తమిళ చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు, దర్శకుడు కె. భాగ్యరాజ్(73) కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన శనివారం ఉదయం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. 25 సినిమాలకు దర్శకత్వం వహించడంతో పాటు నటుడిగా 75 సినిమాలు చేశాడు. భాగ్యరాజ్ అకాల మరణంతో కోలీవుడ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు.
కె. భాగ్యరాజ్ కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగా, స్క్రీన్ప్లే రచయితగా, నిర్మాతగా, సంగీత దర్శకుడిగా బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారు. ముఖ్యంగా ఆయన రాసే స్క్రీన్ప్లేలు, సామాన్య ప్రజలను ఆకట్టుకునే మధ్యతరగతి కథలు సినిమా ఇండస్ట్రీలో ఒక కొత్త ట్రెండ్ను సృష్టించాయి.
ప్రముఖ దర్శకుడు భారతీరాజా వద్ద ‘16 వయదినిలే’ (తెలుగులో పదహారేళ్ల వయసు) చిత్రానికి సహాయ దర్శకుడిగా కెరీర్ ప్రారంభించారు. ఆ సినిమాలో ఒక చిన్న పాత్రలోనూ కనిపించారు. 1979లో 'సువరిల్లాద చిత్రంగళ్' సినిమాతో దర్శకుడిగా మారారు. ఆ తర్వాత హీరోగా, దర్శకుడిగా ఆయన చేసిన ప్రయోగాలు సూపర్ హిట్ అయ్యాయి. 'అన్థా 7 నాట్కళ్' (తెలుగులో రాధా కళ్యాణం), 'ముంధానై ముడిచ్చు' (తెలుగులో మూఢు ముళ్లు), 'దూరల్ నిన్ను పోచ్చు' వంటి చిత్రాలు బ్లాక్బస్టర్ హిట్లుగా నిలిచాయి.
ఆయన తమిళంలో రూపొందించిన ఎన్నో అద్భుతమైన కథలు తెలుగు, హిందీ భాషల్లోకి రీమేక్ అయ్యాయి. అమితాబ్ బచ్చన్ నటించిన 'ఆఖరి రాస్తా' చిత్రానికి భాగ్యరాజ్ కథ, స్క్రీన్ప్లే అందించడం విశేషం.
ఫ్యామిలీ విషయాలకొస్తే.. తమిళనాడులోని ఈరోడ్ జిల్లా వెల్లాంకోయిల్ ఆయన స్వస్థలం. 1981లో నటి ప్రవీణను వివాహం చేసుకున్నారు. అయితే, 1983లో కామెర్ల వ్యాధితో ఆమె చిన్న వయసులోనే మరణించారు. ఆ తర్వాత 1984లో ప్రముఖ నటి పూర్ణిమ జయరామ్ను ఆయన రెండవ వివాహం చేసుకున్నారు. పూర్ణిమ తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో స్టార్ హీరోయిన్గా (తెలుగులో 'మగమహారాజు' వంటి చిత్రాల్లో) రాణించారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొడుకు శంతను భాగ్యరాజ్ హీరోగా హీరోగా రాణిస్తున్నాడు. కూతురు శరణ్య భాగ్యరాజ్ 'పారిజాతం' వంటి కొన్ని సినిమాల్లో హీరోయిన్గా నటించారు.


