
అహ్మదాబాద్ విమాన ప్రమాదం మాలీవుడ్ హీరో ఉన్ని ముకుందన్ స్పందించారు. అక్కడే దాదాపు 24 ఏళ్లు నివసించానని తెలిపారు. తాను నివాసమున్న ప్రదేశానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న మేఘనినగర్లో విమాన ప్రమాదం జరిగిందని అన్నారు. నా బాల్యమంతా అక్కడే గడిచిందని ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. తాను నివసించిన ప్రాంతంలో ఈ విషాదం జరగడం నన్ను తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఈ ఘటన విన్న వెంటనే తాను, తన పాఠశాల స్నేహితులు షాక్లో ఉన్నామని తెలిపారు. కాగా.. కేరళలోని త్రిసూర్లో జన్మించిన ఉన్ని ముకుందన్ అహ్మదాబాద్లోని మణినగర్లో పెరిగారు.
అంతకుముందు బాధితుల కుటుంబాలకు తన సంతాపాన్ని ప్రకటించారు. క్లిష్ట సమయంలో ఆ కుటుంబాలకు ధైర్యాన్ని ఇవ్వాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మ శాంతి చేకూరాలని ఉన్ని ముకుందన్ పోస్ట్ చేశారు. ఈ ప్రమాదంపై పలువురు సినీతారలు సోషల్ మీడియా వేదికగా విచారం వ్యక్తం చేశారు. కాగా.. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం కొద్ది క్షణాల్లోనే కూలిపోయింది. మేఘనినగర్లోని ప్రభుత్వ ఆసుపత్రి హాస్టల్ భవనంపై విమానం కూలిపోవడంతో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో సహా 265 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇక ఉన్ని ముకుందన్ సినీ కెరీర్ విషయానికొస్తే 'సీడన్' అనే తమిళ చిత్రంతో అరంగేట్రం చేశారు. ఆ తర్వాత 'మల్లూ సింగ్'లో ప్రధాన పాత్ర పోషించాడు. ఆ తర్వాత 'విక్రమాదిత్యన్', 'కెఎల్ 10 పట్టు', 'స్టైల్', 'ఒరు మురై', 'వంతు పార్థయ', 'అచాయన్స్', 'మాలికప్పురం' 'మార్కో' చిత్రాలతో అభిమానులను అలరించారు. నిర్మాతహా తన తొలి చిత్రం'మెప్పడియాన్'కి జాతీయ అవార్డు అందుకున్నారు.