మెగా ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేని సినిమాల్లో 'గేమ్ ఛేంజర్' ఒకటి. గతేడాది సంక్రాంతికి థియేటర్లలో రిలీజై దారుణంగా ఫ్లాప్ అయింది. తొలిరోజే ఫ్లాప్ టాక్ బయటకొచ్చింది గానీ వీకెండ్ వరకు ఎలాగోలా మేనేజ్ చేశారు. దీని దెబ్బకు డైరెక్టర్ శంకర్ అడ్రస్ లేకుండా పోయారు. ఇప్పటికీ మరో ప్రాజెక్ట్ మొదలుపెట్టలేకపోతున్నారు. ఈ మూవీ వచ్చి ఏడాదిన్నర దాటిపోయినా ఎప్పటికప్పుడు ఏదోలా డిస్కషన్స్లోకి వస్తూనే ఉంది. లేటెస్ట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మాత దిల్ రాజు ఈ మూవీ ఫ్లాప్పై మరోసారి ఓపెన్ అయ్యారు. డిజాస్టర్ అవ్వడానికి అసలు కారణాలతో పాటు ఇందులోని నాలుగు పాటలకు రూ.75 కోట్లు ఖర్చు పెట్టడంపైనా స్పందించారు.
(ఇదీ చదవండి: విజయ్.. నెలకు 20 రోజులు మాత్రమే)
'దర్శకుడు శంకర్ సినిమాల్లో పాటలు చాలా స్పెషల్. మూవీ అంతా సాధారణంగా తీసినా పాటలు ఒక్కొక్కటి ఒక్కోలా డిజైన్ చేస్తాను అని శంకర్ చెప్పారు. ఆయన సాంగ్స్ ఎలా తీస్తారో మనందరికీ తెలుసు. గత చిత్రాల్లో చూశాం. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే.. మూవీ కంటెంట్ ప్రేక్షకుల్ని మెప్పించనప్పుడు ఎంత అద్భుతంగా తీసినా ఉపయోగం లేదు. 'గేమ్ ఛేంజర్' విషయంలో అదే జరిగింది. ఒకవేళ కంటెంట్ సూపర్ ఉండి, ఆడియో సూపర్ హిట్ అయితే అది సినిమాకు ప్లస్ అవుతుంది. అలా జరనప్పుడు మూవీకి నష్టమే. షూటింగ్ కూడా చాన్నాళ్ల పాటు సాగింది. సినిమాలో ఎన్నికల గురించి చూపించాం. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత రావడంతో ఆడియెన్స్కి కనెక్ట్ కాలేదు. స్టోరీలో కొత్తదనం లేక.. ఇది ఎక్కడో చూసినట్లు ఉందే అని చాలామందికి అనిపించింది' అని దిల్ రాజు చెప్పుకొచ్చారు.
అలానే 'గేమ్ ఛేంజర్' సినిమా వల్ల కోల్పోయిన డబ్బులు.. మూడు రోజుల తర్వాత రిలీజైన 'సంక్రాంతికి వస్తున్నాం'తో 80 శాతం రికవరీ అయిందని కూడా దిల్ రాజు చెప్పారు. 'గేమ్ ఛేంజర్'లో నాలుగు పాటల కోసం రూ.75 కోట్ల ఖర్చు చేశారా అనే రూమర్స్ నిజమే అని అన్నారు. అలానే ఇప్పుడు తీస్తున్న తెలుగు సినిమాల్లో 40 శాతం వరకు బడ్జెట్.. హీరో రెమ్యునరేషన్కే వెళ్లిపోతోందని, ఇప్పుడిప్పుడే అందరూ షేరింగ్ విధానంలోకి వస్తున్నారని అన్నారు. ఇప్పటికే హిందీలో అందరూ హీరోలు ఇదే పద్ధతి ఫాలో అవుతున్నారని.. త్వరలో తెలుగులోనూ పూర్తిస్థాయిలో వచ్చే అవకాశముందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
(ఇదీ చదవండి: నటుడిని వరించిన లాటరీ.. సరదాగా టికెట్స్ కొంటే)


