● హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు
● జిల్లాలో 1,10,000 కుటుంబాలకు లబ్ధి
రామాయంపేట(మెదక్): ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం–కిసాన్) పథకాన్ని మరో ఐదేళ్ల పాటు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఈమేరకు కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈ పథకం కింద జిల్లాలో 1,10,000 కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. వీరి ఖాతాల్లో రూ. 22 కోట్లు కేంద్ర జమ చేస్తుంది. 2019 ఫిబ్రవరి 1వ తేదీ వరకు పట్టాదారు పాస్ పుస్తకాలు కలిగి ఉన్న రైతుల్లో కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకం అమలు చేస్తున్నారు. భార్య లేదా భర్త ఎవరో ఒకరు మరణిస్తే వారి స్థానంలో పథకాన్ని మార్చుకునే అవకాశం కల్పించారు. ఈ పథకం ద్వారా అర్హులైన రైతు కుటుంబాలకు సంవత్సరానికి రూ.6 వేల వంతున ఆర్థిక సహాయం అందుతోంది. ఈ మొత్తాన్ని ప్రతి నాలుగు నెలలకు ఒకమారు రూ. 2 వేల వంతున నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఈ పథకాన్ని 2026–27 ఆర్థిక సంవత్సరం నుంచి 2030–31 ఆర్థిక సంవత్సరం వరకు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు 23 విడతలుగా డబ్బులు విడుదల అయ్యాయి. చివరిసారిగా 2026 జూన్ 20న పీఎం కిసాన్ నిధులు రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఏవైనా సందేహాల కోస హెల్ప్లైన్ నంబర్ 155261 ద్వారా సంప్రదించవచ్చు. కాగా, రైతులు తమ వ్యవసాయ పెట్టుబడుల కోసం ఈ పథకం ఎంతోగానో ఉపయోగపడుతోంది. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసు కునేందుకు, సాగు అవసరాల కోసం సౌలభ్యంగా ఉందని రైతులు పేర్కొంటున్నారు. పథకాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగించాలని తీసుకున్న నిర్ణయం రైతులకు ఆనందాన్ని ఇచ్చింది.


