జడ్చర్ల టౌన్: పట్టణంలోని వీహెచ్పీ నాయకులు మంచన గుండెరావును మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కలుసుకుని పరామర్శించారు. మంగళవారం ఏపీలోని కర్నూలు జిల్లా పర్యటనకు వెళ్తూ మార్గమధ్యంలో ఆయన జడ్చర్లలో ఆగారు. ఎమర్జెన్సీ కాలం (1975)లో మీసాచట్టం కింద అరెస్టయి తనతోపాటు చంచల్గూడ జైలులో నిర్బంధ జీవితం గడిపిన రోజులను గుర్తుచేసుకున్నారు. ఎమర్జెన్సీ పోరాటం కలిపిందని, నాటినుంచి నేటికి స్నేహబంధం కొనసాగుతుందని దత్తాత్రేయ పేర్కొన్నారు. ఈ సందర్భంగా గుండెరావును శాలువాతో సత్కరించారు. 83ఏళ్ల వయసులో ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనటాన్ని అభినందించారు. గుండెరావు ఇంటికి చేరుకున్న దత్తాత్రేయకు ఘనస్వాగతం లభించింది. ఆయనకు గుండెరావుతోపాటు బీజేపి నాయకులు కృష్ణయ్య, శ్రీనివాస్గౌడ్, సాహితి స్వాగతం పలికారు.


