
బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ సినిమా 'జాట్'. భారీ బడ్జెట్తో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 10న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్కు బాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. భారీ మాస్ యాక్షన్ సీన్స్ కనిపించడంతో వారికి కొత్తగా జాట్ సినిమా కనిపిస్తోంది. తమన్ అందించిన సంగీతం కూడా సినిమాకు ప్లస్ అవుతుంది. రీసెంట్గా ఊర్వశి రౌతేలా స్టెప్పులేసిన ఒక స్పెషల్ సాంగ్ను విడుదల చేసి సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేశారు.
2023లో వీరసింహారెడ్డి చిత్రం తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'జాట్' కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ, ఈ సినిమా తెలుగులో విడుదల కావడం మరింత ఆలస్యం అవుతుందని తెలుస్తోంది. తెలుగు వర్షన్ డబ్బింగ్ పనులు పూర్తి కాకపోవడంతో హిందీతో పాటుగా టాలీవుడ్లో ఈ మూవీ విడుదల కాకపోవచ్చని సమాచారం. అయితే, పాన్ ఇండియా రేంజ్లో ఒకేసారి రిలీజ్ చేయాలని మేకర్స్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారట. ఏప్రిల్ 10లోపు పనులు పూర్తి కాకుంటే తెలుగు వర్షన్ మరో వారం ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉంది.
టాలీవుడ్కు సన్నీ డియోల్ ఫిదా
జాట్ సినిమాలో రణదీప్ హుడా విలన్గా నటిస్తున్నారు. వినీత్ కుమార్ సింగ్, సయామీ ఖేర్, రెజీనా కీలకపాత్రల్లో మెప్పించనున్నారు. ఈ సినిమాని లార్జర్ దేన్ లైఫ్ యాక్షన్ డ్రామాగా భారీ బడ్జెట్తో సినిమా తెరకెక్కించారు. జాట్ సినిమాకు దర్శకుడు, నిర్మాత తెలుగు వారే కావడం విశేషం. అయితే, బాలీవుడ్ నిర్మాతలు టాలీవుడ్ వాళ్లని చూసి ఎన్నో విషయాలు నేర్చుకోవాలని సన్నీ డియోల్ తాజాగా అన్నారు. టాలీవుడ్ వాళ్లతో కలిసి వర్క్ చేయడం తనకు నచ్చిందని ఆయన ప్రశంసించారు. సౌత్ వాళ్లతో మరో సినిమా చేయాలనుకుంటున్నట్లు ఆయన ఆశించారు. భవిష్యత్లో సౌత్ పరిశ్రమలో స్థిరపడాలని ఉంది అని సన్నీ డియోల్ అన్నారు.