
తమిళ చిత్ర పరిశ్రమలో బెస్ట్ కపుల్ అనగానే హీరోయిన్ నయనతార– డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ ల జోడీ గుర్తొస్తుంది. విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించిన ‘నేను రౌడీనే’(2015) చిత్రంలో నయనతార హీరోయిన్గా నటించారు. ఆ సమయంలో నయన్–విఘ్నేశ్ల మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారడంతో పెద్దల అంగీకారంతో 2022 జూన్ 9న పెళ్లి చేసుకున్నారు. వారికి ఉయిర్, ఉలగమ్ అనే ట్విన్స్ ఉన్నారు. సోమవారం మూడవ వివాహ వార్షికోత్సవం సందర్భంగా సోషల్ మీడియా ద్వారా ఫోటోలను షేర్ చేశారు నయనతార.
‘‘ఒకరిపై ఒకరు అంతలా ఎలా ప్రేమ చూపుతారన్నది ఎప్పటికీ సమాధానం దొరకని ఆశ్చర్యపరిచే విషయం. కానీ.. నీ రూపంలో దానికి నాకు సమాధానం దొరికింది. నీ ప్రేమను వర్ణించడానికి నాకు మాటలు చాలవు. నా మనసు కోరుకునే ప్రేమవు నువ్వు. ఇద్దరిగా ప్రారంభమైన మన ప్రయాణం నలుగురుగా మారింది. ఇంతకు మించి కోరుకోవడానికి ఏముంది.
స్వచ్ఛమైన ప్రేమ అంటే ఏంటో, అది ఎలా ఉంటుందో నువ్వు నాకు చూపించావు. నా జీవిత భాగస్వామికి పెళ్లి రోజు శుభాకాంక్షలు’’ అంటూ పోస్ట్ చేశారు నయనతార. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. ఇదిలా ఉంటే.. నయనతార తెలుగులో ప్రస్తుతం చిరంజీవికి జోడీగా ‘మెగా 157’ (వర్కింగ్ టైటిల్) సినిమా చేస్తున్నారు.