
తొమ్మిదేళ్ల తర్వాత ఏబీవీపీ పాగా
జాయింట్ సెక్రటరీ పోస్ట్ కైవసం
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (జేఎన్యూఎస్యూ) ఎన్నికల్లో వామపక్షాలు మరోమారు సత్తా చాటాయి. కీలకమైన నాలుగు పదవులకు గాను మూడింటిని కైవసం చేసుకున్నాయి. ఆర్ఎస్ఎస్ అనుబంధ ఏబీవీపీకి తొమ్మిదేళ్ల తర్వాత జాయింట్ సెక్రటరీ పోస్టు దక్కించుకోగలిగింది.
జేఎన్యూఎస్యూ ఎన్నికల కమిషన్ సోమవారం ఉదయం ప్రకటించిన ఫలితాల్లో ప్రెసిడెంట్ పదవిని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్(ఏఐఎస్ఏ)కు చెందిన నితీశ్ కుమార్ గెలుచుకున్నారు. ఈయనకు 1,702 ఓట్లు పడగా సమీప ప్రత్యర్థి ఏబీవీపీకి చెందిన శిఖా స్వరాజ్కు 1,430 ఓట్లు దక్కాయి. ఎస్ఎఫ్ఐకి చెందిన తయ్యబా అహ్మద్ 918 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు.
వైస్ ప్రెసిడెంట్గా డెమోక్రాటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్(డీఎస్ఎఫ్)బలపరిచిన మనీ షా 1,150 ఓట్లతో విజయం సాధించారు. ఏబీవీపీ అభ్యర్థికి 1,116 ఓట్లు దక్కాయి. జనరల్ సెక్రటరీ పదవిని గెలుచుకున్న డీఎస్ఎఫ్కు చెందిన ముంతేహా ఫతిమాకు 1,520 ఓట్లు రాగా ప్రత్యర్థి, ఏబీవీపీకి చెందిన కునాల్ రాయ్కి 1,406 ఓట్లొచ్చాయి. అదేవిధంగా, ఏబీవీపీ అభ్యర్థి వైభవ్ మీనా 1,518 ఓట్లతో జాయింట్ సెక్రటరీ పదవిని గెలుచుకున్నారు. సమీప ప్రత్యర్థి ఏఐఎస్ఏకు చెందిన నరేశ్ కుమార్కు 1,433 ఓట్లు, ప్రోగ్రెసివ్ స్టూడెంట్ అసోసియేషన్(పీఎస్ఏ) అభ్యర్థి నిగమ్ కుమారికి 1,256 ఓట్లు పడ్డాయి.
2015–16 తర్వాత
చిట్టచివరిసారిగా 2015–16 జేఎన్యూఎస్యూ ఎన్నికల్లో ఏబీవీపీ అభ్యర్థి సౌరవ్ శర్మ జాయింట్ సెక్రటరీగా గెలుపొందారు. ఆ తర్వాత ఆ పదవి దక్కడం ఇదే మొదటిసారి. అదేవిధంగా, 2000–01 ఎన్నికల్లో ఏబీవీపీకి చెందిన సందీప్ మహాపాత్ర జేఎన్యూఎస్యూ ప్రెసిడెంట్ అయ్యారు. ఆ తర్వాత మళ్లీ ఏబీవీపీ ఆ పదవిని ఇప్పటి వరకు గెలుచుకోలేకపోయింది.