ఏ రంగానికి చెందిన వారికైనా అవమానాలు, అవరోధాలు ఎదురుకావడం సహజం. ముఖ్యంగా సినిమా రంగంలోని వారికి ఇలాంటి ఇబ్బందులు కాస్త ఎక్కువే ఉంటాయి. ఒక్కోసారి శాయశక్తులా శ్రమించినా తమనే కార్నర్ చేసే విమర్శలు గుండెల్లో కలుక్కుమంటుంటాయి. నటి భాగ్యలక్ష్మి భోర్సే ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొంటోందట. అలా తన ఆవేదనను ఇటీవల ఒక భేటీలో వ్యక్తం చేసిందీ బ్యూటీ.
నిజం చెప్పాలంటే నటిగా ఈ అమ్మడికి అదృష్టం ఉన్నా, సరైన విజయం వరించలేదు. తెలుగులో రవితేజ, విజయ్ దేవరకొండ, రామ్ వంటి స్టార్ హీరోలతో జత కట్టినా, ద్విభాషా చిత్రం కాంతాలో దుల్కర్ సల్మా న్ వంటి నటుడితో రొమాన్స్ చేసినా మంచి నటిగా పేరు తెచ్చుకుంది కానీ మంచి సక్సెస్ మా త్రం దోబూచులాడుతూనే ఉంది.
అలాంటిది తాజాగా అఖిల్ అక్కినేనితో జత కట్టిన లెనిన్ చిత్రం సంతృప్తి కరమైన విజయాన్ని అందించింది. దీంతో చాలా కాలంగా గూడు కట్టుకున్న ఆవేదన కట్టలు తెంచుకుంది. దాన్ని ఒక భేటీలో వ్యక్తం చేస్తూ. ‘‘చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోతే వెంటనే ఆ చిత్ర కథానాయికిని కార్నర్ చేస్తూ ఐరన్ లెగ్ అంటూ ముద్ర వేయకండి. చిత్ర అపజయాన్ని హీరోయిన్లకు మాత్రమే ఆపాదించడం ఎంత వరకు న్యాయం. నేనూ ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాను’’ అంటూ విమర్శకులపై దాడి చేసింది. ప్రస్తుతం ఈ భామ తమిళంలో శివకార్తికేయన్కు జంటగా సెయోన్ చిత్రంలో నటిస్తోంది.


