
కశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి వల్ల 26 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఎలాగైనా సరే సదరు ఉగ్రవాదుల్ని చంపాల్సిందే అని ప్రతి ఒక్క భారతీయుడు కోపంతో రగిలిపోతున్నారు. ఇలాంటి సమయంలో ప్రముఖ సింగర్ చిన్మయి వివాదాస్పద పోస్ట్ పెట్టింది. కులం ఆధారంగా తక్కువ చేసి చూసేవాళ్లూ టెర్రరిస్టులతో సమానమని చెప్పుకొచ్చింది.
(ఇదీ చదవండి: భర్తతో కలిసి కాస్ట్ లీ కారు కొన్న హీరోయిన్)
ఇంతకీ ఏం జరిగింది?
దక్షిణాదిలో సింగర్, డబ్బింగ్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న చిన్మయి.. నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంది. ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయమై ట్వీట్, పోస్ట్ పెడుతూ వివాదాలు కొనితెచ్చుకునే చిన్మయి.. ఇప్పుడు కూడా అలాంటి పోస్ట్ పెట్టింది.
చిన్మయి పోస్టులో ఏముంది?
'నేను షెడ్యూల్ కులానికి చెందిన అమ్మాయిని. సోకాల్డ్ హిందువులు.. నేను వాళ్లలో ఒకరినే అనే విషయాన్ని మర్చిపోయారు. ఎందుకంటే నా చిన్నతంలో మా ఊరి దేవాలయానికి వెళ్లేదాన్ని. పూజారి మాత్రం నాకు నేరుగా ప్రసాదం ఇచ్చేవారు కాదు. నా కాలేజీ రోజుల్లోనూ అంతే. రిజర్వేషన్ల వల్ల మీరంతా మా నెత్తిపై కూర్చున్నారని మా లెక్చరర్ అనేవారు. ఇలాంటి అవమానాలు ఎన్నో ఎదుర్కొన్నాను'
'చెప్పడానికి బాధగా ఉన్నా.. నా చుట్టూ ఉంటే అగ్ర కులానికి చెందినవాళ్లు, కులం ఆధారంగా తక్కువ చేసే చూసేవాళ్లందరూ కూడా టెర్రరిస్టులతో సమానమే. ఎందుకంటే వీళ్లందరూ నా మానసిక పరిస్థితిని బాగా ఇబ్బంది పెట్టాడు. కులం చూసి కొందరు చంపేస్తున్నారు. కులం ఆధిపత్యం చూపించి మరికొందరు మానసికంగా హింసించి చంపేస్తున్నారు' అని చిన్మయి తన పోస్టులో రాసుకొచ్చింది.
సమయం సందర్భం లేకుండా చిన్మయి ఇలాంటి పోస్ట్ పెట్టడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమెని నోటికొచ్చినట్లు అంటున్నారు.
(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు)