దినేశ్ కుమార్, దివిజ జంటగా నటిస్తోన్న చిత్రం 'వెంకట్రామయ్య గారి తాలూకా'. ఈ సినిమాకు సతీష్ ఆవాల దర్శకత్వం వహించారు. ఈ మూవీని కోమలి క్రియేషన్స్ బ్యానర్పై కోమలి మహేందర్ తొట్టె, సోమేష్ సారిపల్లి సంయుక్తంగా నిర్మించారు. ఈటీవీ ప్రభాకర్ కుమార్తె దివిజ ఈ మూవీతోనే హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోంది. తాజాగా ఈ మూవీ టీజర్, పాటల ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్లో ఘనంగా జరిగింది.
దర్శకుడు సతీష్ ఆవాల మాట్లాడుతూ..."మన దేశ సంస్కృతిలో పెద్దలకు గౌరవం ఇవ్వడం గొప్ప సంప్రదాయం. కుటుంబాల్లో ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కోవాలో ఈ సినిమా చూపిస్తుంది. నేను జర్నలిజం నుంచి వచ్చిన వ్యక్తిని. కుటుంబ బంధాల విలువ నాకు బాగా తెలుసు. సోషల్ మీడియాలో దివిజ వీడియోలు చూసి ఈ పాత్రకు సరిపోతుందని భావించి ఈటీవీ ప్రభాకర్ గారిని సంప్రదించా. మనసున్న ప్రతి ఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుంది" అని తెలిపారు.
ఈటీవీ ప్రభాకర్ మాట్లాడుతూ... "ముత్యాల సుబ్బయ్య గారి చిత్రాలను గుర్తు చేసే గొప్ప కథ ఇది. చాలా కాలం తర్వాత ఇలాంటి కథ వినడంతో మా అమ్మాయి దివిజను ఈ సినిమా చేయమని ప్రోత్సహించా. నిర్మాత కోమలి ఎంతో కష్టపడి సినిమా నిర్మించారు. దర్శకుడు సతీష్ ఆవాల తన భుజాలపై బాధ్యత తీసుకుని అద్భుతంగా తెరకెక్కించారు. నాన్న గొప్పతనం, తల్లిదండ్రుల విలువను ఎంతో హృద్యంగా చూపించారు. . డాక్టర్ అవుతుందనుకున్న మా అమ్మాయి ఈ సినిమాతో నటిగా పరిచయమవుతోంది. అందరూ ఆశీర్వదించాలి. ఈ చిత్రం ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నా" అని అన్నారు.
తల్లిదండ్రుల విలువ, కుటుంబ బంధాలు, ఫాదర్ సెంటిమెంట్గా ఈ మూవీని తెరకెక్కించారు. ప్రస్తుత సమాజంలో డబ్బు చుట్టూ తిరుగుతున్న మానవ సంబంధాలు, వృద్ధాప్యంలో తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న సమస్యలను కథాంశంగా కుటుంబ కథా చిత్రమని మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమాలో మురళీధర్ గౌడ్, సుధ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 18న థియేటర్లలో విడుదల కానుంది.


