
మనకెంతో ఇష్టమైనవారిని కోల్పోతే ఆ బాధ తట్టుకోలేం. వాళ్లిక మనముందుకు ఎప్పటికీ రాలేరన్న నిజాన్ని జీర్ణించుకోలేం. ప్రస్తుతం అలాంటి బాధనే అనుభవిస్తోంది హీరోయిన్ అతియా శెట్టి (Athiya Shetty). తను ఎంతో ప్రేమగా చూసుకునే పెంపుడు కుక్క బ్రోడీ కన్నుమూసింది. దీంతో భావోద్వేగానికి లోనైన అతియా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఓ పోస్ట్ పెట్టింది. మై బ్రోడీ.. నువ్వు లేకుండా ఇంటిని, ఈ జీవితాన్ని ఊహించలేకపోతున్నాను. నా చిన్నతనంలో నాకు తోడుగా ఉన్నందుకు థాంక్యూ.. అని రాసుకొచ్చింది.

మాటల్లో చెప్పలేకపోతున్నా..
అతియా సోదరుడు, నటుడు అహాన్ (Ahan Shetty) సైతం బ్రోడీ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. నీకు వీడ్కోలు పలకాలంటే మనసు భారంగా ఉంది. నా జీవితంలో అతి ముఖ్యమైన సమయాల్లో నువ్వు నావెంటే ఉన్నావు. నువ్వు నాకెంత ఇష్టమనేది మాటల్లో చెప్పలేకపోతున్నాను. నువ్వు నాకు తోడుగా ఉన్నావ్.. ఒక తమ్ముడిలా నిలబడ్డావ్.. యు వర్ మై హార్ట్. నీకు గుడ్బై చెప్పడం ఎంతో కష్టంగా ఉంది. ఎంతగానో మిస్ అవుతాను బ్రోడీ అని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాడు. అటు సునీల్ శెట్టి సైతం.. రిప్ మై బేబీ అని బాధపడ్డాడు.
సినిమా..
బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి (Suniel Shetty)కి కూతురు అతియా శెట్టి, కుమారుడు అహాన్ సంతానం. హీరో, ముబాకరన్, మోతీచూర్ చక్నాచూర్ సినిమాలతో మెప్పించిన అతియా.. 2023లో క్రికెటర్ కేఎల్ రాహుల్ను పెళ్లాడింది. వీరికి ఈ మధ్యే పాప పుట్టింది. అహాన్.. తడప్ సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం బోర్డర్ 2, సంకి చిత్రాల్లో నటిస్తున్నాడు.