రోజుకి రూ.లక్ష..అయినా ఊటీలో సినిమా షూటింగ్స్‌ బంద్‌...ఎందుకంటే? | Know Reason Behind Why Movie Shootings Temporarily Haulted In Ooty, More Details Inside | Sakshi
Sakshi News home page

రోజుకి రూ.లక్ష..అయినా ఊటీలో సినిమా షూటింగ్స్‌ బంద్‌...ఎందుకంటే?

Apr 6 2025 2:48 PM | Updated on Apr 6 2025 5:21 PM

Shooting Bandh In Ooty

దక్షిణాది ఉత్తరాది తేడా లేకుండా దేశవ్యాప్తంగా అన్ని భాషా చిత్రాల షూటింగ్‌ లకు స్వర్గధామం లాంటిది తమిళనాడులోని ఉదకమండలం...అదే ఊటీ(Ooty) . మన రోజా, గీతాంజలి తదితర దక్షిణాది చిత్రాలతో పాటు నాటి ‘ఖయామత్‌ సే ఖయామత్‌ తక్‌ నుంచి నిన్నా మొన్నటి బర్ఫీ దాకా ఊటీ అంటే సినిమా షూటింగ్‌లకు అచ్చొచ్చిన బ్యూటీగా నిలిచింది. ‘అజబ్‌ ప్రేమ్‌ కి గజబ్‌ కహానీ,‘ ‘అందాజ్‌ అప్నా అప్నా,‘ ‘బర్ఫీ,‘ ‘దిల్‌ సే,‘ ‘జో జీతా వోహీ సికందర్,‘ ‘రాజా హిందుస్తానీ,‘ వంటి బాలీవుడ్‌ సినిమాలు ఊటీ అందాలకు అద్దం పట్టాయి.

ఏళ్లు గడుస్తున్నా, అనేక రకాల షూటింగ్‌ స్పాట్స్‌ అందుబాటులోకి వస్తున్నా ఊటీకి మాత్రం షూటింగ్స్‌ తాకిడి తగ్గడం లేదు. ఇటీవల ‘రివర్‌డేల్‌‘ అనే కాల్పనిక పట్టణానికి నేపథ్యంగా నెట్‌ఫ్లిక్స్‌ చిత్రం ‘ది ఆర్చీస్‌‘ కూడా ఊటీలో చిత్రీకరించారు. అలాగే ది లారెన్స్‌ స్కూల్, లవ్‌డేల్‌తో సహా ‘రాజ్‌‘ చిత్రం కూడా ఊటీలో తీసినవే. ఏటా వందలాదిగా షూటింగ్స్‌ కు ఊటీ కేంద్రంగా నిలుస్తోంది. ముఖ్యంగా ఊటీలోని బొటానికల్‌ గార్డెన్స్, రోజ్‌ గార్డెన్, టాయ్‌ ట్రైన్‌ తదితర ప్రాంతాలతో పాటు పెద్ద సంఖ్యలో ఉన్న తేయాకు తోటలు కూడా సినిమా కెమెరాలకు పని చెబుతూనే ఉంటాయి.

ఈ నేపధ్యంలో ప్రస్తుతం పర్యాటకుల తాకిడితో ఊటి ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ముఖ్యంగా గత ఏడాది కనీ విని ఎరుగని స్థాయిలో భారీ సంఖ్యలో పర్యాటకులు ఊటీకి వెల్లువెత్తారు. ఊటీకి వెళ్లేదారిలో భారీగా ట్రాఫిక్‌ జామ్స్‌ సైతం ఏర్పడ్డాయి. ఇక గత వేసవిలో ఊటీలో కాలుష్యం ఎన్నడూ లేనంత స్థాయిలో నమోదైంది. దాంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.. ఇ పాస్‌ వంటి నిబంధనలతో పర్యాటకుల రాకను నియంత్రించింది. రాకపోకలను కట్టుదిట్టం చేసింది. అయితే గత ఏడాది అనుభవాలతో ఈ సారి ప్రభుత్వం మరింత ముందుగా మేల్కొంది. ముందస్తుగానే అంటే ఏప్రిల్‌ నెల రాకుండానే ఇ పాస్‌ నిబంధన విధించడంతో పాటు ఊటీలోకి 6వేల వాహనాలకు మాత్రమే ఎంట్రీ వంటి పలు ఆదేశాలు జారీ చేసింది. 

అదే క్రమంలో సినిమా షూటింగ్స్‌ పైనా నిషేధం విధించింది. ఈ ఏప్రిల్‌ నుంచి మూడు నెలల పాటు ప్రభుత్వ బొటానికల్‌ గార్డెన్, గవర్నమెంట్‌ రోజ్‌ గార్డెన్‌ సహా ఎనిమిది పార్కులలో సినిమా షూటింగ్‌లను అక్కడి ఉద్యానవన శాఖ తాత్కాలికంగా నిషేధించింది. వందల, వేల సంఖ్యలో పర్యాటకులు తమ సెలవులను ఆస్వాదించేందుకు ఈ పార్కులను సందర్శిస్తుండటంతో వారికి ఇబ్బందులు ఎదురవకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. 

ఉద్యానవన శాఖకు చెందిన ఒక అధికారి మాట్లాడుతూ, ‘‘మేము చెన్నైలోని మా ఉద్యానవన శాఖ డైరెక్టర్‌ నుంచి సరైన అనుమతి పొందిన తర్వాత మాత్రమే చిత్ర యూనిట్లను అనుమతిస్తున్నాం. సినిమా నిర్మాతలు ఒక రోజు షూటింగ్‌ కోసం కనీసం 25,000 నుంచి గరిష్టంగా 1 లక్ష వరకు చెల్లించాలి. అయితే, వేసవి సెలవుల కారణంగా ఈ ప్రదేశాలను సందర్శించే పర్యాటకుల సంఖ్య సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఊటీలోని పలు పార్కులలో అన్ని సినిమా షూటింగ్‌లను తాత్కాలికంగా నిషేధించాం’’ అని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement