
టాలీవుడ్ హీరోయిన్ సమంత తెలుగు వెండితెరకు పరిచయమై ఇప్పటికే దాదాపు 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. టాలీవుడ్లో ఏ మాయ చేశావే చిత్రం ద్వారా అడుగుపెట్టింది. ఈ మూవీలో అక్కినేని నాగ చైతన్య సరసన హీరోయిన్గా అభిమానులను మెప్పించింది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఈ లవ్ ఎంటర్టైనర్ చిత్రంలో జెస్సీ పాత్రలో మెరిసింది. ఈ మూవీ రిలీజై జూలై 18 నాటికి 15 ఏళ్లు పూర్తవుతోంది. దీంతో అక్కినేని ఫ్యాన్స్ కోసం ఏ మాయ చేశావే చిత్రాన్ని మరోసారి బిగ్ స్క్రీన్పై రిలీజ్ చేస్తున్నారు. 2010లో విడుదలైన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ వచ్చేనెల 18న రీ రిలీజ్ కానుంది.
ఈ నేపథ్యంలో ఈ సినిమా కోసం మరోసారి చైతూ, సమంత ఓకే వేదికపై కనిపిస్తారంటూ వార్తలొస్తున్నాయి. విడాకుల తర్వాత వీరిద్దరిని జంటగా ఎక్కడా చూడలేదు. ఈ సినిమా ప్రమోషన్ల కోసం వీరిద్దరు కలిస్తే ఫ్యాన్స్ చూడాలని కోరుకుంటున్నారు. దీంతో సామ్- చైతూ ఏ మాయ చేశావే ప్రమోషన్లలో కలుస్తున్నారంటూ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. తాజాగా వీటిపై హీరోయిన్ సమంత స్పందించింది. ఇంతకీ ఆమె ఏమన్నారో చూసేయండి.
తాజాగా సమంత ఈ వార్తలను కొట్టిపారేసింది. నేను ఏ మాయ చేసావే సినిమాను ప్రమోట్ చేయడం లేదని చెప్పింది. ఈ సినిమాను నేను అస్సలు ప్రమోట్ చేయడం లేదు.. అయితే ఈ టాక్ ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదు. ఈ సినిమాలోని జంటను కలిసి చూడాలని అభిమానులు ఇష్టపడొచ్చని.. కానీ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని మేము జీవించలేము కదా అంటూ సామ్ స్పష్టం చేసింది. దీంతో వీరిద్దరిని కలిసి చూడాలనుకుంటున్న అభిమానులకు నిరాశే ఎదురైంది.
తాను నటించిన మొదటి సినిమా ఏ మాయ చేసావే కాదని.. రాహుల్ రవీంద్రన్ నటించిన తమిళ చిత్రం మాస్కోవిన్ కావేరీ అని సమంత వెల్లడించింది. అయితే ఆ సినిమా షూటింగ్ మధ్యలో చాలా గ్యాప్ రావడంతో ఎవరికీ ఆ సినిమా గుర్తులేదని చెప్పుకొచ్చింది. నేను నటించిన రెండో చిత్రం ఏ మాయ చేశావే.. ఈ సినిమాలోని ప్రతి షాట్ తనకు గుర్తుందని తెలిపింది. దీంతో సమంత, నాగ చైతన్య ఏ మాయ చేసావే ప్రమోషన్ల కోసం కలవడం లేదని స్పష్టంగా తెలుస్తోంది.