
టైటిల్ : బద్మాషులు
నటీనటులు: మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్, బలగం సుధాకర్ రెడ్డి, కవిత శ్రీరంగం, దీక్ష కోటేశ్వర్, అన్షుమన్ తదితరులు
దర్శకత్వం-శంకర్ చేగూరి
నిర్మాతలు- B. బాలకృష్ణ, C.రామ శంకర్
సంగీతం- తేజ కూనూరు
సినిమాటోగ్రఫీ- వినీత్ పబ్బతి
ఎడిటింగ్: గజ్జల రక్షిత్ కుమార్
‘బద్మాషులు’.. తెలంగాణ ప్రాంతంలో సరదాగా తిట్టుకునే పదం అది. అదే టైటిల్లో ఓ సినిమా తెరకెక్కింది. మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ చిత్రానికి శంకర్ చేగూరి దర్శకత్వం వహించారు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ని విడుదల చేయగా..ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ఈ చిన్న చిత్రంపై అందరి దృష్టి పడింది. మంచి అంచనాలు నేడు(జూన్ 6) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
తెలంగాణలోని కోతులగూడెం గ్రామానికి చెందిన ట్రైలర్ తిరుపతి(మహేశ్ చింతల), బార్బర్ ముత్యాలు(విద్యాసాగర్ కారంపురి) స్నేహితులు. ఇద్దరు పని దొంగలు...మందు తాగనిదే ఉండలేరు. భార్య, పిల్లలను పట్టించుకోకుండా.. నిత్యం తాగుతూ ఎంజాయ్ చేస్తుంటారు. వీరిద్దరిని ఊరంతా ‘బద్మాషులు’ అని తిట్టినా పట్టించుకోరు. డబ్బుల కోసం తిరుపతి తన కస్టమర్ల డ్రెస్లను అమ్ముకుంటే.. ముత్యాలు ఇంటింటికెల్లి హెయిర్ కటింగ్ చేస్తూ వచ్చిన డబ్బులతో తాగుతుంటారు. ఓ సారి తాగేందుకు డబ్బుల్లేక స్కూల్లో పెన్షిన్ వైర్ని దొంగిలించి పోలీసులకు దొరికిపోతారు. స్టేషన్లో కూడా వీరి బుద్ది మారదు. పోలీసుల పేరు చెప్పి స్టేషన్కు వచ్చిన వారి దగ్గర డబ్బులు వసూలు చేసి తాగుతుంటారు. చిన్న దొంగతనమే కదా అని నాలుగు రోజుల తర్వాత వారిని వదిలేస్తారు. అదే సమయంలో స్కూల్లో కంప్యూటర్ మిస్ అవుతుంది. అందులో పూర్వ విద్యార్థుల డేటా అంతా ఉంటుంది. ఆ కేసు వీరిద్దరిపైకే వస్తుంది. అసలు ఆ కంప్యూటర్ దొంగిలించిదెవరు? అది ఎక్కడ ఉంది? దొంగను పట్టుకునేందుకు కానిస్టేబుల్ రామచందర్(మురళీధర్ గౌడ్)కు తిరుపతి, ముత్యాలు చేసిన సహాయం ఏంటి? అసలు తిరుపతి, ముత్యాలు తాగుబోతులుగా మారడానికి గల కారణం ఏంటి? చివరకు వీరిద్దరిలో మార్పు వచ్చిందా? లేదా? అనేది తెలియాలంటే థియేటర్స్కి వెళ్లి సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సాగే ఓ కామెడీ ఎంటర్టైనర్ చిత్రమిది. పల్లెటూరికి చెందిన ఇద్దరి తాగుబోతుల చుట్టూ కథనం సాగుతుంది. తిరుపతి, ముత్యాలుతో పాటు ఈ చిత్రంలోని ప్రతి పాత్ర నిజజీవితంతో మన ఊరిలో వారిలాగే ఉంటూ నవ్విస్తుంటాయి. చివరితో ఓ మంచి సందేశం కూడా ఇచ్చారు. అయితే దర్శకుడు కథ కంటే కామెడీ సన్నివేశాలపైనే ఎక్కువ దృష్టి పెట్టాడు. కొన్ని చోట్ల ‘జాతి రత్నాలు’ ఛాయలు కనిపిస్తుంటాయి. అయితే ఒకే పాయింట్ చుట్టూ కథ తిరగుతుండడంతో నిడివి తక్కువ అయినా.. సాగదీతగా అనిపిస్తుంది. అలాగే కొన్ని చోట్ల కామెడీ కూడా అంతగా వర్కౌట్ కాలేదనిపిస్తుంది.
డ్రెస్ కుట్టమని వస్త్రం ఇస్తే..దాన్నే అమ్ముకొని తాగే ట్రైలర్ ఒకవైపు.. సగం సగం షేవింగ్ చేస్తూ.. మధ్యలోనే బార్ కెళ్లే బార్బర్ మరోవైపు.. వీరిద్దరి పాత్రల పరిచయ సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. అయితే అలాంటి పాత్రలతో మరింత కామెడీ పండించే స్కోప్ ఉన్నా..దర్శకుడు రోటీన్ సన్నివేశాలనే రాసుకున్నాడు. అవి కొంతవరకు మాత్రమే వర్కౌట్ అయ్యాయి. దొంగతనం చేసి పోలీస్ స్టేషన్కి వెళ్లేవరకు కథనం సోసోగానే సాగుతుంది.
స్టేషన్లో వీరిద్దరు చేసే కామెడీ నవ్వులు పూయిస్తుంది. ఇంటర్వెల్ సీన్ రొటీన్గానే ఉంటుంది. ఇక సెకండాఫ్ కూడా మళ్లీ దొంగతనం చుట్టే తిరగడంతో బోరింగ్గా అనిపిస్తుంది. దొంగను పట్టుకునేందుకు చేసే ప్రయత్నాలు అంతగా ఆకట్టుకోలేవు. క్లైమాక్స్ లో ఇచ్చిన సందేశం ఆలోచింపజేస్తుంది. ఎలాంటి వల్గారిటీ, డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేకుండా ఫ్యామిలీ అంతా చూసేలా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు. అయితే కథను ఇంకాస్త బలంగా రాసుకొని ఉంటే ఫలితం మరోలా ఉండేది.
ఎవరెలా చేశారంటే..
బలగం, భీమదేవరపల్లి, రామన్న యూత్ తదితర సినిమాల్లో కీలక పాత్రల్లో నటించిన విద్యా సాగర్ ఈ చిత్రంతో హీరోగా మారి.. తనదైన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. బార్బర్ ముత్యాలు పాత్రలో ఒదిగిపోయాడు. కొన్ని చోట్ల ఎక్స్ప్రెషన్స్తోనే నవ్వులు పూయించాడు. నటుడిగా ఆయనకు మంచి భవిష్యత్తు ఉంది. ఇక ట్రైలర్ తిరుపతిగా మహేష్ చింతల కూడా నేచులర్ ఫెర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. ఆయన వేసే సింపుల్ పంచులు బాగా పేలాయి. విద్యా సాగర్, మహేశ్ ఇద్దరు తెరపై నిజమైన తాగుబోతుల్లాగే కనిపించారు. ముత్యాలు భార్యగా దీక్ష కోటేశ్వర్, తిరుపతి భార్యగా కవిత పాత్రల పరిధి తక్కువే అయినా ఉన్నంతలో బాగానే నటించారు. మురళీ ధర్, బలగం సుధాకర్ రెడ్డితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. తేజ కూనూరు నేపథ్య సంగీతం బాగుంది. పాటలు పర్వాలేదు. వినీత్ పబ్బతి సినిమాటోగ్రఫీ, గజ్జల రక్షిత్ కుమార్ ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.