యాంకర్ శివ జ్యోతి తరచుగా సోషల్మీడియాలో ట్రోల్స్ గురౌతూనే ఉంటారు. బిగ్బాస్తో మరింత పాపులారిటీ తెచ్చుకున్న ఆమె ప్రస్తుతం తన యూట్యూబ్ ఛానల్, పలు ప్రమోషన్స్తో బిజీగానే ఉన్నారు. అయితే, తాజాగా తన భర్తతో కలిసి తిరుమల వెళ్లారు. అక్కడ టీటీడీ అందించే ప్రసాదంపై చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో ఆమె మరో వివాదంలో చిక్కుకున్నట్లు అయింది.
తిరుమల తిరుపతి దేవస్థానం క్యూ లైన్లో శివ జ్యోతితో పాటు తన సోదరుడు, భర్త ఉన్నాడు. సాధారణంగా దర్శనం కోసం క్యూలో ఉన్న భక్తల కోసం దేవుడి ప్రసాదంగా సాంబార్ రైస్, పెరుగు అన్నం టీటీడీ అందిస్తుంది. ఈ క్రమంలో ఆమె సోదరుడు భక్తుల కోసం ఇచ్చే అన్నప్రసాదం తీసుకుంటుండగా శివ జ్యోతి నోరుపారేసుకుంది. సోనీ కాస్ట్లీ ప్రసాదం అడుక్కుంటున్నాడు ప్రెండ్స్ అంటూ కామెంట్ చేసింది. ఆపై ఆమె సోదరుడు కూడా తాను జీవితంలో ఎప్పుడూ కూడా అడుక్కోలేదని.., ఫస్ట్ టైమ్ ఇలా అడుక్కుంటున్నాను అంటూ ఆ వివాదాన్ని మరింత పెద్దది చేశాడు. తిరుపతిలో రిచ్చెస్ట్ బిచ్చగాళ్లం తామేనని అంటూ తన భర్తతో శివ జ్యోతి కూడా మరోసారి మాటలు తూలింది. దీంతో నెటిజన్లు మండిపడుతున్నారు. దేవుని ప్రసాదం విషయంలో ఇలాంటి చిల్లర కామెంట్లు ఏంటి అని ఏకిపారేస్తున్నారు. ఈ ఘటనపై శివ జ్యోతి క్షమాపణలు చెప్పే ఛాన్స్ ఉంది.
బిడ్డ కోసం వెంకటేశ్వర స్వామిని పూజించిన శివ జ్యోతి
శివ జ్యోతి ప్రేమ వివాహం చేసుకుంది. తనకు పిల్లలు కలగకపోవడంతో ఆమె చాలాసార్లు ట్రోలింగ్కు కూడా గురైంది. ఎన్నోసార్లు కన్నీళ్లు కూడా పెట్టుకుంది. తిరుమల వెంకన్నను పూజిస్తే తప్పకుండా తన కోరిక తీరుతుందని ఆమెకు కొందరు సలహా ఇవ్వడంతో.. స్వామికి ఇష్టమైన సప్త శనివార వ్రతం చేసింది. 7 శనివారాల పాటు తన ఇంట్లోనే చాలా నిష్టగా పూజలు చేసింది. స్వామి దయతోనే తనకు బిడ్డ కలుగుతుందని ఒక వీడియో పోస్ట్ చేసింది. జీవితాంత స్వామి సేవలోనే ఉంటామని చెప్పింది.
ఎన్నో పూజలు చేసినప్పటికీ కలగని సంతోషం సప్త శనివారం వల్ల తమ కోరిక తీరిందని పంచుకుంది. తిరుమల వెంకన్నను అంత భక్తితో పూజించిన శివజ్యోతి ఇప్పుడు దేవుడి ప్రసాదం గురించి తప్పుగా మాట్లడటంతో అందరూ షాక్ అవుతున్నారు. అయితే, కొందరు తెలియకనే నోరు జారిందని చెబుతున్నప్పటికీ ఆమె చేసింది ముమ్మాటికి తప్పేనని అంటున్నారు.


