తెలుగు బిగ్బాస్ తొమ్మిదవ సీజన్ (Bigg Boss Telugu 9) ముగింపుకు దగ్గరపడేకొద్దీ మరింత రంజుగా మారుతోంది. నామినేషన్స్ ఈసారి అగ్గిరాజుకున్నాయి. ముఖ్యంగా సంజన.. ప్లాన్ చేసి మరీ గొడవ పడింది. రీతూ క్యారెక్టర్ను తప్పు పట్టిన తను ఆమెకు సారీ చెప్పేందుకు కూడా ఇష్టపడలేదు. మరోవైపు మాజీ కంటెస్టెంట్లు బిగ్బాస్ హౌస్లో సందడి చేశారు. ఆ విశేషాలు మంగళవారం (నవంబర్ 25వ) ఎపిసోడ్ హైలైట్స్లో చూసేద్దాం...
చూసిందే చెప్పా!
రీతూ (Rithu Chowdary)- పవన్ ఫ్రెండ్స్కు ఎక్కువ, ప్రేమికుల కన్నా తక్కువ అన్నట్లుగా ప్రవర్తిస్తుంటారు. ఈ విషయం అందరికీ తెలుసు. రాత్రిపూట ఒకే బెడ్పై కూర్చుని ముచ్చట్లు కూడా పెడుతుంటారు. కానీ, జరగరానిదేదో జరిగినట్లు దాన్ని చాలా చెండాలంగా చిత్రీకరించింది సంజన. తొమ్మిదివారాలుగా నేను కనబడలేనంటుందా? సంజనా ఉందని తనకివాళ తెలిసుంటుంది అని శాడిజం చూపించింది.
సారీ చెప్పను
సారీ చెప్పమని ఎవరు అడిగినా కుదరదని కరాఖండిగా చెప్పింది. నేను చూసిందే చెప్పా.. అందులో తప్పేం లేదని అడ్డంగా వాదించింది. అంతగా కావాల్సి వస్తే ఆమె సారీ చెప్తేనే నేను చెప్తా అని మొండిగా వాదించింది. ఇదంతా చూస్తుంటే రీతూపై పగ తీర్చుకున్నట్లే కనిపిస్తోంది. ఇక హౌస్లో ఈసారి కెప్టెన్సీ టాస్క్ వెరైటీగా సాగింది. పాత సీజన్ల నుంచి కంటెస్టెంట్లు వస్తుండగా.. వారితో తలపడి ఆడి గెలిచి కెప్టెన్సీ కంటెండర్ అవాలి.
బిగ్బాస్ హౌస్లో మాజీ కంటెస్టెంట్లు
మొదటగా బిగ్బాస్ 7 ఫైనలిస్ట్ ప్రియాంక జైన్ (Priyanka Jain) హౌస్లో ఎంట్రీ ఇచ్చింది. తను కల్యాణ్తో పోటీపడతానంది. వీరిద్దరికిచ్చిన చేప గేమ్లో కల్యాణ్ ప్రియాంకను ఓడించి ఫస్ట్ కెప్టెన్సీ కంటెండర్ అయ్యాడు. తర్వాత బిగ్బాస్ 8 రన్నరప్ గౌతమ్ కృష్ణ (Gautham Krishna) పంచెకట్టుతో హౌస్లో ప్రవేశించాడు. ఇప్పటివరకు కెప్టెన్ అవని భరణికి తనతో తలపడే ఛాన్స్ ఇచ్చాడు.
భరణి ఎమోషనల్
అసలే టాస్కుల్లో దిట్ట అయిన గౌతమ్.. భరణి (Bharani Shankar)ని ఇట్టే ఓడించేశాడు. కెప్టెన్ అయ్యే ఛాన్స్ పోయిందంటూ భరణి ఎమోషనలయ్యాడు. కెప్టెన్ అవాలి నాన్న అని కూతురు ప్రేమగా కోరిన ఒక్క కోరికను నెరవేర్చలేకపోయానని బాధపడ్డాడు. నాకు కెప్టెన్సీ రాసి లేదు. సారీ హనీ పాప, సారీ ఫ్రెండ్స్, సారీ అమ్మా.. అని బాధపడుతుంటే తనూజ అతడిని ఓదార్చింది. రేపు మరికొందరు మాజీ కంటెస్టెంట్లు హౌస్లోకి రానున్నారు.


