జూ. ఎన్టీఆర్‌ తర్వాత తెలుగు రాష్ట్రాలకు సాయం చేసిన స్టార్స్‌ వీరే | Tollywood Stars Donated Money To AP And Telangana CM Relief Fund | Sakshi
Sakshi News home page

జూ. ఎన్టీఆర్‌ తర్వాత తెలుగు రాష్ట్రాలకు సాయం చేసిన స్టార్స్‌ వీరే

Sep 3 2024 1:50 PM | Updated on Sep 3 2024 8:48 PM

Tollywood Stars Donated Money To AP And Telangana CM Relief Fund

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇలాంటి విపత్తు సమయంలో ప్రజలకు సాయం చేసేందుకు టాలీవుడ్‌ చిత్రపరిశ్రమ నుంచి పలువురు ముందుకొస్తున్నారు. మొదట జూనియర్‌ ఎన్టీఆర్‌ రూ. 1 కోటి సాయం ప్రకటించిన తర్వాత ఒక్కొక్కరు తమ వంతుగా సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు.

సిద్దూ జొన్నలగడ్డ సాయం
టాలీవుడ్‌ యంగ్‌ హీరో సిద్దూ జొన్నలగడ్డ రెండు తెలుగు రాష్ట్రాలకు తన వంతుగా సాయం ప్రకటించారు. వరద బాధితులకు తన వంతుగా రూ. 30 లక్షలు ప్రకటించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు రూ. 15లక్షలు, తెలంగాణకు రూ.15 లక్షలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. తాను అందిస్తున్న డబ్బు కొంతమందికైనా ఏదో ఒకవిధంగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. భారీ వర్షాల వల్ల తెలుగు ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూస్తుంటే ఇలాంటి పరిస్థితి ఇంకెవ్వరికీ రాకూడదని ఆయన కోరారు.

త్రివిక్రమ్‌, నాగవంశీ సాయం
భారీ వర్షాల వల్ల నష్టపోయిన తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌, నిర్మాతలు రాధాకృష్ణ, నాగవంశీ సాయం ప్రకటించారు. తమ సొంత నిర్మాణ సంస్థలైన హారిక అండ్ హాసిని క్రియేషన్స్, సితార ఎంటర్టైన్మెంట్స్ పేర్లతో రూ. 50 లక్షలు ప్రకటించారు. తెలంగాణకు రూ. 25లక్షలు, ఏపీకి రూ. 25 లక్షలు ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ విపత్తు వల్ల ఆస్తి, ప్రాణ నష్టాలు తమను ఎంతగానో కలచి వేశాయని వారు చెప్పుకొచ్చారు. బాధితులు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు ఒక నోట్‌ విడుదల చేశారు.

ఇప్పటికే జూనియర్‌ ఎన్టీఆర్‌ రెండు రాష్ట్రాలకు చెరో రూ. 50 లక్షలు ప్రకటించారు. ఆపై యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ కూడా రెండు రాష్ట్రాలకు కలిపి రూ.10 లక్షలు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.

దర్శకుడు వెంకీ అట్లూరి కూడా
'సార్', 'తొలిప్రేమ' సిినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ దర్శకుడు వెెంకీ అట్లూరి కూడా తన వంతు సాయం అందజేశాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి తలో రూ.5 లక్షలు విరాళమిచ్చినట్లు ప్రకటించాడు.

మహేశ్ బాబు కోటి రూపాయల విరాళం..

టాలీవుడ్ సూపర్ స్టార్‌ మహేశ్‌ బాబు వరద బాధితుల  సాయం అందించేందుకు ముందుకొచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలకు రూ.50 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఆపదలో ఉన్న వారిని అదుకోవాలని ఇరు రాష్ట‍్రాల ముఖ్యమంత్రులను మహేశ్ బాబు కోరారు.

హీరోయిన్ విరాళం.. 

టాలీవుడ్ హీరోయిన్ అనన్య నాగళ్ల వరద బాధితులకు ఆర్థికసాయం ప్రకటించారు. తన వంతుగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో రూ.2.5 లక్షల చొప్పున సాయం అందించనున్నట్లు ట్వీట్ చేశారు. త్వరగా ఈ విపత్తు నుంచి కోలుకోవాలని ఆకాంక్షించారు. 

 

ff

హీరో నందమూరి బాలకృష్ణ భారీ విరాళం ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వరదల వల్ల విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి తలో రూ.50 లక్షలు విరాళం అందించారు. రెండు రాష్ట్రాల్లో అతి త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement