‘అగధ’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో స్వర్గీయ నందమూరి తారక రామారావుపై ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఎం. ఎస్ రాజు చేసిన ‘చికెన్’ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. పలువురు నెటిజన్స్ ఎం.ఎస్ రాజుని విమర్శిస్తూ కామెంట్స్ చేశారు. తాజాగా ఈ ‘చికెన్’ వ్యాఖ్యలపై ఎం.ఎస్ రాజు వివరణ ఇచ్చాడు. ఎన్టీఆర్పై అంతులేని అభిమానంతోనే ఆ మాటలు అన్నానని.. అంతకు మించి తనకు ఎలాంటి దురుద్దేశం లేదని ఆయన చెప్పాడు.
ప్రీరిలీజ్ ఈవెంట్ ఎం.ఎస్ రాజు ఏమన్నారంటే..
ఎం.ఎస్. రాజు దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘అగధ’ ప్రీరిలీజ్ ఈవెంట్ ఇటీవల హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎం.ఎస్ రాజు మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం తాను ఎంతో కష్టపడ్డాడని చెప్పాడు. తను పడిన కష్టం గురించి చెబుతూ..‘ఏడాదిన్నర పాటు ఎన్టీ రామారావు గారిలాగే నేను కూడా ఉదయం 3 గంటలకే నిద్ర లేచాను. ఆయనలాగా చికెన్ తినలేదు కానీ.. నేనే పాలు కాచుకొని తాగుదాం అనుకుంటే నా భార్యలేచి కాఫీ పెట్టి ఇచ్చేది. అక్కడ నుంచి మొదలెడితే అర్థరాత్రి వరకు సినిమా గురించే ఏదో ఒక పని చేసేవాడిని’అని చెప్పాడు. అయితే ఎన్టీఆర్లాగా చికెన్ తినలేదని వ్యంగ్యంగా అనడాన్ని కొంతమంది నెటిజన్స్ తప్పుపట్టారు. ఎం.ఎస్ రాజుని ట్రోల్ చేస్తూ పెద్ద ఎత్తున పోస్టులు చేశారు.
అభిమానంతోనే అలా..
తాజాగా ఈ వ్యాఖ్యలపై ఎం.ఎస్ రాజు వివరణ ఇచ్చాడు. రామారావుగారిపై ఉన్న అభిమానంతోనే అలా అన్నానని చెప్పాడు. ‘నేను ఇంత వరకు ఏ సినిమాకి కూడా బ్రహ్మ ముహుర్తంలో లేచి పని చేయలేదు. కానీ ‘అగధ’ కోసం ఎన్టీ రామారావు గారిలా ఉదయం మూడు గంటలకే నిద్ర లేచేవాడ్ని. ఆయన్ను స్పూర్తిగా తీసుకుని పని చేశాను అని చెప్పే క్రమంలో అందరికీ తెలిసిన విషయాన్ని నేను సరదాగా చెప్పాను. ఆయన ఉదయాన్నే చికెన్ తింటారు అన్నది అందరికీ తెలిసిందే. పొద్దున లేవగానే వ్యాయామం చేసేవాడు. ఆ తర్వాత స్నానం చేసుకొని పూజ చేసి.. తినడానికి వెళ్లేవాడు. పక్కనే మేము ఉంటే కూడా తినడానికి తీసుకెళ్లేవాడు. మాకు కూడా గారెలు, చికెన్ తెప్పించే వాళ్ళు.
ఆయన ఒక మంచి కోడిని ఎదురుగా పెట్టుకొని తినేవాళ్లు. నేను జరిగిందే చెప్తున్నాను. ఆయన మాట్లాడిన ప్రతి మాట వైరల్ అయ్యేది అప్పట్లో సోషల్ మీడియా ఉంటే. ఆయన గొప్ప వ్యక్తి. ఆయనలా ఉండాలి అని అనుకున్నాను. ఆయనలా ఉదయాన్నే లేచి పూజ చేసుకొని సినిమా చేశాను చికెన్ ఒక్కటే తినలేదు కాబట్టి ఆ మాట చెప్పాను అంతే. రామారావు గారి మీదున్న అంతులేని అభిమానంతోనే ఆ మాటలు నేను సరదాగా అన్నాను. మా నాన్న గారు, రామారావు గారికి మంచి అనుబంధం ఉంది. మా నాన్న గారికి రామారావు గారితో సినిమా చేసే ఛాన్స్ వచ్చినా చివరి నిమిషంలో ఎన్నికల వల్ల మిస్ అయింది. ఆయన నిబద్దత, క్రమశిక్షణను దగ్గర్నుండి చూశాను. ఎన్టీఆర్ గారి ఆత్మ మాత్రం నన్ను ట్రోల్ చేయదు. మిగతా ఎవరు ట్రోల్ చేసినా నాకు పర్లేదు’ అని ఎం.ఎస్ రాజు అన్నారు.
‘అగధ’ విషయానికొస్తే.. శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అజయ్ కేఆర్ సమర్పణలో కాశీ విశాలాక్షి బలుసు నిర్మించిన ఈ చిత్రంలో కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్కుమార్, భాను చందర్ కీలక పాత్రలు పోషించారు. ఆగస్ట్ 14న ఈ చిత్రం విడుదల కానుంది.


