ముంబై పై హైదరాబాద్‌ పై చేయి... ఇండియన్‌ సినిమా అడ్రెస్‌ మారనుందా? | Indian Movie Capital Not Mumbai Now in Hyderabad Why | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌కు వస్తున్న బాలీవుడ్‌.. అసలు కారణాలు ఏంటి..?

Apr 14 2025 10:35 AM | Updated on Apr 14 2025 11:18 AM

Indian Movie Capital Not Mumbai Now in Hyderabad Why

భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరో ఇక్కడివాడే, అత్యధిక పారితోషికం తీసుకునే దర్శకుడు ఇక్కడివాడే, అత్యధిక  చిత్రాలు రూపొందేది ఇక్కడే...ఇలాంటి అనేకానేక విశేషాలతో ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమ టాలీవుడ్‌కి  రాజధానిగా ఉన్న హైదరాబాద్‌... ఇప్పుడు శరవేగంగా భారతీయ సినిమాకు రాజధానిగా  మారిపోతోంది. నిజానికి ముంబై చాలా కాలంగా భారతదేశ చలనచిత్ర రాజధాని అనేది తెలిసిందే, దేశంలో ఏ భాషా చిత్రపరిశ్రమకు చెందిన నటీనటులైనా, దర్శకులైనా, సాంకేతిక నిపుణులైనా తమ కెరీర్‌లో కనీసం ఒక్కసారైనా హిందీ సినిమా చేయాలని కలలు కంటారు. అలా చేయడం అంటే తమకు ప్రమోషన్‌ వచ్చినట్టుగా భావిస్తారు. ఒకప్పుడు దక్షిణాది సూపర్‌స్టార్లు అనేక మంది హిందీ సినిమాల ద్వారా  బాలీవుడ్‌పై తమదైన ముద్ర వేయాలని విఫలయత్నం చేసినవారే.

ఆ ఆధిపత్యం ఇక గతం...?
అయితే ఇండియన్‌ మూవీపై ముంబై ముద్ర ఇక గతంగా మారనుందా?  ఇప్పటిదాకా ముంబై కేంద్రంగా సాగుతున్న భారతీయ సినిమా పరిశ్రమ క్రమంగా హైదరాబాద్‌ తన స్థానాన్ని ఆక్రమించడంతో తన ఆధిపత్యాన్ని కోల్పోతున్నట్లు కనిపిస్తోంది.గతంలో, బాలీవుడ్‌ అవకాశాల కోసం చాలా మంది తెలుగు  తమిళ నటీనటులు ముంబైకి తరచుగా వచ్చేవారు. అంతేకాదు బాలీవుడ్‌ నటులు, సాంకేతిక నిపుణులు అంటే దక్షిణాదిలో విపరీతమైన క్రేజ్‌ ఉండేది. అక్కడి చిన్నా చితకా నటీనటులు కూడా హైదరాబాద్‌ వచ్చి తెలుగు సినిమాల్లో నటించాలంటే డబుల్, త్రిబుల్‌ ఫీజులు డిమాండ్‌ చేసేవారు. అయినా వాళ్లనే తెచ్చుకుని నిర్మాతలు గొప్పలు  చెప్పుకునేవారు. అయితే  ఇప్పుడు ఆ ట్రెండ్‌ రివర్స్‌ అయింది.

ఛలో హైదరాబాద్‌...అంటున్న దర్శక నిర్మాతలు
తెలుగులో రూపొందిన పాన్‌–ఇండియా చిత్రాల వెల్లువ పరిశ్రమను పునర్నిర్మించింది, హిందీ సినిమాను  చాలా పెద్ద మార్కెట్‌లో ఓ చిన్న భాగం గా మార్చేసింది.   రాజమౌళి  బాహుబలి సిరీస్‌ నుంచి, మనవాళ్లు పాన్‌–ఇండియా చిత్రాల వైపు మళ్లడం మరింత పెరిగింది. అకస్మాత్తుగా ఊపందుకున్న ఈ ట్రెండ్‌తో ఉక్కిరి బిక్కిరవుతున్న ముంబై చిత్రనిర్మాత దర్శకులు ఆ స్థాయి చిత్రాల కోసం దక్షిణ భారత పరిశ్రమపై, ముఖ్యంగా హైదరాబాద్‌లో ఉన్న వారిపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. ముంబై నుంచి దర్శక నిర్మాతలు ఇక్కడి నటీనటుల కాల్షీట్స్‌ కోసం ప్రయత్నించే క్రమంలో హైదరాబాద్‌ వస్తున్నారు.ముంబైకి చెందిన కార్పొరేట్‌ ఎగ్జిక్యూటివ్‌లు కూడా తెలుగు సినిమా నిర్మాతలతో ప్రాజెక్ట్‌ల గురించి చర్చించేందుకు హైదరాబాద్‌కు ఛలో అంటున్నారు.

నటీనటులు సైతం  అదే బాట...
ముంబైకి చెందిన చాలా మంది నటులు  నటీమణులు క్రమం తప్పకుండా హైదరాబాద్‌కు వస్తున్నారు, నిర్మాతలు  దర్శకులతో నిత్యం టచ్‌లో ఉంటున్నారు. తెలుగు దర్శకుడు సందీప్‌ వంగా యానిమల్‌ సినిమా ద్వారా బాబీ డియోల్‌కి  అందించిన బాక్సాఫీస్‌ హిట్‌ లాగే పాన్‌–ఇండియా చలనచిత్రాలు తమ కెరీర్‌ పునరుజ్జీవనాన్ని అందిస్తాయని ఆశిస్తూ  బాలీవుడ్‌లోని అగ్రశ్రేణి నటీనటులు కూడా హైదరాబాద్‌కు చెందిన చిత్ర నిర్మాత దర్శకులతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నారు.

తిరిగొస్తున్న వలస ప్రముఖులు
దూరపు కొండల నునుపును చూసి ముచ్చటపడిన పలువురు దర్శకులు, నటీనటులు తూచ్‌ అనుకుంటున్నారు. గతంలో దర్శకుడు పూరీ జగన్నాధ్, ముంబైలో స్థిరపడాలని భావించాడు. అయితే  తిరిగి హైదరాబాద్‌కు మారాలని నిర్ణయించుకున్నాడు. అలాగే ఇక్కడ అవకాశాలు బాగున్నా సరే  బాలీవుడ్‌ ఛాన్సుల కోసం పెట్టె బేడా సర్ధుకున్న పలువురు తారలు సైతం తిరిగి హైదరాబాద్‌ వైపు చూస్తున్నారు. నిజానికి ప్రస్తుతం ఒక్క తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా తమిళ, మళయాళ చిత్రాలు సైతం భారతీయ సినిమా రంగంలో సత్తా చాటుతున్నాయి. 

ఇలా మొత్తంగా దక్షిణాది చిత్రాలు భారీ విజయాలు నమోదు చేస్తున్న నేపధ్యంలో ఏర్పడిన పరిస్థితి హైదరాబాద్‌కు లాభించిందని చెప్పాలి. మిగిలిన ఏ దక్షిణాది భాషా చిత్ర పరిశ్రమకూ హైదరాబాద్‌ లాంటి వైవిధ్యభరిత అవకాశాలు అందించే అత్యాధునిక నగరం  లేకపోవడం కూడా మరో కారణం. ఇటీవల బాలీవుడ్‌ తారలు, ప్రముఖులు హైదరాబాద్‌లో రెస్టారెంట్లు, జిమ్స్, బొటిక్స్‌ తదితర వ్యాపారాలు ప్రారంభిస్తూ హైదరాబాద్‌కు తరచుగా రాకపోకలు సాగించేందుకు మరికొన్ని కారణాలు సృష్టించుకుంటున్నారు. ఇలాంటి వ్యాపారాల్లో టాలీవుడ్‌ ప్రముఖులు సైతం పార్ట్‌నర్స్‌గా మారుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement