
ప్రస్తుతం తెలుగు సినిమా వ్యవహారాలు దాదాపు ఓటీటీ సంస్థల చేతుల్లోకి వెళ్లిపోయాయి. మూవీని ఏ తేదీన థియేటర్లలో విడుదల చేయాలనేది వారే నిర్ణయిస్తున్నారు. పాన్ ఇండియా మూవీస్కి పర్లేదు గానీ చాలామంది చిన్న, మీడియం బడ్జెట్ పెట్టే నిర్మాతలు.. తమ చిత్రాల్ని పూర్తి చేసినా సరే రిలీజ్ చేయలేకపోతున్నారు. ఈ క్రమంలోనే మంచు విష్ణు 'కన్నప్ప' ఓటీటీ గురించి పలు రకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. వాటి గురించి అడగ్గా.. విష్ణు తాజా ఇంటర్వ్యూలో సమాధానమిచ్చాడు.
'కన్నప్ప' ఓటీటీ డీల్ కుదిరిందా? అని అడగ్గా.. 'వాళ్లు ఓ ఫిగర్ చెప్పారు అది నాకు నచ్చలేదు. హిట్ అయ్యాక అమ్మితే ఎంత ఇస్తారని అడిగాను. అప్పుడు వాళ్లు చెప్పిన ఫిగర్ నాకు నచ్చింది. డబ్బులు రెడీ చేస్కోండి. విడుదలయ్యాక వస్తాను అని చెప్పాను' అని విష్ణు చెప్పుకొచ్చాడు. ఇతడి కాన్ఫిడెన్స్ చూస్తుంటే సినిమాపై చాలా నమ్మకంతోనే ఉన్నాడనిపిస్తుంది. చూడాలి మరి ఫలితం ఎలా వస్తుందో?
(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 33 సినిమాలు)
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప'. గత చిత్రాలు సరిగా ఆడకపోవడంతో చాన్నాళ్ల పాటు గ్యాప్ తీసుకుని ఈ సినిమా చేశాడు. భారీ బడ్జెట్ పెట్టి స్వయంగా నిర్మించాడు. ఇందులో ప్రభాస్, మోహన్ లాల్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్, కాజల్.. ఇలా చాలామంది స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. మార్కెట్ పరంగా చూసుకుంటే దక్షిణాది స్టార్స్ చాలామంది ఉన్నారు. సినిమా హిట్ అయితే ఓటీటీల నుంచి డిమాండ్ ఉండొచ్చు. ఒకవేళ తేడా కొడితే మాత్రం అంతే సంగతులు.
జూన్ 27న 'కన్నప్ప' సినిమా థియేటర్లలోకి రానుంది. చాన్నాళ్ల క్రితం తొలుత ఓ టీజర్ రిలీజ్ చేయగా.. విపరీతమైన ట్రోలింగ్ వచ్చింది. కాస్త గ్యాప్ తీసుకుని మరో టీజర్ రిలీజ్ చేయగా, నెగిటివిటీ కాస్త తగ్గింది. ప్రస్తుతం ప్రమోషన్ల బాధ్యత విష్ణునే తీసుకున్నాడు. పలు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉన్నాడు. త్వరలో తెలుగు రాష్ట్రాల్లో ఈవెంట్ చేయబోతున్నాడు. దీనికి ప్రభాస్ కూడా హాజరవుతాడని టాక్.
(ఇదీ చదవండి: పవన్ 'హరిహర..' పరువు తీసిన యాంకర్!)