ఆప్‌ Vs బీజేపీ.. ఢిల్లీలో పొలిటికల్‌ మంటలు.. | AAP Arvind Kejriwal Says BJP Targets With Chargesheet | Sakshi
Sakshi News home page

ఆప్‌ Vs బీజేపీ.. ఢిల్లీలో పొలిటికల్‌ మంటలు..

Dec 23 2024 4:11 PM | Updated on Dec 23 2024 4:27 PM

AAP Arvind Kejriwal Says BJP Targets With Chargesheet

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయం రసవత్తరంగా మారింది. బీజేపీ పార్టీపై మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే ఎజెండానే బీజేపీకి లేదన్నారు. అలాగే, గడిచిన ఐదేళ్ల కాలంలో ఢిల్లీకి బీజేపీ ఏం చేసిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌పై బీజేపీ ఛార్జ్‌షీట్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీని టార్గెట్‌ చేస్తూ కేజ్రీవాల్‌ తీవ్ర ఆరోపణలు చేశారు.‌ తాజాగా కేజ్రీవాల్‌ మీడియాతో మాట్లాడుతూ..‘ఢిల్లీలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం కాషాయ పార్టీకి స్పష్టమైన ఎజెండా లేదు. పార్టీకి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో కూడా తెలియదు. ఢిల్లీలో విద్యుత్, మంచి నీరు, మహిళలకు ఉచిత ప్రయాణం, మౌలిక సదుపాయాలు కల్పించడంలో​ ఆప్‌ ఎంతో కృషి చేసింది. 

కానీ, ఢిల్లీలో​ శాంతి భద్రతలు క్షీణిస్తున్నా బీజేపీ పట్టించుకోవడం లేదు. ఢిల్లీలో శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడుతోంది. ఇప్పుడు ఎన్నికల సమయం వచ్చిన వెంటనే నాపై ఛార్జిషీట్లు వేస్తున్నారు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇదే సమయంలో ఢిల్లీలో ఓటర్లను బీజేపీ తొలగిస్తోందని ఆరోపించారు. 

ఇదిలా ఉండగా.. అంతకుముందు కేజ్రీవాల్‌ను టార్గెట్‌ చేస్తూ బీజేపీ సంచలన ఆరోపణలు చేసింది. బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ఢిల్లీని కేజ్రీవాల్‌ సర్కార్‌ స్కామ్‌లకు రాజధానిగా మార్చిందన్నారు. అవినీతి రహిత పాలన అందిస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం పాలసీ, ఢిల్లీ జల్ బోర్డు, డీటీసీ, వక్ఫ్ బోర్డుకు సంబంధించి కుంభకోణాలకు పాల్పడింది. కేంద్ర నిధులు ఉన్నప్పటికీ ఢిల్లీ ఆరోగ్య సంరక్షణ, విద్య, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో ఆప్ విఫలమైంది. కేవలం ప్రకటనల కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందన్నారు. ఇదే సమయంలో దేశ వ్యతిరేక శక్తులకు ఆప్‌ మద్దుతు ఇస్తోందని కామెంట్స్‌ చేశారు.  

మరోవైపు.. కేజ్రీవాల్‌పై కాంగ్రెస్‌ నేతలు సైతం ఆరోపణలు చేయడం గమనార్హం. ఇక, ఎప్పటికీ కేజ్రీవాల్‌ ముఖ్యమంత్రి కాలేరని కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ అన్నారు. ఎమ్మెల్యేగా కూడా గెలవలేరని వ్యాఖ్యలు చేశారు. ఇక, 70 మంది సభ్యులున్న ఢిల్లీ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement