తమిళనాడులో కల్తీ సారాకు 18 మంది బలి | 18 die after consuming illicit liquor in Tamil Nadu | Sakshi
Sakshi News home page

తమిళనాడులో కల్తీ సారాకు 18 మంది బలి

Jun 20 2024 5:20 AM | Updated on Jun 20 2024 5:20 AM

18 die after consuming illicit liquor in Tamil Nadu

సాక్షి, చెన్నై: తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లా కరుమాపురం గ్రామంలో కల్తీ సారా తాగిన 18 మంది బుధవారం మరణించారు. మరో  90 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో పది మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మృతులలో ప్రవీణ్, సురేష్, శేఖర్, మోహన్, జగదీశ్, సుబ్రమణియన్, మణి ఉన్నారు. మరో ముగ్గురు సాయంత్రం మృతి చెందారు. 

ఈ సమాచారంతో కల్తీ సారా, సారా సేవించిన వారంతా ఆస్పత్రులకు పరుగులు తీశారు. ప్రస్తుతం కళ్లకురిచ్చి ప్రభుత్వ ఆస్పత్రిలో సారా సేవించిన వారు 90 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో పది మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని జిప్మర్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే, కల్తీ సారా తాగి మరణించినట్టుగా వైద్య పరీక్షల్లో తేలలేదని కళ్లకురిచ్చి కలెక్టర్‌ శ్రావణ్‌ కుమార్‌ స్పష్టం చేశారు.

 కాగా ఘటనపై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం జిల్లా ఎస్పీ సమయసింగ్‌ మీనాపై సస్పెన్షన్‌ వేటు వేసింది. అలాగే కలెక్టర్‌ శ్రావణ్‌కుమార్‌ను బదిలీ చేసింది. 18 ప్రత్యేక వైద్య బృందాలను చెన్నై నుంచి కళ్లకురిచి్చకి పంపించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆ జిల్లాలోని ఎక్సైజ్‌ విభాగం ఉన్నతాధికారులందరిపై వేటు వేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement