ప్రముఖ నటుడు కన్నుమూత.. సంతాపం తెలిపిన రజినీకాంత్‌ | Solomon Pappaiah Passed Away at 90 Why He Rejected 200 Films | Sakshi
Sakshi News home page

ప్రముఖ నటుడు కన్నుమూత.. సంతాపం తెలిపిన రజినీకాంత్‌

Sep 12 2026 8:10 PM | Updated on Sep 12 2026 8:29 PM

Solomon Pappaiah Passed Away at 90 Why He Rejected 200 Films

తమిళ పండితుడు, ప్రముఖ  నటుడు, టీవీ వ్యాఖ్యాత సోలమన్ పప్పయ్య (90) కన్నుమూశారు. మదురైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో శుక్రవారం తుదిశ్వాస విడిచారు. శనివారం ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. అనారోగ్యం తీవ్రం కావడానికి కొద్దిరోజుల ముందు వినాయక చవితి సందర్భంగా ప్రసారం కానున్న ప్రత్యేక పట్టిమండ్రం కార్యక్రమాన్ని ఆయన రికార్డు చేశారు.
రజినీకాంత్ సంతాపం
తమిళ భాష, సాహిత్యంపై విశేష సేవలు అందించిన సోలమన్ పప్పయ్య.. ‘పట్టిమండ్రం’ను పండితుల చర్చా వేదిక నుంచి సామాన్యుల ఇళ్లలోకి తీసుకెళ్లిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఆయన మృతిపై సూపర్‌స్టార్ రజినీకాంత్‌ సంతాపం వ్యక్తం చేశారు.
అనుకోకుండా సినిమాల్లోకి.. 
సోలమన్ పప్పయ్యకు నటనపై ప్రత్యేక ఆసక్తి లేదు.  అయితే ఆయన విలక్షణమైన గొంతు, హావభావాలు, ప్రజల్లో ఉన్న ఆదరణ దర్శకులను ఆకట్టుకున్నాయి. దీంతో సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చాయి.  ‘మాప్పిళ్లై’, ‘పుదు వరుషం’ చిత్రాల్లో కనిపించిన ఆయనకు దర్శకుడు శంకర్‌ మరిన్ని అవకాశాలు ఇచ్చారు.
ఇదీ చదవండి:పెళ్లి ఇద్దరిదీ.. కానీ అమ్మాయిలకే ఎందుకు అలా: నమిత

1999లో వచ్చిన ‘ముదల్వన్’లో నటించిన పప్పయ్య.. ఆ తర్వాత ‘బాయ్స్’, ‘ఎస్ మేడమ్’ చిత్రాల్లోనూ కనిపించారు. అయితే రజినీకాంత్‌హీరోగా తెరకెక్కిన ‘శివాజీ: ది బాస్‌’ ఆయన సినీ ప్రయాణంలో ప్రత్యేకంగా నిలిచింది. ఇందులో థొండైమాన్ పాత్రలో రజినీకాంత్‌తో కలిసి చేసిన సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

200కు పైగా అవకాశాలు..
‘శివాజీ’ విజయం తర్వాత సోలమన్ పప్పయ్యకు ఏకంగా 200కు పైగా సినిమా అవకాశాలు వచ్చినట్లు సమాచారం. అయితే ఆయన ఒక్క అవకాశాన్నీ అంగీకరించలేదు. తన అసలు రంగమైన తమిళ సాహిత్యం, పట్టిమండ్రానికే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.

‘శివాజీ’లోని అంగవై, సంగవై పాత్రలకు సంబంధించిన కామెడీ సన్నివేశంపై ఆయన తర్వాత పశ్చాత్తాపం వ్యక్తం చేశారట. అంగవై, సంగవై పేర్లు తమిళ చరిత్రలో ప్రత్యేక ప్రాధాన్యం ఉన్నవని, వాటిని అలాంటి హాస్య సన్నివేశానికి ఉపయోగించడం సరికాదని అభిప్రాయపడ్డారట. ఈ కారణంగానే సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: ఎంగిలి గ్లాసులు కడిగిన నాగార్జున.. ఆ ముగ్గురు ఫిదా!

పద్మశ్రీతో గౌరవం..
తమిళ భాష, సాహిత్యం, ప్రజా చైతన్యానికి చేసిన సేవలకు గుర్తింపుగా తమిళనాడు ప్రభుత్వం 2000లో సోలమన్ పప్పయ్యను ‘కలైమామణి’ పురస్కారంతో సత్కరించింది. 2021లో 85 ఏళ్ల వయసులో భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని అందించింది. ఆరు దశాబ్దాలకు పైగా తమిళ భాష కోసం సేవలందించిన ఆయన మృతి తమిళ సాహితీ, సాంస్కృతిక రంగానికి తీరని లోటుగా మారింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement