
‘‘రచ్చ, బెంగాల్ టైగర్, గౌతమ్ నంద’.. ఈ తరహా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న నేను ‘ఓదెల 2’లాంటి కథ రాస్తాననుకోలేదు. నా భార్య మా ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్టించి ఎనిమిదేళ్లుగా పూజలు చేస్తోంది. మా నానమ్మ శివశక్తిగా ఉండేవారు. అప్పట్లో నేను కొన్ని సంఘటలను మా ఊర్లో గమనించాను. నా మనసులో ఉన్న అవన్నీ ‘ఓదెల 2’ రూపంలో బయటకు వచ్చాయి’’ అని దర్శక– నిర్మాత, రచయిత సంపత్ నంది అన్నారు. తమన్నా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఓదెల 2’. సంపత్ నంది సూపర్ విజన్లో అశోక్ తేజ దర్శకత్వంలో డి. మధు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న రిలీజ్ కానుంది.
ఈ సందర్భంగా సంపత్ నంది మాట్లాడుతూ–‘‘అశోక్ తేజని డైరెక్టర్ చేయాలని ‘ఓదెల రైల్వేస్టేషన్స్ ’ మూవీ తీశాం. ఆహా ఓటీటీలో విడుదలైన ఆ మూవీ చాలా సక్సెస్ అయ్యింది. ఈ మూవీకి సీక్వెల్గా ‘ఓదెల 2’ చేస్తే బాగుంటుందన్నట్లుగా అశోక్ తేజ చెప్పాడు. ఓ సారి భీమ్స్తో మ్యూజిక్ సిట్టింగ్స్ చేస్తున్నప్పుడు సీక్వెల్ క్రియేట్ చేయవచ్చనిఅనిపించింది. తొలిపార్టులో రాధ క్యారెక్టర్ హైలైట్ అవుతుంది. సీక్వెల్లో మరో ఫీమేల్ క్యారెక్టర్ అయితే బలంగా ఉంటుందని శివశక్తి పాత్రకు తమన్నాగారిని తీసుకున్నాం. ఆత్మకు, పరమాత్మకు మధ్య జరిగే యుద్ధమే ‘ఓదెల 2’.
ఓ పంచాక్షరి మంత్రంతో నాగసాధువు శివశక్తి.. ఓ ప్రేతాత్మను ఎలా కంట్రోల్ చేసింది? అన్నదే కథాంశం. ‘అరుంధతి’ సినిమాతో మా చిత్రానికి పోలిక లేదు. నిర్మాత రాధామోహన్స్ గారికి ‘ఓదెల 2’ కథ చెప్పాను. ఆ సమయంలో ఆయన హిందీ మూవీతో బిజీగా ఉండటంతో డి.మధుగారు నిర్మించారు. సాంకేతిక నిపుణులకు డబ్బు ముఖ్యం కాదు.. ప్రేక్షకుల అభినందనలే ముఖ్యం. ‘ఓదెల 3’ కి అవకాశం ఉంది. నా దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా ఓ పీరియాడికల్ ఫిల్మ్ రానుంది. దర్శకుడిగా నాకు కొంత గ్యాప్ వచ్చింది. కానీ.. మరో ముప్పై ఏళ్లు ఇండస్ట్రీలో ఉండేలా సినిమాలు చేసుకుంటూ వెళ్లాలనుకుంటున్నాను’’ అని చెప్పారు.