
కోలీవుడ్ నటుడు కార్తీ కథానాయకుడుగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో ఎస్.లక్ష్మణన్ తన ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై ఇంతకుముందు నిర్మించిన చిత్రం సర్దార్. కార్తీ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రం విడుదలై మంచి విజయాన్ని సాధించింది. దీంతో అదే కాంబినేషన్లో తాజాగా రూపొందుతున్న చిత్రం సర్దార్–2. ఇందులోనూ కార్తీ ద్విపాత్రాభినయం చేస్తుండగా నటుడు ఎస్జే సూర్య, మాళవికమోహన్, ఆషికా రంగనాథ్, రాజిషా విజయన్, యోగిబాబు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. శ్యామ్ సీఎస్ సంగీతాన్ని, జార్జ్ చాయాగ్రహణం అందిస్తున్న ఈచిత్రం టీజర్ను ఇటీవల విడుదల చేశారు.
స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఉన్న ఆ టీజర్కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇది సర్దార్ చిత్రానికి మించి ఉంటుందని నిర్మాత లక్ష్మణన్ పేర్కొన్నారు. బడ్జెట్ విషయంలోనూ ఎక్కడ రాజీపడకుండా ఖర్చు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పుడు ఈ చిత్ర షూటింగ్ పూర్తి అయింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇది బ్రహ్మాండమైన యాక్షన్ అడ్వెంచర్ కథాచిత్రంగా ఉంటుందని కార్తీ తన ఎక్స్లో పోస్ట్ చేశారు. కాగా ప్రస్తుతం సర్దార్–2 చిత్రాన్ని త్వరలోనే తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి.