ఇండోర్లో మేదాంత ఆసుపత్రి వైద్యుల ఘనత
ఇండోర్: మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరంలో 75 ఏళ్ల వృద్ధుడికి డాక్టర్లు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా వృద్ధుడి గుండె కుడి కర్ణికలో పెరుగుతున్న 180 గ్రాముల కణితిని తొలగించారు. ఈ కణితి(ట్యూమర్) సుమారు 9.5 సెంటీమీటర్ల పొడవు, 5.5 సెంటీమీటర్ల వెడల్పు, 4 సెంటీమీటర్ల ఎత్తు ఉన్నట్లు చెప్పారు. దేశంలో శస్త్రచికిత్స ద్వారా గుండె నుంచి తొలగించిన అతిపెద్ద మిక్సోమా ఇదే కావొచ్చని భావిస్తున్నారు. ఇండోర్ మేదాంత ఆసుపత్రిలోని కార్డియాక్ సర్జరీ విభాగం డైరెక్టర్ డాక్టర్ వినీత్ పాండే మంగళవారం మీడియాతో మాట్లాడారు.
వృద్ధుడు కొంతకాలంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నాడు. ఛాతీ నొప్పి, తల తిరగడం, కాళ్లు, పొట్ట భాగంలో వాపు వంటి సమస్యలతో బాధపడుతున్నా. అంతేకాకుండా అతడి కాలేయ పనితీరు మందగించినట్లు తెలిపారు. గుండె కుడి కర్ణికలో భారీ కణితి ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇంత పెద్ద పరిమాణంలో ఉన్న కణితిని తొలగించిన సందర్భాన్ని తాను ఇంతకు ముందెన్నడూ చూడలేదని వినీత్ పాండే చెప్పారు. మానవ గుండె కుడి కర్ణికలో కణితులు ఏర్పడే అవకాశాలు చాలా అత్యల్పమని డాక్టర్ పాండే వివరించారు. వృద్దుడి శరీరంలో ఈ కణితి 35 నుంచి 40 ఏళ్ల క్రితమే ఏర్పడటం మొదలై, క్రమంగా ఈ పరిమాణానికి పెరిగి ఉండవచ్చని వైద్యులు అంచనావేశారు.


