ఫేమస్ కావడానికే టార్గెట్‌ చేశాడు: అర్షద్‌ వార్సీపై బోనీ కపూర్ ఆగ్రహం | Boney Kapoor Reacts On Arshad Warsi Claim Of Being Paid Less Remuneration For Song, Deets Inside | Sakshi
Sakshi News home page

Boney Kapoor: అతను పెద్ద స్టార్‌ కాదు.. అయినా ఎక్కువే ఇచ్చారు: బోనీకపూర్

Aug 23 2024 3:54 PM | Updated on Aug 23 2024 4:02 PM

Boney Kapoor Reacts On Arshad Warsi For Claiming Less Remuneration For Song

బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో ప్రస్తుతం ఆ పేరు ఒక్కటే వినిపిస్తోంది. ప్రభాస్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసి ఒక్కసారిగా ఫేమ్‌లోకి వచ్చేశాడు నటుడు అర్షద్‌ వార్సీ. అతను చేసిన కామెంట్స్‌ ఇప్పటికే టాలీవుడ్ స్టార్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కల్కి సినిమాలో ప్రభాస్‌ పాత్ర జోకర్‌ లా ఉందంటూ అవమానకర రీతిలో మాట్లాడారు. అయితే అర్షద్ కేవలం ప్రభాస్‌ను మాత్రమే కాదు.. ప్రముఖ నిర్మాత బోనీ కపూర్‌పై సైతం విమర్శలు చేశారు. అతని సినిమా కోసం పని చేశానని.. కానీ సరైన పారితోషికం చెల్లించలేదని అర్షద్ వార్సీ ఆరోపణలు చేశారు.

అయితే తాజాగా తనపై చేసిన కామెంట్స్‌పై బోనీ కపూర్ రియాక్ట్ అయ్యారు. అర్షద్ వార్సీ చేసిన వ్యాఖ్యలు వింటే కామెడీగా ఉందని అన్నారు. ఈ రోజుల్లో ప్రతిఒక్కరూ మీడియా అటెన్షన్‌ కోసం ప్రయత్నిస్తున్నారని.. ఇప్పుడు అతనికి నేను దొరికానని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా.. శ్రీదేవి, అనిల్ కపూర్ జంటగా 1993లో వచ్చిన చిత్రం రూప్ కి రాణి చోరోన్ కా రాజా. ఈ సినిమాలోని ఒక పాటకు కొరియోగ్రఫీ చేసినందుకు బోనీ కపూర్ ప్రొడక్షన్ హౌస్ తనకు రూ. 25 వేలు తక్కువగా చెల్లించిందని అర్షద్ వార్సీ ఇటీవల ఆరోపించాడు. తాజాగా వార్సీ ఆరోపణలపై బోనీ కపూర్‌ కౌంటరిచ్చారు.

బోనీ మాట్లాడుతూ..'అర్షద్ స్టేట్‌మెంట్ చదివి నవ్వుకున్నా. 1992లో సినిమా పాటను షూట్ చేశాం. ఆ సమయంలో అతను పెద్ద స్టార్ కాదు. అతనికి అంత పెద్ద మొత్తం ఎవరు చెల్లించారు?. షూటింగ్ పూర్తి చేయడానికి నాలుగు రోజులు పడుతుందని అనుకున్నాం. కానీ మూడు రోజుల్లోనే పూర్తయింది. అర్షద్‌కు రోజుకు రూ.25 వేలు చెల్లించారు. మూడు రోజులకు కలిపి రూ.75,000 ఇచ్చారు. అసలు పారితోషికం విషయంలో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు. కానీ ఆయన ఇప్పుడు ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు. ఇన్నేళ్లు ఎందుకు మాట్లాడలేదు' ‍అని ప్రశ్నించారు. 

అంతకుముందు ఇంటర్వ్యూలో అర్షద్ వార్సీ మాట్లాడుతూ..'ఆ సినిమా వర్క్ కోసం నన్ను సంప్రదిస్తే కొరియోగ్రఫీ చేయడానికి నాలుగు రోజుల సమయం పడుతుందని రూ.లక్ష పారితోషికం అడిగా. అప్పుడు ఓకే అన్నారు. కానీ పాటను త్వరగా పూర్తి చేయమని నన్ను అడిగారు. నా వంతు ప్రయత్నం చేస్తానని చెప్పా. మూడు రోజుల్లోనే పని పూర్తి చేశా.  చెక్కు తీసుకోవడానికి వెళ్తే రూ.75 వేలే ఇచ్చారు. అదేంటని అడిగితే నాలుగు రోజులకు రూ.లక్ష కదా.. మూడు రోజుల్లోనే పూర్తయినందుకు అంతే అన్నారని' తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement