breaking news
K Bhagyaraj
-
బతికుండగా పట్టించుకోలేదు.. ఇప్పుడు నెరవేర్చారు
తమిళ చిత్రసీమలో భాగ్యరాజ్.. అత్యుత్తమ కథా రచయిత, దర్శకుడిగా గుర్తింపు పొందారు. 25కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించడంతో పాటు 75కి పైగా సినిమాల్లో నటించారు. అలాంటి ఈయన అకస్మాత్తుగా కొన్నిరోజుల క్రితం గుండెపోటుతో మరణించారు. సినీ ప్రముఖుల దగ్గర నుంచి అభిమానుల వరకు నివాళి అర్పించారు. ఇకపోతే ఈయన ఎప్పటినుంచో కోరుకున్న విషయాన్ని ప్రముఖ రచయిత వైరముత్తు నెరవేర్చారు.(ఇదీ చదవండి: కన్నీళ్లు పెట్టిస్తున్న భాగ్యరాజ్ చివరి లెటర్)ఇటీవల కన్నుమూసిన తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్.. గతంలో తన స్వీయచరిత్రాన్ని పుస్తకంగా రాశారు. దానికి ముందు మాట రాయాలని ప్రముఖ గీత రచయిత వైరముత్తుని కోరుతూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. కానీ భాగ్యరాజ్ బతికుండగా అది జరగలేదని, ఇప్పుడు ఆ పుస్తకానికి ముందు మాట రాసి భాగ్యరాజ్ కోరికని నెరవేర్చినట్లు వైరముత్తు చెప్పారు. ఆయన భార్య పూర్ణిమ భాగ్యరాజ్, కొడుకు శాంతను భాగ్యరాజ్ కి సదరు ప్రతిని అందించినట్లు వెల్లడించారు.భాగ్యరాజ్ చనిపోయిన తర్వాత ఆయన చివరి లెటర్ అంటూ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. 'మీ ప్రేమతో నిండిన చూపుల కోసం నా కళ్లని సజీవంగా ఉంచండి. దయచేసి వాటిని జాగ్రత్తగా చూసుకోండి. జీవితంతం నాకు అందించిన ప్రేమ, ఆదరణ ఇకపై శాంతనుకు కూడా అందించండి. నేను శారీరకంగా లేకపోయినప్పటికీ దానం చేసిన కళ్ల ద్వారా అభిమానులని చూస్తూనే ఉంటాను' అని ఈయన రాసినట్లు అందులో ఉంది.(ఇదీ చదవండి: తమిళ రాజకీయాల్లోకి స్టార్ హీరో ధనుష్.. ఎంట్రీ ఫిక్స్ అయిందా?) -
కన్నీళ్లు పెట్టిస్తున్న భాగ్యరాజ్ చివరి లెటర్
తమిళ ప్రముఖ దర్శకుడు, నటుడు, రచయిత కె.భాగ్యరాజ్ రీసెంట్గా గుండెపోటుతో చనిపోయారు. అయితే మరణానంతరం ఈయన రాసినట్లు చెబుతున్న ఓ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులని కన్నీళ్లు పెట్టిస్తోంది. ఇందులో తన కళ్లు దానం చేయాలనే చివరి కోరికతోపాటు తన కొడుకు శాంతనుకి అండగా నిలవాలని అభిమానులని ఆయన వేడుకుంటున్నట్లు ఉంది.(ఇదీ చదవండి: పదే పదే ఇబ్బంది పెట్టాడు.. రాయితో తల పగలగొట్టా: కాయదు లోహర్)లెటర్ లో ఏముందంటే?'మన చుట్టూ ఉన్నవాళ్లని సంతోషపెట్టడంలో నిజమైన ఆనందముంది. నాపై అపారమైన ప్రేమ చూపించిన అభిమానులకు, నన్ను ప్రోత్సాహించిన తల్లులకు, ఇండస్ట్రీలోని సహచరులకు కృతజ్ఞతలు. మీ ప్రేమతో నిండిన చూపుల కోసం నా కళ్లని సజీవంగా ఉంచాను. దయచేసి వాటిని జాగ్రత్తగా చూసుకోండి'కొడుకు, నటుడు శాంతను భాగ్యరాజ్ గురించి ప్రస్తావిస్తూ.. 'నా కోసం కొట్టిన చప్పట్లే నా కొడుకుకి కూడా ఆశీర్వాదంగా మారాలని కోరుకుంటున్నా. జీవితంతం నాకు అందించిన ప్రేమ, ఆదరణ ఇకపై శాంతనుకు కూడా అందించండి. నేను శారీరకంగా లేకపోయినప్పటికీ దానం చేసిన కళ్ల ద్వారా అభిమానులని చూస్తూనే ఉంటాను. ఈ శరీరం శాశ్వతం కాదు. ఒకరోజు భూమిలో కలిసిపోతుంది లేదా అగ్నికి ఆహుతి అవుతుంది. చివరకు మిగిలేది బూడిద కాదు. మనం పంచిన ప్రేమే అసలైన సంపద. నా జీవిత ప్రయాణంలో నన్ను ప్రేమించిన, నా కోసం కన్నీళ్లు పెట్టుకున్న ప్రతిఒక్కరికీ నేను రుణపడి ఉంటాను. మంచి సినిమాలు, కథలు, డైలాగ్స్, మానవత్వం ద్వారా చిరస్థాయిగా జీవిస్తాను' అని లెటర్లో రాసుకొచ్చారు.తమిళ చిత్రసీమలో భాగ్యరాజ్.. అత్యుత్తమ కథా రచయిత, దర్శకుడిగా గుర్తింపు పొందారు. 25కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించడంతో పాటు 75కి పైగా సినిమాల్లో నటించారు. ఈయనకు భార్య పూర్ణిమ, కొడుకు శాంతను, కుమార్తె శరణ్య ఉన్నారు.(ఇదీ చదవండి: స్టార్ హీరోలు గమనిస్తున్నారా? 95 శాతం ఫ్లాపులు, డిజాస్టర్లే) -
ఖుష్బుపై విమర్శలు.. నెటిజన్కు స్ట్రాంగ్ కౌంటర్..!
కోలీవుడ్ నటి ఖుష్బు సుందర్ పెద్ద కుమార్తె అవంతిక పెళ్లి వేడుక గోవాలో గ్రాండ్గా జరిగింది. ఈ పెళ్లి వేడుకలో టాలీవుడ్ సినీ స్టార్స్ సందడి చేశారు. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలను ఖుష్బు సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన కుమార్తె పెళ్లి కూతురైన ఆనందాన్ని అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఇదే ఇప్పుడు వివాదానికి కారణమైంది. ఆమె షేర్ చేసిన కొద్ది నిమిషాల్లో విమర్శలొచ్చాయి. వాటిపై ఖుష్బు సైతం తనదైన శైలిలోనే స్పందించింది. ఇంతకీ ఏంటా వివాదం? ఎందుకు విమర్శలొచ్చాయి? అనేది తెలియాలంటే ఈ స్టోరీ చదివేయండి.అయితే ఈ శనివారం ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ మరణించారు. ఈ విషాద సమయంలో ఖుష్బు సుందర్ తన కుమార్తె పెళ్లి ఫోటోలు షేర్ చేయడంపై కొందరు విమర్శలు చేశారు. గోవాలో జరిగిన తమ కుమార్తె వివాహంలో భర్త సుందర్తో ఉన్న ఫ్యామిలీ ఫోటోపై ట్రోల్స్ చేశారు. డైరెక్టర్ భాగ్యరాజ్ మరణం పట్ల సంతాపం తెలుపుతున్న విషాద సమయంలో ఈ పోస్ట్ అవసరమా? అంటూ ఖుష్బును ప్రశ్నించారు.దీనికి ఖుష్బు సైతం తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు. మీరు నన్ను ఎందుకు అనుసరిస్తున్నారు?? కేవలం విమర్శించడానికేనా?? నా కూతురికి పెళ్లి జరిగి 48 గంటలు కూడా కాలేదు. మీకు అంత కష్టంగా ఉంటే, నన్ను అనుసరించడం మానేయండి. మీలాంటి వాళ్లు లేకుంటేనే నేను బాగుంటా. నా లైఫ్లో సంతోషంగా ఉండే హక్కు నాకు ఉందంటూ అతనికి ఘాటూగానే బదులిచ్చారు.భాగ్యరాజ్కు ఖుష్బు నివాళి..అయితే తనపై విమర్శలు ఎదురైనప్పటికీ.. ఖుష్బు సుందర్ తన ఇన్స్టాగ్రామ్లో భాగ్యరాజ్కు నివాళులర్పించారు. ఆయన ఫోటోను పంచుకుంటూ గుర్తు చేసుకన్నారు. మీరు ఇకపై విశ్రాంతి తీసుకోండి సర్. మీతో గడిపిన నా సరదా క్షణాలు నా జ్ఞాపకాల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి. మిమ్మల్ని చాలా మిస్ అవుతాముంటూ పోస్ట్ చేశారు. కాగా.. భాగ్యరాజ్ నటుడిగా, దర్శకుడిగా, రచయితగా, నిర్మాతగా ఐదు దశాబ్దాలకు కోలీవుడ్లో పనిచేశారు. -
ప్రభుత్వ లాంఛనాలతో భాగ్యరాజ్ అంత్యక్రియలు.. సీఎం విజయ్ కీలక నిర్ణయం
-
తిరైకథై మన్నన్
‘తిరైకథై మన్నన్‘... అంటే ‘స్కీన్ర్ప్లే చక్రవర్తి’గా ఖ్యాతి పొందిన ఆ మహా దర్శకుడి గుండె జూన్ 27, 2026న చెన్నైలో ఉదయం ఆరు గంటలకు ఆగిపోయింది. ఆ గుండె 49 ఏళ్లుగా తమిళ సినిమా గుండెచప్పుడైంది. కె.భాగ్యరాజా... మన భాగ్యరాజా గురువు భారతీరాజా వెళ్లిపోయిన 17 రోజులకే ప్రయాణం కట్టాడు. ఇది యాదృచ్ఛికం కాదు. విధి రాసిన స్కీన్ర్ప్లే. భాగ్యరాజా కథలో అయితే ఇదే అత్యంత బలమైన, అత్యంత బాధాకరమైన క్లైమాక్స్.భారతీయ సినీ ప్రేక్షకులకు సిసలైన దేశీయ వినోదభాగ్యం అందించిన కె. భాగ్యరాజా ఒక మనిషి కాదు... యూనివర్సిటీ. దర్శకుడు, రచయిత, నటుడు, సంగీత దర్శకుడు, నిర్మాత, ఎడిటర్, పత్రికా సంపాదకుడు. అన్నిటి కంటే ముందు అతనొక కథకుడు. కాగితం అందుకుని రెండు లైన్లు రాస్తే చాలు థియేటర్ దద్దరిల్లాల్సిందే. కథ అల్లితే బుకింగ్స్ కిటకిటలాడాల్సిందే. అందుకే సౌత్ సినిమా కె. భాగ్యరాజాను ‘కింగ్ ఆఫ్ స్క్రీన్ ప్లే’ అని, ‘తిరైకథై మన్నన్’ అని శిరస్సు వంచి అంగీకరించింది.ఆ ఒక్క షాట్: శిష్యుడి జననం1977... ‘16 వయదినిలే’ షూటింగ్. భారతీరాజా డైరెక్టర్. భాగ్యరాజా అసిస్టెంట్. పల్లెటూరికి వచ్చిన డాక్టర్ కుట్రతో శ్రీదేవిని లోబరుచుకునే కీలక సీన్ తీస్తున్నాడు భారతీరాజా. భాగ్యరాజా గురువు దగ్గరకు వెళ్లి గుసగుసగా అన్నాడు... ‘సార్, ఇక్కడ ఒక కొబ్బరికాయ విజువల్ పెడితే?’.... లోపల అమాయకురాలి జీవితం నాశనమవుతోందనడానికి సింబాలిక్గా బయట పచ్చటి కొబ్బరికాయను చెక్కుతున్న విజువల్. భారతీరాజా విన్నాడు. తీశాడు. రిజల్ట్? తమిళ సినిమా చరిత్రలో ఆ సింబాలిక్ షాట్ని నేటికీ చెప్పుకుంటారు. శిష్యుడి కలంలో ఉన్న మాంత్రిక శక్తిని ఆ రోజే గుర్తించిన గురువు ‘నా తర్వాత వెలుగులోకి వచ్చేది వీడే’ అని అక్కడికక్కడే ప్రకటించాడు. అలా మొదలైంది ‘తిరైకథై మన్నన్ ’ ప్రస్థానం.గోబిచెట్టిపాళయం నుంచి మద్రాస్ దాకా7 జనవరి 1953... కోయంబత్తూరుకు గంటన్నర దూరంలో ఉన్న గోబిచెట్టిపాళయం దగ్గర వెళ్లాంకోవిల్ అనే పల్లెలో కృష్ణస్వామి, అమరావతమ్మలకు పుట్టాడు భాగ్యరాజా. తరాలకు ముందు తమిళనాడుకు వలస వచ్చి స్థిరపడ్డ తెలుగువారు వీళ్లు. తల్లి కొడుక్కు ‘భాగ్యం’ అని పేరు పెట్టింది. కాని భాగ్యంకు చదువు కంటే సినిమాలు బాగా వంటపట్టాయి. ఉమ్మడి సంసారంలో ఆడవాళ్లకు కాలక్షేపం లేక సినిమాలకు వెళ్లేవారు. తోడుగా భాగ్యరాజాను తీసుకెళ్లేవారు. తెర మీద ఎం.జీ.ఆర్ను చూసి అలా అవ్వాలి అనుకున్నాడు. పి.యు.సి ఫెయిల్ అయ్యాక 1976లో మద్రాస్ వచ్చాడు. ఎ. జగన్నాథన్, ఆ తర్వాత భారతీరాజా దగ్గర అసిస్టెంట్గా చేరాడు. మొదట అందరూ ‘కోవై రాజా’ అని పిలిచేవారు. ‘16 వయదినిలే’ క్రెడిట్స్లో ‘భాగ్యం’ పోకూడదని కె. భాగ్యరాజ్ అయ్యాడు.మనిషి మూలం భావోద్వేగం భాగ్యరాజా సిగ్నేచర్భారతీరాజా తమిళ సినిమాను పల్లెకు తీసుకెళితే, భాగ్యరాజా మిడిల్ క్లాస్ ఇళ్లలోకి, ముఖ్యంగా మానవ మనస్తత్వాల లోతుల్లోకి తీసుకెళ్లాడు. భారతీయ జీవనం స్త్రీ, పురుషులు కలిసి నిర్మించుకునే జీవితం. ఈ జీవితంలో ఎదురయ్యే ఇరుపక్షాల భావోద్వేగాలను కథలు చేశాడు. ఆయన ఫార్ములా: మెలోడ్రామా తగ్గించి, చురకతో పాథోస్ పాయింట్ చెక్కడం. టెన్షన్ లో నవ్వు పుట్టించడం. ముఖ్యంగా 80వ దశకంలో హీరోలు పిచ్చి ఫైట్లు చేస్తున్నప్పుడు, హీరోయిన్ల పాత్రలకు లైఫ్, ఎనర్జీ, హీరోయిజం ఇచ్చిన తొలి రచయిత భాగ్యరాజా.1. ‘ముందానై ముడిచ్చు’ (మూడుముళ్లు) – 1983సవతి తల్లులు బిడ్డల్ని హింసిస్తారనే భయంతో భార్య చనిపోయినా పెళ్లి చేసుకోకుండా ఉన్న బడిపంతులిపై నింద వేసి మరీ వివాహం చేసుకుంటుంది ఊర్వశి. ఆ నిందను నిరూపించమని బిడ్డను పడుకోబెట్టి దాటమంటే అభ్యంతరం లేకుండా దాటేస్తుంది. ప్రేక్షకులకు కలుక్కుమనే దృశ్యం. కాని కథ కొనసాగే కొద్దీ ఆ పిల్లాడి మీద ఆమెకు ఎంత ప్రేమ ఉందో, బడి పంతులు మీద ఎంత అనురాగం ఉందో తెలుస్తుంది. పెళ్లికాని అమ్మాయి మాతృత్వాన్ని చాటిన కథ ఇది. దర్శకుడిగా–నటుడిగా భాగ్యరాజా తెరవెనకా, తెరపైనా సూపర్.2. ‘అంద 7 నాట్కల్’ (రాధాకల్యాణం) – 1981తమిళనాడును ఊపేసిన సినిమా. కారణం సంప్రదాయానికి మద్దతు. ప్రేమించిన అమ్మాయి మరొకరి భార్య అయ్యాక కూడా ప్రియుణ్ణే తలుచుకుంటూ భర్తను దగ్గరకు రానీయదు. భర్త అది తెలుసుకుని ప్రియుణ్ణి వెతికి తీసుకొస్తాడు. క్లయిమాక్స్లో భాగ్యరాజా డైలాగ్: ‘నా ప్రియురాలు మీకు భార్య కావచ్చు కానీ, మీ భార్య నా ప్రియురాలు కాకూడదు’. ఈ ఒక్క డైలాగ్తో సినిమా కల్ట్ అయ్యింది.3. ‘ఎంగ చిన్నరాజా’ (అబ్బాయిగారు) – 1987బిడ్డలు తల్లిని కాకుండా ఎవరిని నమ్మాలనే పాయింట్. సవతి తల్లి భాగ్యరాజాను అవమానిస్తూనే ఉంటుంది. కానీ అతను ఆమె పట్ల విపరీతమైన ప్రేమ పెంచుకుంటాడు. చివరికి ఆమె విషం కలిపిన పాలు ఇస్తే ‘మా అమ్మ విషం కలపదు’ అని చెప్పి మరీ తాగుతాడు. విషం అని గ్రహించాక ‘అమ్మా... నన్ను చంపాలంటే విషం కలపాలా.. చచ్చిపో అంటే చచ్చిపోనా’ అంటాడు. ఈ ఒక్క మాటతో ఆ సవతి తల్లిలోని మాతృత్వం ప్రాణం పోసుకుంటుంది. తల్లిని ద్వేషించి పోగొట్టుకోలేదు. ప్రేమించి పొందాడు.4. ‘చిన్న వీడు’ (చిన్న ఇల్లు) – 1985మగాడికి ఎన్ని వ్యామోహాలు ఉన్నా అతనికి అంతిమ సౌఖ్యం, ఆనందం, గౌరవం కుటుంబ జీవితంలోనే ఉందని, భార్యను మించిన ప్రియురాలు లేదని చెప్పిన సినిమా. విడుదలైతే స్త్రీలు తండోపతండాలుగా వెళ్లి చూసి హిట్ చేశారు. ఇల్లాలికి గౌరవం ఇచ్చిన దర్శకుడిని ఎందుకు నెత్తిన పెట్టుకోరు?5. ‘డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్’ – 1982ఒకసారి పుట్టిన ప్రేమ ఎప్పటికీ చచ్చిపోదని చెప్పిన సినిమా.6. ‘తూరల్ నిన్ను పోచ్చు’ (సుందర కాండ) – 1982మధ్యతరగతి ఆడపిల్లలు తమ పెళ్లిళ్లకు కోరుకునేది రాజకుమారులను కాదని, ప్రేమగా చూసుకునే మంచి అబ్బాయిలనని చెప్పిన సినిమా. కామెడీ టచ్: ‘ఇండ్రు పోయి నాళై వా’ (కొక్కరొకో) లో ‘ఏక్ గావ్ మే ఏక్ కిసాన్ రఘు తాతా’ కామెడీ, ‘అంద 7 నాట్కల్’లో తలుపుకు గొళ్లెం లేని బాత్రూమ్ సీన్ నేటికీ నవ్వులు పూయిస్తూనే ఉన్నాయి.భాగ్యరాజా సక్సెస్ ఏంటంటే ప్రేక్షకులు నవ్వుతున్నామనుకునేంతలోపే ఏడ్చే సినిమాలు తీయడం... అలాగే నటుడిగా నవ్విస్తూనే... ఏడిపించడం...వ్యక్తిగత జీవితం1981లో తెలుగు నటి ప్రవీణను పెళ్లాడాడు. కాని 1983లో ఆమె జాండిస్తో చనిపోయింది. 1984లో ‘డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్’ కో–స్టార్ పూర్ణిమ జయరామ్ని పెళ్లి చేసుకున్నాడు. కొడుకు శాంతను, కూతురు శరణ్య ఇద్దరూ నటులే. ‘భాగ్య’ అనే వారపత్రిక నడిపాడు. 1989లో ఎం.జి.ఆర్. మక్కళ్ మున్నేట్ర కళగం పెట్టాడు. సినిమా, పత్రిక, రాజకీయం మూడింట్లోనూ తన ముద్ర వేశాడు. ఎం.జి.ఆర్. ఆయన్ని ‘కలైయులగ వారిసు’... తన కళా ప్రపంచానికి వారసుడు అని ప్రకటించాడు.ఒక గురుకులంకె. భాగ్యరాజాను యూనివర్సిటీ అని ఎందుకు అనాలంటే భారతీరాజా శిష్యుడిగా తాను ఎదగడమే కాకుండా, మళ్లీ తనలాంటి శిష్యులను తయారు చేశాడు. పార్తిబన్, పాండ్యరాజన్, ఆర్. సుందర్రాజన్, వి. శేఖర్... వీళ్లు మాత్రమే కాదు, పరోక్ష శిష్యులు ఎందరో.చిన్న పల్లెటూరి నుంచి వచ్చిన ఈ పి.యు.సి ఫెయిల్ కుర్రాడు తన సృజనతో ఎదిగి ఎం.జి.ఆర్కు అత్యంత ఆప్తుడయ్యాడు. శివాజీ గణేశన్ కు వేషం ఇచ్చి డైరెక్ట్ చేశాడు. అమితాబ్కు హిందీ రాని తాను, ఇంగ్లిష్ రాని బచ్చన్ కి బ్రోకెన్ ఇంగ్లిష్లో కథ చెప్పి మెప్పించి ‘ఆఖరీ రాస్తా’ వంటి సూపర్హిట్ ఇచ్చాడు. ఒక కథను రాసి అన్ని భాషలకు తిప్పగలిగిన, రీమేక్ రైట్స్తో కోట్లు సంపాదించిన ఏకైక స్టోరీటెల్లర్ భాగ్యరాజా ఒక్కడే. కొందరు హీరోలుగా గెలుస్తారు. కొందరు దర్శకులుగా నిలుస్తారు. కానీ భాగ్యరాజా కథకుడిగా యుగాన్నే శాసించాడు. అందుకే ఆయన సినిమా కాదు, సిలబస్. భాగ్యరాజా అనే యూనివర్సిటీకి అడ్మిషన్ దొరకడం మన అదృష్టం. ఆయన కథలు ముగిసినా, మన గుండెల్లో స్క్రీన్ ప్లే ఆగదు. తిరైకథై మన్నన్... స్క్రీన్ ప్లే సింహాసనానికి ఎప్పటికీ నువ్వే రాజువి... వెళ్లి రా. తల్లి కోసం ఒక ప్రతిజ్ఞఇది భాగ్యరాజా సెంటిమెంట్. భాగ్యరాజా మొదటి సినిమా రిలీజ్ను కూడా చూడకుండా కేవలం కొన్ని రోజుల ముందే చనిపోయింది తల్లి. భాగ్యరాజా చాలా బాధపడ్డాడు. అంతే కాదు... తన సినిమాల్లో తల్లిదండ్రుల మరణాన్ని చూపకూడదని నిర్ణయించుకున్నాడు. ‘తల్లిదండ్రులు మరణిస్తే పిల్లలకు ఎంత బాధో నాకు తెలుసు. ప్రేక్షకులకు ఆ బాధ కలిగించను’ అని అలాగే పాటించాడు. 49 ఏళ్లుగా, 75 సినిమాల్లో ఒక్కసారి కూడా తల్లిదండ్రుల మరణం చూపించలేదు. వరల్డ్ సినిమాలోనే రేర్. ఇది ఆయన మనిషితనానికి నిదర్శనం.– కె -
వన్ మ్యాన్ ఇండస్ట్రీ.. భాగ్యరాజ్ ప్రత్యేకలు ఇవే!
తమిళ సినీ పరిశ్రమ మరో దిగ్గజాన్ని కోల్పోయింది. ప్రముఖ నటుడు, దర్శకుడు, కథా రచయిత, స్క్రీన్ప్లే నిపుణుడు కే. భాగ్యరాజ్ శనివారం కన్నుమూశారు. 73 ఏళ్ల వయసులో గుండెపోటు రాగా.. ఆస్పత్రికి తరలించగా అప్పటికే వైద్యులు ఆయన మృతిని ధ్రువీకరించారు. నటుడిగా, దర్శకుడిగా, రచయితగా నాలుగు దశాబ్దాలకుపైగా తనదైన ముద్ర వేసిన భాగ్యరాజ్ మరణంతో దక్షిణాది సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది.దర్శక దిగ్గజం కే. భారతి రాజా శిష్యుడిగా సినీ ప్రయాణం ప్రారంభించిన భాగ్యరాజ్.. కొద్ది కాలంలోనే తన ప్రత్యేక శైలితో స్టార్ దర్శకుడిగా ఎదిగారు. సాధారణ మధ్యతరగతి కుటుంబాల జీవితం, భార్యాభర్తల బంధం, ప్రేమ, కుటుంబ విలువలను హాస్యంతో మేళవించి చెప్పడంలో ఆయనకు సాటి చాలా అరుదు. అందుకే తమిళ ప్రేక్షకులు ఆయనను కేవలం దర్శకుడిగానే కాదు, "వన్ మ్యాన్ ఇండస్ట్రీ"గా కూడా అభివర్ణించేవారు. కథ, స్క్రీన్ప్లే, సంభాషణలు, దర్శకత్వం, నటన.. ఇలా ఒక సినిమాకు అవసరమైన దాదాపు అన్ని బాధ్యతలను ఒంటరిగా నిర్వహించి ఎన్నో విజయాలు సాధించారు.తెరపై నవ్వులు పూయిస్తూనే.. భాగ్యరాజ్ సినిమాల ప్రత్యేకత కథల్లోనే కాదు.. వాటి వెనుక ఉన్న ఆలోచనల్లో కూడా కనిపించేది. సమాజంలో సున్నితమైన అంశాలను ఎంచుకుని వాటిని వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నం చేసేవారు. కుటుంబ వ్యవస్థ, మహిళల స్థానం, దాంపత్య బంధాలు, మానవ సంబంధాల్లోని సంఘర్షణలను ఆయన తెరపై కొత్త కోణంలో ఆవిష్కరించారు. అప్పట్లో ఆయన చిత్రాల్లోని కొన్ని సన్నివేశాలు, సంభాషణలు తీవ్ర చర్చకు దారితీసినా.. అదే సమయంలో ప్రేక్షకులను ఆలోచింపజేసే శక్తి కూడా వాటికి ఉండేది.దర్శకుడిగానే కాకుండా నటుడిగా కూడా భాగ్యరాజ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సహజమైన నటన, టైమింగ్తో కూడిన కామెడీ, భావోద్వేగ సన్నివేశాల్లోని లోతైన అభినయం ఆయనను ప్రేక్షకులకు మరింత చేరువ చేశాయి. తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులకూ ఆయన సుపరిచితమే. ఆయన నటించిన, దర్శకత్వం వహించిన అనేక చిత్రాలు తెలుగులో డబ్ కావడమే కాకుండా, కొన్ని సినిమాలు రీమేక్ అయ్యి ఘన విజయాలు సాధించాయి. తెలుగులో రీమేక్ అయి సూపర్ హిట్గా నిలిచిన సుందరకాండ, అబ్బాయిగారు, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, రాధా కాళ్యాణం, మాయదారి మొగుడు, ఇల్లాలే నా దేవత లాంటి సినిమాలన్నింటికి ఆయనే కథను అందించాడు. కొన్నింటికి దర్శకత్వం కూడా వహించాడు. కె. భాగ్యరాజ్ కథల్లో విలన్లు ఉండరు. కేవలం పాత్రల మధ్య వచ్చే అపార్థాలు, మానవ సంబంధాలు, మిడిల్ క్లాస్ సెంటిమెంట్ మరియు సున్నితమైన హాస్యం మాత్రమే కథను నడిపిస్తాయి. అందుకే ఆయన కథలు తెలుగు నేటివిటీకి అంత బాగా సెట్ అయ్యి రీమేక్స్లో తిరుగులేని విజయాలను అందించాయి కింగ్ఆఫ్ స్క్రీన్ప్లే.. స్క్రీన్ప్లే రచనలో భాగ్యరాజ్ ఒక ప్రత్యేక పాఠశాల. సాధారణ కథనాన్ని కూడా ఆసక్తికర మలుపులు, చురుకైన సంభాషణలు, సహజమైన పాత్రలతో ప్రేక్షకుడిని చివరి వరకు కట్టిపడేసే నైపుణ్యం ఆయన సొంతం. నేటి తరం దర్శకుల్లో కూడా చాలామంది భాగ్యరాజ్ను తమకు స్ఫూర్తిగా పేర్కొంటూ ఉంటారు. సినిమాలతో పాటు రచయితగా, పత్రికా సంపాదకుడిగా కూడా ఆయన సేవలందించారు. తమిళ సినీ పరిశ్రమలో ఆయన ఒక సృజనాత్మక శక్తిగా గుర్తింపు పొందారు.భాగ్యరాజ్ నటించిన తెలుగు సినిమాలుచిలిపి పెళ్లాం (1990)మీ ఇంటికొస్తే ఏం ఇస్తారు.. మా ఇంటికొస్తే ఏం తెస్తారు (2004)మేం వయసుకు వచ్చాం (2012)డిటెక్టివ్ (2017)అల్లంత దూరాన (2023)35 చిన్న కథ కాదు (2024)కుబేర(2025)ఇటీవలే ఆయన గురువు భారతి రాజా మృతితో విషాదంలో మునిగిన తమిళ సినీ లోకం.. రెండు వారాలు గడవకముందే భాగ్యరాజ్ను కూడా కోల్పోవడం పరిశ్రమను మరింత కలచివేసింది. -
తెరపై నవ్వు.. తెర వెనుక విజన్.. భాగ్యరాజ్ అరుదైన (ఫొటోలు)
-
విషాదం.. ప్రముఖ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత
తమిళ చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు, దర్శకుడు కె. భాగ్యరాజ్(73) కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన శనివారం ఉదయం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. 25 సినిమాలకు దర్శకత్వం వహించడంతో పాటు నటుడిగా 75 సినిమాలు చేశాడు. భాగ్యరాజ్ అకాల మరణంతో కోలీవుడ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు.కె. భాగ్యరాజ్ కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగా, స్క్రీన్ప్లే రచయితగా, నిర్మాతగా, సంగీత దర్శకుడిగా బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారు. ముఖ్యంగా ఆయన రాసే స్క్రీన్ప్లేలు, సామాన్య ప్రజలను ఆకట్టుకునే మధ్యతరగతి కథలు సినిమా ఇండస్ట్రీలో ఒక కొత్త ట్రెండ్ను సృష్టించాయి.ప్రముఖ దర్శకుడు భారతీరాజా వద్ద ‘16 వయదినిలే’ (తెలుగులో పదహారేళ్ల వయసు) చిత్రానికి సహాయ దర్శకుడిగా కెరీర్ ప్రారంభించారు. ఆ సినిమాలో ఒక చిన్న పాత్రలోనూ కనిపించారు. 1979లో 'సువరిల్లాద చిత్రంగళ్' సినిమాతో దర్శకుడిగా మారారు. ఆ తర్వాత హీరోగా, దర్శకుడిగా ఆయన చేసిన ప్రయోగాలు సూపర్ హిట్ అయ్యాయి. 'అన్థా 7 నాట్కళ్' (తెలుగులో రాధా కళ్యాణం), 'ముంధానై ముడిచ్చు' (తెలుగులో మూఢు ముళ్లు), 'దూరల్ నిన్ను పోచ్చు' వంటి చిత్రాలు బ్లాక్బస్టర్ హిట్లుగా నిలిచాయి.ఆయన తమిళంలో రూపొందించిన ఎన్నో అద్భుతమైన కథలు తెలుగు, హిందీ భాషల్లోకి రీమేక్ అయ్యాయి. అమితాబ్ బచ్చన్ నటించిన 'ఆఖరి రాస్తా' చిత్రానికి భాగ్యరాజ్ కథ, స్క్రీన్ప్లే అందించడం విశేషం.ఫ్యామిలీ విషయాలకొస్తే.. తమిళనాడులోని ఈరోడ్ జిల్లా వెల్లాంకోయిల్ ఆయన స్వస్థలం. 1981లో నటి ప్రవీణను వివాహం చేసుకున్నారు. అయితే, 1983లో కామెర్ల వ్యాధితో ఆమె చిన్న వయసులోనే మరణించారు. ఆ తర్వాత 1984లో ప్రముఖ నటి పూర్ణిమ జయరామ్ను ఆయన రెండవ వివాహం చేసుకున్నారు. పూర్ణిమ తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో స్టార్ హీరోయిన్గా (తెలుగులో 'మగమహారాజు' వంటి చిత్రాల్లో) రాణించారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొడుకు శంతను భాగ్యరాజ్ హీరోగా హీరోగా రాణిస్తున్నాడు. కూతురు శరణ్య భాగ్యరాజ్ 'పారిజాతం' వంటి కొన్ని సినిమాల్లో హీరోయిన్గా నటించారు. -
రిలీజ్కు ముందే ప్రపంచ రికార్డు కొట్టిన సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే?
దర్శకుడు కె. భాగ్యరాజ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 3.6.9. కేవలం 81 నిమిషాల్లో షూటింగ్ పూర్తి చేసుకుని ప్రపంచ రికార్డు సాధించిన ఈ సినిమా ఈనెల 25వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. దర్శకుడు శివ మాదవ్ ఈ చిత్ర షూటింగ్ను 24 కెమెరాలతో 81 నిమిషాల్లో పూర్తి చేశారు. నటుడు పీజీఎస్ ప్రతి నాయకుడిగా నటించిన ఇందులో బ్లాక్ శాండీ, అంగయర్ కన్నన్, సుకై ల్ ప్రభు, కార్తీక్, గోవిందరరాజన్, సుభిక్ష, నిఖితా, బబ్లూ సహా 60 మందికి పైగా నటీనటులు ముఖ్యపాత్రలు పోషించారు. వీరితో పాటు విదేశానికి చెందిన వారు సైతం నటించడం విశేషం. మారీశ్వరన్ ఛాయాగ్రహణం, కార్తీక్ హర్ష సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 25వ తేదీన తెరపైకి రానుంది. 600 మంది సాంకేతిక నిపుణులు పని చేసిన ఈ సినిమా షూటింగ్ను నాలెడ్జ్ ఇంజినీరింగ్ అనే సంస్థకు చెందిన హరిభా హనీప్ సమక్షంలో చిత్రీకరించినట్లు యూనిట్ సభ్యులు తెలిపారు. కాగా అమెరికాకు చెందిన వరల్డ్ రికార్డ్ యూనియన్ అనే సంస్థ ఈ 3.6.9 చిత్రానికి ప్రపంచ రికార్డు ధ్రువీకరణ పత్రాన్ని అందించినట్లు తెలిపారు. సైన్స్ ఇతివృతంగా రూపొందిన ఈ చిత్రం గురించి నటుడు కె.భాగ్యరాజ్ వివరిస్తూ.. 81 నిమిషాల్లో రూపొంది ప్రపంచ రికార్డు సాధించిన 3.6.9 చిత్రంలో తానూ ఒక భాగం అయినందుకు సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి ప్రయత్నం చేసిన దర్శకుడు శివ మాధవ్, నిర్మాత పీజీఎస్ను అభినందిస్తున్నానన్నారు. ఈ చిత్రం మంచి విజయాన్ని అందించాలని ప్రేక్షకులను కోరుకుంటున్నానని భాగ్యరాజ్ ఆకాంక్షించారు. చదవండి: నాని నీ రేంజ్ ఏంటి..? వీళ్లందరూ గల్లీ హీరోలా..? -
మహిళా సమస్యల నేపథ్యంలో అరియన్
తమిళ సినిమా: ఎంజీపీ మాస్ మీడియా పతాకంపై నవీన్ నిర్మించిన చిత్రం అరియవన్. యారడి నీ మోహిని, తిరుచిట్రంఫలం వంటి విజయవంతమైన చిత్రాలు దర్శకుడు మిత్రన్ ఆర్.జవహర్ తెరకెక్కించిన తాజా చిత్రం ఇది. నవ జంట ఇషాన్, ప్రణాలి జంటగా నటించిన ఇందులో నటుడు డానియల్ బాలాజీ, సత్యన్, కల్కి రాజా, రమ రమేష్ చక్రవర్తి, కావ్య, సూపర్ గుడ్ సుబ్రహ్మణి, రామన్ తదితరులు ముఖ్య పాత్ర పోషించారు. వీవీ టీమ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలోని ఒక పాటను సంగీత దర్శకుడు జేమ్స్ వసంతన్ రూపొందించడం విశేషం. కాగా నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా బుధవారం చిత్ర ఆడియో ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చెన్నైలోని సత్యం సినిమాస్ థియేటర్లో నిర్వహించారు. నటుడు, దర్శకుడు కె. భాగ్యరాజ్ ముఖ్య అతిథిగా పాల్గొని చిత్ర ఆడియో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కథానాయకుడిగా పరిచయమైన ఇషాన్ మాట్లాడుతూ.. ఇంత పెద్ద చిత్రంలో నటించే అవకాశాన్ని కల్పించిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నాను. దర్శకుడు మిత్రన్ ఆర్. జవహర్ చిత్రాల్లో మంచి సందేశంతో కుటుంబ సమేతంగా చూసే విధంగా ఉంటాయన్నారు. ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు పాజిటివ్ ఎనర్జీతో బయటికి వస్తారన్నారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న దర్శకుడు కె. భాగ్యరాజ్ మాట్లాడుతూ అరియవన్ చిత్ర ట్రైలర్ బాగుందని.. అందుకు చిత్ర యూనిట్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. దర్శకుడు మిత్రన్ ఆర్. జవహార్ ఇంతకు ముందు దర్శకత్వం వహించిన ఉత్తమ పుత్తిరన్ చిత్రంలో తాను నటించానని, ఆయన చాలా శాంత స్వభావుడు అని పేర్కొన్నారు. నూతన జంటతో చిత్రం చేస్తున్నారంటే అది కచ్చితంగా మంచి కథాచిత్రమే అయ్యి ఉంటుందన్నారు. కొత్తవారితో చిత్రాన్ని చేసిన నిర్మాత నవీన్కు ధన్యవాదాలు తెలిపారు. చిత్ర హీరో కళ్లల్లో జీవం ఉందని, ఈయన మంచి కథను ఎంచుకొని నటించి విజయం సాధించాలని ఆశీర్వదిస్తున్నట్లు పేర్కొన్నారు. -
కె భాగ్యరాజ్కు షాక్, నటీనటుల సంఘం నుంచి తొలగింపు
నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ పై దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) వేటు వేసింది. వివరాలు.. 2019లో జరిగిన ఈ సంఘం ఎన్నికల్లో నటుడు కె.భాగ్యరాజ్ అధ్యక్షతన శంకర్దాస్ పేరుతో ఓ జట్టు, నటుడు నాజర్ అధ్యక్షతన పాండవర్ జట్టు ఎన్నికల్లో పోటీ చేశాయి. అయితే ఈ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కౌంటింగ్ నిలిచిపోయింది. దీనిపై నాజర్ జట్టు రీ పిటీషన్ దాఖలు చేసింది. చదవండి: పూజా ఆ బాడీ పార్ట్కి సర్జరీ చేయించుకుందా? ఆమె టీం క్లారిటీ సుదీర్ఘకాలం జరిగిన ఈ కేసు విచారణ అనంతరం న్యాయస్థానం సంఘం ఎన్నికలు సక్రమమేనని తీర్పు నిచ్చింది. దీంతో నాజర్ వర్గం కార్యనిర్వాహక బాధ్యతలను చేపట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో సంఘానికి ఇబ్బంది కలిగించే చర్యలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో కె.భాగ్యరాజ్, నటుడు ఏఎల్ ఉదయ్ను 6 నెలల పాటు బహిష్కరిస్తున్నట్లు సంఘం కార్యవర్గం శనివారం ప్రకటించింది. ఈ సంఘటన కోలీవుడ్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాగా దీనిపై నటుడు ఏఎల్ ఉదయ్ స్పందిస్తూ మీడియాకు ఒక లేఖను విడుదల చేశారు. ఈ లేఖలో వివరణ కోరుతూ మొదట నోటీసులు వచ్చినప్పుడే తాను దిగ్భ్రాంతికి గురయ్యానన్నారు. అలాంటిది తమిళ చిత్రంలో ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందిన కె.భాగ్యరాజ్ను సంఘం నుంచి తొలగించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రత్యక్షంగా హాజరై వివరణ ఇవ్వడానికి తాను సిద్ధమని లేఖలో పేర్కొన్నారు. తనను, నటుడు బాబీని తొలగించడం కూడా పెద్ద విషయం కాదని, అయితే దర్శకుడు కె.భాగ్యరాజ్ను తొలగించడం చాలా విచారకరమని ఆయన తన లేఖలో అభిప్రాయపడ్డారు. నడిగర్ సంఘం ఎన్నికల్లో భాగ్యరాజ్ పోటీ చేసినందుకు ఇది ప్రతీకార చర్యగా భావిస్తున్నట్లు వెల్లడించారు. చదవండి: డైలాగ్స్ లేకుండా విజయ్ సేతుపతి ‘గాంధీ టాక్స్’, ఆసక్తిగా ఫస్ట్గ్లింప్స్ ఇలా ప్రశ్నించిన వారందరినీ సంఘం నుంచి తొలగించడం అన్నది సరైన విధానం కాదన్నారు. నటుడు శరత్కుమార్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించినప్పుడు సభ్యులపై ఎప్పుడు చర్యలు తీసుకోలేదని అన్నారు. ప్రస్తుత సంఘం నిర్వాహకులు ఆరంభం నుంచే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇంతకుముందు కూడా పలువురు నాటక కళాకారులను, ఇతర సభ్యులను సంఘం నుంచి తొలగించారని గుర్తు చేశారు. నూతన భవనం ఇప్పటికీ పూర్తి కాలేదని ఏఎల్ ఉదయ ఆరోపించారు. -
వాళ్లంతా నెల తక్కువ పుట్టిన వాళ్లే: నటుడి వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, చెన్నై: పుస్తకావిష్కరణ వేదికగా సినీ సీనియర్ నటుడు, దర్శకుడు కె. భాగ్యరాజ్ నోరు జారి వార్తల్లోకి ఎక్కారు. విమర్శలు, ఎదురు దాడి పెరగడంతో పశ్చాత్తాపం వ్యక్తం చేయాల్సి వచ్చింది. బుధవారం మోదీ సంక్షేమ పథకాలు, నవభారతం –2022 పుస్తకావిష్కరణ చెన్నైలో జరిగింది. బీజేపీ అధ్యక్షుడు అన్నామలై అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సినీ నటుడు భాగ్యరాజ్ పాల్గొని సినీ స్టైల్లో డైలాగుల్ని పేల్చారు. ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించే వాళ్లంతా నెల తక్కువ పుట్టిన వాళ్లేనని ఎద్దేవా చేశారు. నెల తక్కువగా పుట్టిన వాళ్లను, ప్రత్యేక ప్రతిభావంతుల్ని గురి పెట్టి ఆయన వ్యాఖ్యలు చేశారనే ప్రచారంతో సామాజిక మాధ్యమాల్లో భాగ్యారాజ్పై విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో సాయంత్రానికి మీడియా ముందుకు వచ్చిన భాగ్యరాజ్ ‘తాను బీజేపీ వ్యక్తిని కాదని...తమిళుడిని అని వ్యాఖ్యానించారు. నెల తక్కువ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ, తాను దురుద్దేశంతో ఆ వ్యాఖ్య చేయలేదని, ప్రసంగ వేగంలో ఆ పదాన్ని ఉపయోగించినట్టుగా వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలు ఎవరి మనస్సునైనా నొప్పించి ఉంటే క్షమించండి అంటూ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. చదవండి: నాన్న చేసిన పనికి కన్నీళ్లొచ్చాయి ప్రముఖ దర్శకుడు మారుతికి పితృవియోగం -
నటుడు, డైరెక్టర్ భాగ్యరాజ్కు జీవిత సాఫల్య పురస్కారం
సీనియర్ దర్శకుడు, నటుడు కె.భాగ్యరాజ్ను జీవిత సాఫల్య పురస్కారం వరించింది. వివరాలు.. జాతీయ సినిమా చాంబర్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి చెన్నైలోని ఓ హోటల్లో జరిగిన కార్యక్రమంలో విశ్రాంత న్యాయమూర్తి ఎస్. కె.కృష్ణన్ ముఖ్యఅతిథిగా ఈ అవార్డును అందజేశారు. జాతీయ సినిమా చాంబర్ అధ్యక్షుడు అన్బు చంద్రం నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో దర్శకుడు జ్ఞాన రాజశేఖరన్ అతిథిగా పాల్గొన్నారు. ఉత్తమ నటుడు అవార్డును ఆకాష్కు, ఉత్తమ విలన్ అవార్డును ఆర్యన్కు.. ప్రత్యేక అవార్డులను నటుడు రమేష్ కన్నా, బాబుగణేశ్, రిషీకాంత్, నటి ఇనియ, అనూకృష్ణకు అందించారు. ఉత్తమ చిత్ర నిర్మాణ సంస్థ అవార్డును సూర్యకు చెందిన 2డీ ఎంటర్టైన్మెంట్ సంస్థ ప్రతినిధి మనోజ్ దాస్, ఉత్తమ కథా చిత్రాల అవార్డును వి.శేఖర్, ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డు దీనా, ఉత్తమ ఎడిటర్ అవార్డు కె.ఎస్.ప్రవీణ్, ఉత్తమ ఛాయాగ్రహకుడి అవార్డు కేఎస్ సెల్వరాజ్కు దక్కింది. సీనియర్ పాత్రికేయుడు, కలైమామణి అవార్డు గ్రహీత నెల్లై సుందరరాజన్ స్వాగతోపన్యాసం చేశారు. -
మాకు అవకాశాలు రావు, అందుకే..: సీనియర్ దర్శకుడి వారసుడు
నేటి కాలంలో కొత్తవారు అవకాశాలను రాబట్టుకోవడం కంటే సెలబ్రిటీస్ వారసులు వాటిని రాబట్టుకోవడం కష్టతరం. అందుకే యూట్యూబ్, వాణిజ్య ప్రకటనలు ప్రైవేట్ ఆల్బమ్ నటిస్తూ మంచి బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నాను అని సీనియర్ దర్శకుడు కె.భాగ్యరాజ్ వారసుడు శాంతను భాగ్యరాజ్ పేర్కొన్నారు. ఈయన తాజాగా గుండు మల్లి అని ప్రైవేట్ ఆల్బమ్లో నటించారు. నటి మహి మా నంబియార్ మౌఖిక నటించిన వీడియో ఆల్బమ్ నటుడు ఆదవ్ కన్నదాసన్ దర్శకత్వంలో ఎంకేఆర్పీ ప్రొడక్షన్స్ పతాకంపై రాంప్రసాద్, చరణ్ నిర్మించారు. జోరార్డ్ ఫెలిక్స్ సంగీతాన్ని అందించిన ఈ వీడియోకు గాయ త్రి రఘురామ్ నృత్య దర్శకత్వం వహించారు. వివాహ నిశ్చితార్థం నేపథ్యంలో సాగే అందమైన మెలోడీతో కూడిన గుండు మల్లి వీడియో సోమవారం నుంచి ఓటీటీ ప్లాట్ ఫామ్లో స్ట్రీమింగ్ కానుంది. -
హిట్ సినిమా రీమేక్లో...
తమిళ దర్శకుడు, నటుడు కె. భాగ్యరాజా తెరకెక్కించిన సూపర్ హిట్ తమిళ చిత్రం ‘ముందానై ముడిచ్చు’ (1983). భాగ్యరాజా, ఊర్వశి ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రం తాజాగా రీమేక్ కాబోతోంది. ఈ రీమేక్లో హీరోయిన్గా ఐశ్వర్యా రాజేష్ నటిస్తారు. ఊర్వశి చేసిన పాత్రను ఐశ్వర్య చేయనున్నారు. హీరోగా దర్శకుడు శశికుమార్ నటిస్తారు. ఈ రీమేక్కు కథ, స్క్రీన్ ప్లే, మాటలు భాగ్యరాజానే అందిస్తుండటం విశేషం. జేయస్బీ ఫిల్మ్ స్టూడియో బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. అప్పట్లో ఈ సినిమాను ‘మూడు ముళ్లు’గా తెలుగులో రీమేక్ చేశారు దర్శకులు జంధ్యాల. చంద్రమోహన్, రాధిక ముఖ్య పాత్రల్లో నటించారు. భార్య చనిపోయిన ఓ టీచర్ని ప్రేమించిన అమ్మాయి తన ప్రేమను ఎలా గెలుచుకుంది? అన్నది చిత్రకథాంశం. -
ఓటీటీలో విడుదల కానున్న జ్యోతిక సినిమా
-
నటులుగా మారిన ప్రముఖ దర్శకులు
హీరోయిన్ జ్యోతిక లీడ్ రోల్లో నటిస్తున్న ‘పొన్మగల్ వంధల్’ త్వరలో అమెజాన్ ప్రైంలో విడుదల కానున్న విషయం తెలిసిందే. కోర్టు కేసు నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ప్రముఖ దర్శకులు పార్తీబన్, కె. భాగ్యరాజ్, త్యాగరాజన్, ప్రతాప్ పోటెన్, పాండియన్రాజన్లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అయితే సినీ చరిత్రలో ఒకేసారి ఇంతమంది దర్శకులు కెమెరా ముందు నటించడం విశేషం. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ను ఇప్పటికే విడుదల చేసిన విషయం తెలిసిందే. హీరో సూర్య సోంత బ్యానర్ 2డీ ప్రోడక్షన్లో రూపొందించిన ఈ సినిమాకు నిర్మాతలు సూరియా శివకుమార్, జేజే ఫ్రెడ్రిక్ తొలిసారిగా దర్శకత్వం వహిరించారు. కోర్టు నేపథ్యంలో సాగే ‘పొన్మగల్ వంధల్’ సస్పెన్స్ థ్రిల్లర్ కేసును చేదించే శక్తివంతమైన మహిళ న్యాయవాదిగా జ్యోతిక కనిపించనున్నారు. దాదాపు 200పైగా దేశాలలో ఈ చిత్రం మే 29న ఓటీటీ ప్లాట్ఫాం ఆమెజాన్ ప్రైంలో విడుదల కానుంది. (ఓటీటీకే ఓటు) (చదవండి: బంగారు తల్లి వచ్చింది) -
విశాల్... నా ఓటు కోల్పోయావ్
పెరంబూరు: నటుడు విశాల్, నటి వరలక్ష్మి మధ్య మంచి స్నేహసంబంధం ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ జంట మధ్య అంతకంటే ఇంకేదో బంధం ఉందనే ప్రచారం చాలా కాలం జరిగింది. వీరిద్దరి మధ్య ప్రేమ, పెళ్లి లాంటి వదంతులు కూడా వచ్చాయి. అయితే ఇటీవల నటుడు విశాల్కు ఇంట్లో వాళ్లు హైదరాబాద్కు చెందిన అనీశారెడ్డి అనే అమ్మాయితో వివాహ నిశ్చితార్థం జరిపించడంతో పుకార్లకు బ్రేక్ పడింది. కాగా తాజాగా ఫైర్బ్రాండ్గా పేరున్న నటి వరలక్ష్మిశరత్కుమార్ నటుడు విశాల్పై మండిపడ్డారు. ‘నీ సంకుచిత బుద్ధి బయట పడింది. నీపై నాకున్న గౌరవం తగ్గింది. ఇంకా సాధువులా నటించకు’ అంటూ ఆయనపై మాటల తూటాలు పేల్చారు. ఈ గొడవేంటో ఓ సారి చూద్దాం.. 2019–2022 ఏడాదికి గాను నడిగర్సంఘం ఎన్నికలు ఈ నెల 23న జరగనున్న విషయం తెలిసిందే. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో సంఘ పదవులకు పోటీ పడుతున్న పాండవర్ పేరుతో విశాల్ జట్టు, స్వామి శంకర్దాస్ పేరుతో కే.భాగ్యరాజ్ జట్ల మధ్య పోటీ నెలకొంది. ఓటర్లను ఆకట్టుకోవడానికి ఎవరి ప్రయత్నం వారు ముమ్మరంగా చేస్తున్నారు. స్వామి శంకర్దాస్ జట్టు గురువారం నటుడు విజయకాంత్ను కలిసి మద్దతు కోరారు. శుక్రవారం నటుడు కమలహాసన్ను కలిశారు. కాగా పాండవర్ జట్టులో కార్యదర్శి పదవికి పోటీ చేస్తున్న నటుడు విశాల్ ఓట్లను కొల్లగొట్టడంలో భాగంగా ఒక వీడియోను గురువారం సాయంత్రం సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. అది ఇప్పుడు సంచలనంగా మారింది. అంతే కాదు నటి వరలక్ష్మి శరత్కుమార్ ఆగ్రహానికి కారణం అయ్యింది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే నటుడు విశాల్ నడిగర్సంఘ మాజీ అధ్యక్షుడు శరత్కుమార్, మాజీ కార్యదర్శి రాధారవిలపై విమర్శలను గుప్పించారు. శరత్కుమార్, రాధారవి ఫొటోలను చూపిస్తూ వారి స్వప్రయోజనాల కోసం నాటక రంగ కళాకారుల శ్రేయస్సును పట్టించుకోలేదని, వారి అక్రమాలనుప్రశ్నించడానికే తాము ఈ సంఘం ఎన్నికల్లో పోటీ చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. అంతే కాకుండా తాము నాటక వృద్ధ కళాకారులకు అందిస్తున్న పింఛన్లు, నిర్మిస్తున్న సంఘ భవననిర్మాణం వంటి విషయాలను పేర్కొన్నారు. ఈ వీడియోకు స్పందించిన నటి వరలక్ష్మిశరత్కుమార్ విశాల్పై మండిపడ్డారు. ఆమె తన ట్విట్టర్లో ఇలా పేర్కొన్నారు. ‘మర్యాద గల విశాల్కు.. మీరు విడుదల చేసిన ఎన్నికల ప్రచార వీడియోను చూసి మీరు ఎంతగా దిగజారిపోయారన్న విషయం అర్థమవుతుంది. ఆశ్చర్యంతో పాటు అసంతృప్తికి గురియ్యాను. మీపై ఉన్న కొంచెం మర్యాద, గౌరవం ఇప్పుడు పూర్తిగా పోయింది. నా తండ్రిపై మీరు చేస్తున్న ఆరోపణలపై విచారం వ్యక్తం చేస్తున్నాను. ఆరోపణలు కోర్టులో రుజువయ్యే వరకు ఎవరైనా నిరపరాధులే. నా తండ్రి నేరస్తుడే అయితే ఇప్పటికే జైలులో ఉండే వారు. కాబట్టి మీ స్థాయిని పెంచుకోండి. ఇలాంటి నీచపు వీడియోలు మీ స్థా«యిని చూపుతున్నాయి. అయినా మిమ్మల్ని తప్పుపట్టలేం ఎందుకంటే మీరు పెరిగిన విధం అలాంటిదని భావిస్తున్నాను. ఇకపై కూడా సాధువులా చెప్పుకునే ప్రయత్నం చేయవద్దు. మీ అబద్ధాలను, ధ్వంద మనస్థత్వాన్ని అందరూ గ్రహించారని భావిస్తున్నాను. మీరు నిజంగానే సాధువు అయితే మీ పండవర్ జట్టు సభ్యులు మీ నుంచి దూరం అయి మరో జట్టును ఏర్పాటు చేయరు. మీరు మంచి పనులు చేస్తే ఈ ఎన్నికలకు దూరంగా ఉన్న నా తండ్రిని కించపరిచే కంటే, మీరు చేసిన మంచి కార్యాలను చెప్పి ఓట్లు అడుక్కోవచ్చు. ఇంత కాలం మిమ్మల్ని గౌరవించి ఒక స్నేహితురాలిగా మిమ్మల్ని ఆదరిస్తూ వచ్చాను. అలాంటిది ఈ స్థాయికి తీసుకొచ్చారు. మీరు సాధించిన విషయాలతో వీడియో విడుదల చేయకుండా, ఇలా దిగజారి ప్రచారం చేసుకోవడం చాలా బాధనిపిస్తోంది. మీరు తెర వెనుక కూడా బాగానే నటిస్తున్నారనుకుంటున్నాను. మీరు నా ఓటును కోల్పోయారు. మీరు ఎప్పుడూ చెబుతున్నట్లు సత్యమే గెలుస్తుంది’ అని నటి వరలక్ష్మి శరత్కుమార్ నటుడు విశాల్పై మాటల దాడి చేశారు. వరలక్ష్మికి ఆ హక్కు ఉంది కాగా వీడియోను విడుదల చేసిన విశాల్పై నటి వరలక్ష్మి, నటి రాధికాశరత్కుమార్ చేసిన మూకుమ్మడి మాటల దాడి చిత్ర పరిశ్రమలో కలకలానికి దారి తీసింది. ఇక విశాల్ వ్యతిరేకవర్గం దీన్ని బాగానే వాడుకుంటుందన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శుక్రవారం సాయంత్రం పాండవర్ జట్టు నటుడు, మక్కళ్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్ను స్థానిక ఆల్వార్పేటలోని ఆయన కార్యాలయంలో కలిసి మద్దతు కోరారు. అనంతరం నటుడు విశాల్ మీడియాతో మాట్లాడుతూ.. నడిగర్సంఘంలో 30 ఏళ్లుగా జరగనిది తాము మూడేళ్లలో చేసి చూపించామని అన్నారు. సంఘ భవన నిర్మాణానికి ఎందరు ఎన్ని విధాలుగా ఆటంకాలు సృష్టించారన్నది అందరికీ తెలుసన్నారు. ఇక నటి వరలక్ష్మి తనపై విసుర్ల గురించి స్పందిస్తూ ఆమె లాంటి ప్రతి స్నేహితులకు స్వతంత్రంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కు ఉందని అన్నారు. నిసిగ్గుగా చెప్పిందే చెప్పడమా? విశాల్ వీడియోపై శరత్కుమార్ సతీమణి, నటి రాధికా శరత్కుమార్ ఘాటుగా స్పందించారు. ఆమె ఒక ప్రకటనను విడుదల చేస్తూ.. ఈ నెల 23న సంఘం ఎన్నికలు జరగనున్న సమయంలో పాండవర్ జట్టు విడుదల చేసిన వీడియోలో శరత్కుమార్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏం చేయలేదు, పలు అక్రమాలకు పాల్పడ్డారు అంటూ మూడున్నరేళ్ల ముందు చెప్పిన పాత పల్లవినే మళ్లీ సిగ్గు లేకుండా చెప్పడం బిచ్చగాడు వాంతి చేసుకున్నట్లు ఉంది. విశాల్ మీరు చేసిన ఆరోపణలు ఇప్పటి వరకు నిరూపించారా? అయినా మీరు చేసిన ఫిర్యాదులు విచారణలో ఉండగా గతంలో చెప్పిన అసత్యాలు ఇప్పుడు నిజం అవుతాయా? మీపై వేయి కుళ్లిన గుడ్లు ఉండగా శరత్కుమార్ గురించి మాట్లాడడానికి సిగ్గుగా లేదా? నిర్మాతల మండలిలో డబ్బు అంతా ఖాళీ చేసి కోర్టు బోనులో నిలబడ్డారే, అలాంటి మీకు ఇలాంటి వీడియోను విడుదల చేసే అర్హత ఉందా? అంటూ రాధికాశరత్కుమార్ విశాల్పై విరుచుకుపడ్డారు. -
29 పదవులకు 87మంది పోటీ
దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) ఎన్నికలు ఈ నెల 23వ తేదీన జరగనున్న విషయం తెలిసిందే. 2019 నుంచి 2022 సంవత్సరాలకు గానూ సంఘ నిర్వాహక వర్గానికి జరగనున్న ఈ ఎన్నికల్లో ప్రస్తుత సంఘ కార్యవర్గానికి చెందిన నాజర్ అధ్యక్ష పదవికి, విశాల్ కార్యదర్శి పదవికి, కార్తీ కోశాధికారి పదవికి, పూచి మురుగన్, కరుణాస్లు ఉపాధ్యక్ష పదవులకు పోటీ చేస్తున్నారు. వీరితో పాటు 22 మంది కార్యవర్గ సభ్యులు పాండవర్ జట్టు తరఫున పోటీలో ఉన్నారు. అదే విధంగా వీరికి వ్యతిరేకంగా శంకరదాస్ స్వామి జట్టు పేరుతో దర్శక, నటుడు కే.భాగ్యరాజ్ నేతృత్వంలో పోటీకి సిద్ధమయ్యారు. ఈ జట్టులో అధ్యక్ష పదవికి కే.భాగ్యరాజ్, కార్యదర్శి పదవికి ఐసరిగణేశ్, కోశాధికారి పదవికి నటుడు ప్రశాంత్, ఉపాధ్యక్ష పదవులకు ఉదయ, నటి కుట్టిపద్మినిలతో పాటు 22 మంది కార్యవర్గ సభ్యులు పోటీ చేస్తున్నారు. ఈ సంఘం పదవులు మొత్తం 29 ఉండగా ఈ పదవులకు 87 మంది పోటీలో ఉండటం విశేషం. కొన్ని కారణాల వల్ల కొందరి నామినేషన్లు తిరస్కరింపబడడంతో తుదిగా 87 మంది పోటీలో ఉన్నారు. ముందు తిరస్కరింపబడ్డ నటి ఆర్తీ నామినేషన్ను మళ్లీ అంగీకరించారు. అదే విధంగా నటుడు రమేశ్ఖన్నా తిరస్కరింపడ్డ తన నామినేషన్ను పరిగణలోకి తీసుకోవలసిందిగా లేఖ రాశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల్లో పోటీ చేసేవారి తుది జాబితాను గురువారం అధికారికంగా ప్రటించనున్నారు. కాగా గత ఏడాది కంటే మరింత గట్టి పోటీ మధ్య ఈ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
రజనీ, కమల్ ప్రజలకు ఏం చేశారు?
సాక్షి, పెరంబూరు: ఇటీవల సినీ కళాకారులకు రాజకీయ ఆసక్తి మరీ ఎక్కవయ్యిందనే చెప్పాలి. చాలా మంది తాను సైతం రాజకీయలకు సిద్ధం అంటున్నారు. ఇప్పటికే రజనీకాంత్, కమలహాసన్ల రాజకీయరంగ ప్రవేశం తమిళనాడులో ప్రకంపనలు పుట్టిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా సినీయర్ నటుడు, దర్శకుడు కే.భాగ్యరాజ్ కూడా రాజకీయాలకు తానూ సిద్ధం అవుతున్నానంటున్నారు. ఆయన తన పుట్టినరోజును పురస్కరించుకుని సోమవారం మధురైలో పలు సేవాకార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నటులు రజనీకాంత్, కమలహాసన్ ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చునని, అయితే ఎన్నికల్లో ప్రజలు వారిని ఎలా ఆదరిస్తారన్న దాన్ని బట్టి విజయావకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. మక్కల్ తిలగం ఎంజీఆర్ చిత్రాల్లో సమాజానికి అవసరం అయిన అంశాలను, రాజకీయాలను పొందుపరిచేవారన్నారు. సహ కళాకారులకు, ప్రజలకు పలు మంచి చేశారని అన్నారు. మరి రజనీ, కమల్ ప్రజలకు ఏం చేశారనే ప్రశ్న తలెత్తుతోందని, అందుకు వారు బదులు చెప్పాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల రాజుగా పేరు తెచ్చుకున్న పద్మరాజన్ వరుసగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని, ఆయన గెలిచిందే లేదని అన్నారు. నేతల రాజకీయ జీవితాలను ప్రజలే నిర్ణయిస్తారని పేర్కొన్నారు. ఎంజీఆర్ కీర్తీని కాపాడడానికి అన్నాడీఎంకే, దినకరన్ వర్గం ఏకమవ్వాలని ఈ సందర్భంగా కే.భాగ్యరాజ్ పేర్కొన్నారు. తనకు రాజకీయాలపై ఆసక్తి కలిగిందని, త్వరలో తన ప్రత్యక్ష రాజకీయ రంగప్రవేశం గురించి వెల్లడిస్తానని ఆయన తెలిపారు. ఈయన ఇంతకు ముందే ఎంజీఆర్ పేరుతో పార్టీని నెలకొల్పి ఆ తరువాత రాజకీయాలకు దూరంగా ఉన్నారన్నది గమనార్హం. -
బిగ్బీ నన్ను నమ్మలేదు
తమిళసినిమా: బాలీవుడ్ బిగ్బీ అమితాబ్బచ్చన్ తనను నమ్మలేదని సీనియర్ దర్శకుడు, నటుడు కే.భాగ్యరాజ్ వ్యాఖ్యానించారు. ప్రముఖ గీతరచయిత, దర్శకుడు, పత్రికాసంపాదకుడు ఎంజీ.వల్లభన్ గురించి పాత్రికేయుడు అరుళ్సెల్వన్ సేకరించి రాసిన సకలకళావల్లభన్ నవల ఆవిష్కరణ కార్యక్రమం ఇటీవల స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ల్యాబ్లో జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సీనియర్ నటుడు శివకుమార్ నవలను ఆవిష్కరించగా తొలిప్రతిని ఆవిష్కరించగా కే.భాగ్యరాజ్ అందుకున్నారు. ఆయన మాట్లాడుతూ ఒక వ్యక్తి స్నేహితులను బట్టి ఆయన ఎలాంటి వాడో అర్థం అయిపోతుందన్నారు. అలా ఎంజీ.వల్లభన్ స్నేహితులను బట్టే ఆయన ఎంత ప్రతిభావంతుడో తెలుసుకోవచ్చునన్నారు.మలయాళీ అయిన ఎంజీ.వల్లభన్ తమిళ సాహిత్యం చూసి తానే ఆశ్చర్యపోయానని అన్నారు. తాను ఒక మలయాళ చిత్రంలో నటించి పడ్డ పాట్లు అన్నీ ఇన్నీ కావన్నారు.అదే విధంగా తాను హిందీలో ఆఖరిరాస్తా చిత్రానికి దర్శకత్వం వహించినప్పుడు ఆ చిత్రం కోసం తాను రాసిన ఆంగ్ల సంభాషణలు చూసి నటుడు అమితాబ్ బచ్చన్కు తనపై నమ్మకం కలగలేదన్నారు. ఆ తరువాత చిత్రం చూసిన ఆయన సహాయక బృందం చప్పట్లు కొట్టడంతో ఆయనకు సంతృప్తి కలిగిందని తెలిపారు. ఇప్పుడు ఆ జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయని అన్నారు. ఎంజీ.వల్లభన్ వంటి సాహితీవేత్త తన భాగ్య పత్రికలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తారని తాను భావించలేదని, అలాంటిది ఆయన భాగ్య పత్రిక బాధ్యతలను నిర్వహించడంతో తాను ఎలాంటి చింతా లేకుండా షూటింగ్లకు వెళ్లానని చెప్పారు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా పాత విషయాలకెప్పుడూ విలువ ఉంటుందన్నారు. మిత్రులతో పాత విషయాల గురించి చర్చించుకున్నప్పుడు కూడా కొత్త కొత్త విషయాలను తెలుకోవచ్చునని అన్నారు. అలా ఎంజీఆర్, శివాజీగణేశన్ల నుంచి ధనుష్ కాలం వరకూ ఉన్న ఏజీ.వల్లభన్ అనుభవాలను కూడా పుస్తకంగా తీసుకోస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని కే.భాగ్యరాజ్ ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. -
పెట్టుబడి తిరిగొస్తే చాలు
ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాలు వంద రోజులు ఆడాలని ఆశించడం అత్యాశే అవుతుంది. నిర్మాతలు పెట్టిన డబ్బు తిరిగి వస్తే చాలు అన్న పరిస్థితి నెలకొంది అని సీనియర్ నటుడు,దర్శకుడు కె.భాగ్యరాజ్ వ్యాఖ్యానించారు. ఈయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం అయ్యనార్ వీధి. యువ కథానాయకుడిగా యువన్ నటించిన ఈ చిత్రంలో షారాశెట్టి నాయకిగా నటించారు. శ్రీ సాయి షణ్ముగర్ పిక్చర్స్ పతాకంపై సెంథిల్వేల్, ఆయన మిత్రుడు విజయ్శంకర్ కలిసి నిర్మిస్తున్నారు. జిప్సీ ఎన్.రాజ్కుమార్ కథ, దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహిస్తున్న ఈ చిత్రానికి యూకే.మురళి సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్ర ఫస్ట్లుక్ విడుదల కార్యక్రమం బుధవారం సాయంత్రం స్థానిక వడపళనిలోని ఆర్కేవీ.స్టూడియోలో జరిగింది. ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొని చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ను ఆవిష్కరించిన కే.భాగ్యరాజ్ మాట్లాడుతూ తానీ చిత్రంలో నటిస్తున్న సమయంలో నిర్మాతలోని వేగాన్ని చూశానన్నారు. సాధారణంగా సినిమా భాగస్వామ్యానికి ఎవరూ ముందుకు రారన్నారు. అలాంటిది ఈ చిత్ర నిర్మాతకు ఆయన స్నేహితుడు విజయ్శంకర్ సహ నిర్మాతగా అండగా నలిచారని అభినందించారు. ఇకపోతే తానీ చిత్రంలో నటించిన తరువాతనే అయ్యనార్ల గురించి పూర్తిగా తెలుసుకున్నానని చెప్పారు. ఇందులో 108 మంది అయ్యనార్ల గురించి ఒక పాటు ఉంటుందన్నారు. ఈ రోజుల్లో చిత్ర వందరోజులు ఆడాలని, పెద్ద విజయం సాధించాలని ఆశించడం హాస్యాస్పదమే అవుతుందన్నారు. అందువల్ల ఈ చిత్రానికి నిర్మాతలు పెట్టిన డబ్బు తిరిగి వస్తే చాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. పెట్టుబడి తిరిగొస్తేనే నిర్మాతలు బయట పడతారన్నారు. మరిన్ని చిత్రాలు నిర్మించడానికి వారికి ధైర్యం వస్తుందని, అప్పుడే పలువురికి ఉపాధి కల్పిస్తారని భాగ్యరాజ్ పేర్కొన్నారు. -
కమల్ రూ.27వేలు, రజనీకి రూ.2,500
చెన్నై: 1977 నాటి మాట. ప్రస్తుత నట దిగ్గజాలు అయిన కమలహాసన్, రజనీకాంత్ల మధ్య స్నేహబంధం బలపడుతున్న కాలం అది. అప్పుడు వీరికి తెలియదు.. భవిష్యత్తులో సినీ కళామతల్లికి రెండు మూల స్తంభాలుగా నీరాజనాలర్పిస్తామని. అలాంటి కమల్, రజనీల అనుబంధాన్ని పెంచిన చిత్రం 16 వయదునిలే(పదహారేళ్ల వయస్సు). అవి కమల్ హీరోగా ఎదుగుతున్న రోజులైతే.. రజనీ నటుడిగా బిజీ అవుతున్న తరుణం. వీరిద్దరి కెరీర్ను మలుపుతిప్పిన 16 వయదునిలే చిత్రానికి సృష్టికర్త భారతీరాజా. ఈయనకు ఇది తొలి చిత్రం. ఈ చిత్ర నిర్మాణంలో ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. నేటి ప్రముఖ దర్శకుడు, నటుడు కె.భాగ్యరాజ్ ఈ చిత్రానికి సహాయ దర్శకుడు. ‘బామ్మ గొర్రెలను పెంచింది.. కోళ్లను పెంచింది.. కుక్కను పెంచలేదు.. దానికి బదులు నన్ను పెంచుకుంది’ అనే కమలహాసన్ డైలాగ్కు యూనిట్ అంతా కంటతడి పెట్టిందని కె.భాగ్యరాజ్ తెలిపారు. అదేవిధంగా శ్రీదేవి.. రజనీ ముఖంపై ఉమ్మేసే సన్నివేశంలో సబ్బు నురగ, పేస్టులంటూ ఏవేవో వేసినా దర్శకుడు భారతీరాజాకు సంతృప్తి కలగలేదు. అప్పుడు రజనీకాంత్.. శ్రీదేవిని నిజంగానే తనపై ఉమ్మేయమన్నారు. దీంతో సన్నివేశం సహజత్వంగా వచ్చిందని ఆయన తెలిపారు. దర్శకుడు భారతీరాజా మాట్లాడుతూ 16 వయదునిలే చిత్రానికి అధిక పారితోషికం చెల్లించింది కమలహాసన్కే అని చెప్పారు. ఆయన పారితోషికం రూ.27వేలని, మరో ముఖ్యమైన పాత్రకు నటుడి కోసం వెతుకుతుండగా.. స్టైలిష్గా, చలాకీగా ఉండే రజనీకాంత్ గుర్తొచ్చారని తెలిపారు. ఆయన్ను కలసి చిన్న ఆర్ట ఫిలిం చేస్తున్నాం.. మీరు నటించాలని కోరగా ‘ఆర్ట ఫిల్మా.. కథ చెప్పండి’ అంటూ విన్నారని చెప్పారు. రజనీకాంత్, పారితోషికం ఐదువేలు అడిగారని గుర్తు చేశారు. అయితే తాను మూడువేలు ఇవ్వగలనని చెప్పానని.. చివరకు 2,500 మాత్రమే ఇచ్చానని తెలిపారు. అందులో 500 ఇప్పటికీ చెల్లించలేదని వెల్లడించారు. ఇలాంటి పలు మధుర జ్ఞాపకాలను 36 ఏళ్లు తర్వాత ఒకే వేదికపై పంచుకున్నారు. ఆధునిక హంగులద్దుకుని మళ్లీ తెరపైకి రానున్న 16 వయసుదునిలే చిత్ర ప్రచార చిత్రం ఆవిష్కరణ కార్యక్రమంలో వారు ఈ విషయాలను పేర్కొన్నారు.


