కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్కుమార్, భాను చందర్, షిజు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘అగధ’. ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో అజయ్ కేఆర్ సమర్పణలో శ్రీ ఆదివరాహ ప్రోడక్షన్స్ పతాకంపై కాశీ విశాలాక్షి బలుసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో శ్రవణ్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఎం.ఎస్. రాజుగారు దర్శకత్వం వహించిన ‘డర్టీ హరి’లో నటించాను. కానీ ఆ సినిమా డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజైంది. ఆ తర్వాత అజయ్ భూపతిగారి డైరెక్షన్లోని ‘మంగళవారం’ చిత్రంలో కీలక పాత్ర చేశాను.
ఇప్పుడు ‘అగధ’లో నటించాను. ఈ చిత్రంలో నేను పోషించిన క్యారెక్టర్లో డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. ఇందులో నెగెటివ్ పాత్ర అనేది ఉండదు. పరిస్థితుల వల్లే పాత్రలు అలా ప్రవర్తిస్తుంటాయి. గుడ్ వర్సెస్ బ్యాడ్, గాడ్ వర్సెస్ ఈవిల్ అన్నట్టుగా కథ సాగుతుంది. కథ చెప్పిన నాలుగో రోజే సెట్స్కి వెళ్లాను. దీంతో ఈ పాత్ర కోసం నేను ప్రిపేర్ అవ్వాల్సింది అంతా సెట్స్లో అయ్యాను.
ఈ సినిమా చేయడం యాక్టర్గా నాకో కొత్త అనుభూతిని ఇచ్చింది. ఎం.ఎస్. రాజుగారు ఎప్పుడూ కొత్తగా ప్రయత్నిస్తుంటారు. ఈ చిత్రం కోసం ఆయన రాసిన కథ ప్రేక్షకులకు కొత్తగా అనిపిస్తుంది. ఇక ఇండస్ట్రీలో హీరోకి బాక్సాఫీస్ నంబర్లే ముఖ్యం. ‘అగధ’తో నాకు ఆ బాక్సాఫీస్ సక్సెస్ స్టాంప్ వస్తుందని నమ్ముతున్నాను. ప్రస్తుతం దర్శక–ద్వయం రాజ్ అండ్ డీకే దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన రైటర్ చంద్ర తెరకెక్కిస్తున్న సినిమాలో నటిస్తున్నాను. ముగ్గురు స్నేహితుల కథ ఇది’’ అని అన్నారు.


