
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత పదేళ్లలో విడుదలైన సినిమాలకు ప్రతిష్ఠాత్మక గద్దర్ సినీ పురస్కారాలను ప్రకటించింది. ఒక్కో ఏడాదికిగానూ ప్రథమ, ద్వితీయ, తృతీయ ఉత్తమ చిత్రాల్ని పురస్కారాలకు ఎంపిక చేసింది. 2014 ఏడాదిగానూ సెకండ్ బెస్ట్ ఫిల్మ్గా 'పాఠశాల' చిత్రం ఎంపికైంది.
మాహి వి రాఘవ దర్శకత్వం వహించిన 'పాఠశాల' చిత్రాన్ని రాకేశ్ మహాంకాళి, పవన్ కుమార్ రెడ్డి నిర్మించారు. ఐదుగురు మిత్రులు, ఐదు వారాలపాటు, 5 వేల కిలోమీటర్ల ప్రయాణాన్ని ఆవిష్కరిస్తూ తెరకెక్కించారు. యువత, స్నేహం, ఆత్మవిశ్వాసం వంటి విలువలను అందంగా చూపించే ఒక అద్భుతమైన కథగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మనసుల్ని తాకిన గొప్ప కథనం, ఆకట్టుకునే సంగీతం, అద్భుతమైన విజువల్స్ మేళవింపుతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా 2014 ఏడాది సెకండ్ బెస్ట్ ఫిల్మ్గా గద్దర్ సినీ అవార్డ్కు ఎంపికైంది.
ప్రతిష్ఠాత్మక గద్దర్ ఫిల్మ్ పురస్కారానికి పాఠశాల చిత్రం ఎంపికకావడం పట్ల చిత్ర నిర్మాతలు ఆనందం వ్యక్తం చేశారు. 'పాఠశాల' చిత్రం గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ 2014లో రెండవ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ ఎంపిక కావడం గౌరవంగా భావిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ గుర్తింపు మా చిత్రానికి ఉన్న శాశ్వతమైన ప్రభావాన్ని, విలువలను మరింత బలపరుస్తోందని అన్నారు.