
పోలీస్ స్టేషన్లో ఫైట్ చేస్తున్నారట ఎన్టీఆర్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ‘డ్రాగన్’ (ప్రచారం) అనే మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ఓ పోలీస్ స్టేషన్ సెట్లో జరుగుతోందని సమాచారం. పోలీస్ స్టేషన్ బ్యాక్డ్రాప్లో వచ్చే ఓ యాక్షన్ సీక్వెన్స్ను దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారని, 500 మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులు ఈ సీక్వెన్స్లో పాల్గొంటున్నారని టాక్.
ఈ యాక్షన్ సీక్వెన్స్ ఈ సినిమాలో ఓ హైలైట్గా ఉంటుందట. ఇక ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారని, మలయాళ నటుడు టొవినో థామస్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారని టాక్. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టీ–సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్ 25న విడుదల కానుంది.