పిల్లలు పుట్టరని మధుబాలను వదిలేసిన స్టార్‌ హీరో.. చివరికేమైంది? | Mumtaz: Dilip Kumar broke up with Madhubala because This Reason | Sakshi
Sakshi News home page

పిల్లలు పుట్టరని గాఢంగా ప్రేమించిన హీరోయిన్‌ను వదిలేసి మరొకరితో పెళ్లి.. చివరకు!

Apr 30 2025 5:33 PM | Updated on Apr 30 2025 6:01 PM

Mumtaz: Dilip Kumar broke up with Madhubala because This Reason

మొఘల్‌ ఇ ఆజామ్‌.. 1960లో వచ్చిన అద్భుతమైన సినిమా ఇది. సలీం, అనార్కలిగా దిలీప్‌ కుమార్‌ (Dilip Kumar), మధుబాల (Madhubala) నటించారు. ఆన్‌స్క్రీన్‌పై సూపర్‌ హిట్‌ జోడీగా పేరు తెచ్చుకున్న వీళ్లు నిజ జీవితంలో కూడా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసుండాలనుకున్నారు. దంపతులుగా కనిపిస్తారనుకుంటే విడిపోయిన ప్రేమ పక్షులుగా మారారు. అసలు ఈ జంట ​ఎందుకు విడిపోయిందన్న విషయాన్ని ప్రముఖ నటి ముంతాజ్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది.

పిల్లలు పుట్టరని..
ముంతాజ్‌ మాట్లాడుతూ.. మధుబాల దిలీప్‌కు బ్రేకప్‌ చెప్పలేదు. అతడే ఆమెతో ప్రేమబంధాన్ని తెంచేసుకున్నాడు. తనకు పిల్లలు పుట్టరని వదిలేసి.. సైరా భానును పెళ్లి చేసుకున్నాడు. సైరా ఎంతో మంచి మనిషి. దిలీప్‌ అంటే ఆమెకు ఎంతో అభిమానం, ప్రేమ. అతడి చివరి శ్వాస వరకు ఎంతో జాగ్రత్తగా చూసుకుంది. వీళ్లిద్దరి మధ్య వయసు వ్యత్యాసం ఎక్కువ. కానీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ వల్లే జీవితాంతం కలిసి కొనసాగారు.

మొఘల్‌ ఇ ఆజామ్‌ సినిమాలో ఓ దృశ్యం

అందుకే వదిలేశాడు
దిలీప్‌కు పిల్లలంటే ఇష్టం. పిల్లలు కావాలన్న కోరికతోనే సైరాను పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం నాకు స్వయంగా మధుబాల చెప్పింది. అప్పుడప్పుడు తనను కలుస్తూ ఉండేదాన్ని. తను సంతోషంగా కనిపించేది కాదు. నాతో ఏమనేదంటే.. జీవితంలో నేను ప్రేమించిన ఏకైక వ్యక్తి యూసఫ్‌ (దిలీప్‌ కుమార్‌ను యూసఫ్‌ అని పిల్చుకునేది). నేను ఎప్పటికీ తల్లిని కానని తెలిసి నన్ను ఒంటరిగా వదిలేశాడు. నాకున్న గుండె సమస్య వల్ల పిల్లల్ని కంటే నేను బతకనని చెప్పారు.

ఏనాడూ నిందించలేదు
అందుకే ఇలాంటి పరిస్థితి వచ్చింది. అయినా ఏ మగవాడికైనా పిల్లలు కావాలని ఉంటుంది కదా.. ఇందులో అతడి తప్పేముందిలే అనుకునేదే తప్ప దిలీప్‌ను నిందించేది కాదు. కానీ విషాదమేంటంటే.. దిలీప్‌- సైరా భానులకు సంతానమే లేదు. ఈ విషయంలో సైరాను చూస్తుంటే బాధగా అనిపించేది. కనీసం ఒక్కరైనా పుట్టుంటే వాళ్లెంతో మురిపెంగా చూసుకునేవాళ్లు అని ముంతాజ్‌ చెప్పుకొచ్చింది.

వేర్వేరు దారుల్లో ప్రేమజంట
దిలీప్‌ కుమార్‌ - మధుబాల దాదాపు దశాబ్దంపాటు కలిసున్నారు. వీరి బ్రేకప్‌ అనంతరం మధుబాల.. 1960లో కిషోర్‌ కుమార్‌ను పెళ్లి చేసుకుంది. 1969లో గుండెపోటుతో మరణించింది. దిలీప్‌ కుమార్‌ 1966లో తనకంటే 22 ఏళ్లు చిన్నదైన సైరా భానును పెళ్లి చేసుకున్నాడు. 1981లో రెహ్మాన్‌ను రెండో పెళ్లి చేసుకోగా 1983లో ఈమెకు విడాకులిచ్చేశాడు. తర్వాత సైరా భానుతోనే కలిసున్న దిలీప్‌ కుమార్‌ 2021లో మరణించాడు.

చదవండి: అమ్మ చనిపోయి 5 నెలలు.. వీడియో డిలీట్‌ చేయమని అడుక్కున్నా: సోహైల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement