
మోహన్లాల్ (Mohanlal) ప్రధాన పాత్రలో నటించిన ‘ఎల్2: ఎంపురాన్’ (L2:Empuraan) చుట్టూ వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర నిర్మాత ఆఫీస్లో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. 2002లో గుజరాత్లో చోటుచేసుకున్న అల్లర్లను తప్పుగా ఇందులో కీలక సన్నివేశాలుగా చూపించారని విమర్శలు వచ్చాయి. ఆపై విలన్ పేరును భజరంగిగా పెట్టడం కూడా తప్పుబట్టారు. బీజేపీ ఎంపీ, మలయాళ నటుడు సురేష్ గోపీ కూడా రాజ్యసభలో ఈ మూవీపై మాట్లాడారు. ఇప్పటికే కొందరు బీజేపీ నేతలు ఈ చిత్రాన్ని బాయ్కాట్ చేయాలంటూ పిలుపునిచ్చారు. ఇలాంటి సమయంలో నిర్మాతపై ఈడీ దాడులు చేయడం చర్చనియాంశంగా మారింది.
లూసిఫర్2 సినిమాపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో నిర్మాతలలో ఒకరైన గోకులం గోపాలన్ చిట్ ఫండ్ కంపెనీలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఆయనకు సంబంధించిన తమిళనాడు, కేరళ కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేసింది. సుమారు రూ.1,000 కోట్ల విదేశీ మారక ద్రవ్య ఉల్లంఘన కేసుకు సంబంధించి ఈ సోదాలు జరిగినట్లు తెలుస్తోంది. చెన్నైలోని కోడంబాక్కంలోని గోకుల్ చిట్ ఫండ్స్ కార్యాలయంతో సహా అనేక ప్రదేశాలలో ఈడీ దాడులు ప్రారంభమయ్యాయి.
పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎల్2: ఎంపురాన్’ (L2:Empuraan) బాక్సాఫీస్ వద్ద ఇప్పటి వరకు సుమారు రూ. 240 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. సినిమాపై వివాదం రావడంతో సుమారు 17 సెన్సార్ కట్స్ చేశారు. దీంతో సినిమా నిడివి సుమారు 5నిమిషాలు తగ్గింది.