
కొన్ని ప్రదేశాలు నెగెటివ్ వైబ్స్ ఇస్తుంటాయి. హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీకి వెళ్లినప్పుడు తనకూ అలాంటి నెగెటివ్ వైబ్స్ వచ్చాయంది బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ (Kajol). షూటింగ్ కోసం అక్కడికి వెళ్లినప్పుడు అంతా సరిగా ఉన్నట్లు అనిపించలేదని, వెంటనే తిరిగి వెళ్లిపోవాలనిపించిందని పేర్కొంది. ప్రపంచంలోనే అత్యంత భయానకమైన చోటుగా రామోజీ ఫిలిం సిటీని వర్ణించింది.
హోటల్లో దెయ్యాలు?
ఇలాంటి చేదు అనుభవం కాజోల్కు మాత్రమే కాదు, తాప్సీ (Taapsee Pannu), రాశీఖన్నా, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి కూడా ఎదురైందట! గతంలో తాప్సీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. దెయ్యాలున్నాయని నేను బలంగా నమ్ముతాను. అవంటే నాకు చాలా భయం. రామోజీ ఫిలిం సిటీలోని ఓ హోటల్ గదిలో బస చేసినప్పుడు నాతో పాటు ఎవరో ఉన్నట్లే అనిపించింది. ఆ హోటల్లో దెయ్యాలున్నాయని అందరూ అంటుంటే విన్నాను. కానీ, తొలిసారి అది ఎక్స్పీరియన్స్ చేశాను. నేను గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరో నడుచుకుంటూ వస్తున్న శబ్ధాలు వినిపించాయి.

దెయ్యంతో పోరాడలేను
భయంతో వణికిపోయినప్పటికీ అదంతా నా భ్రమే అని నాకు నేను సర్ది చెప్పుకుని నిద్రపోవడానికి ప్రయత్నించాను. దెయ్యంతో పోరాడేంత సినిమా నాకు లేదు అని చెప్పుకొచ్చింది. రాశీఖన్నా (Raashii Khanna) కూడా.. అదే హోటల్లో బస చేసినప్పుడు తన బెడ్ దానంతటదే ఊగిపోయిందని, తను కప్పుకున్న దుప్పటి కూడా ఎవరో లాగేశారంది. ఆ గదిలో కచ్చితంగా దెయ్యం ఉందని అభిప్రాయపడింది. ఎందుకంటే, తనకంటే ముందు పలువురు యాక్టర్స్కు ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని చెప్పినట్లు ఓ క్లిప్పింగ్ వైరల్ అవుతోంది.
కీరవాణిదీ అదే అభిప్రాయం
అలాగే ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి (MM Keeravani)కి కూడా చంద్రముఖి 2 సినిమా సమయంలో ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది. కీరవాణి మాట్లాడుతూ.. అత్యంత భయంకరమైన ప్రదేశం ఏది? అని ఇంటర్నెట్లో కొడితే రామోజీ ఫిలిం సిటీ (Ramoji Film City) పేరే వస్తుంది. అక్కడున్న సింఫనీ స్టూడియోలో లేడీ సింగర్స్ పాట పాడుతున్నారు. అప్పుడు వారి చెవిలో ఏవో శబ్ధాలు వినిపించాయి అని చెప్పాడు. సెలబ్రిటీలందరూ ఇంత ఓపెన్గా చెప్తున్నారంటే రామోజీ ఫిలిం సిటీలో నిజంగానే ఏదో ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: నా కళ్లలో నీళ్లు తిరిగాయి.. అందుకే ఆమె పెళ్లికి సాయం చేశా: శేఖర్