషయం తెలిసిందే. పలువురు ఆకతాయిలు.. ఫేర్‌ బెదిరింపు కాల్స్‌ చేయడంతో ఈ ఘటనపై అధికారులు, పోలీసులు కూడా దృష్టిసారించారు. ఇక, గడిచిన 20 రోజుల్లో మొత్తం 600కుపైగా దేశీయ, అంతర్జాతీయ విమానాలకు బెదిరింపులు రాగా.. అవన్నీ ఫేక్‌ అని తేలింది. ఈ బెదిరింపులన్నీ సోషల్‌ మీడియా ద్వారానే ఎక్కువగా వచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు ఇలాంటి బెదిరింపులపై కేంద్రం తీవ్రంగా స్పందించింది. ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Advertisement
 
Advertisement
Advertisement