వివాహిత మృతి! భర్తే వేధించి, పురుగుల మందు తాగించాడని.. | Sakshi
Sakshi News home page

వివాహిత మృతి! భర్తే వేధించి, పురుగుల మందు తాగించాడని..

Published Thu, Dec 28 2023 12:48 AM

- - Sakshi

మహబూబ్‌నగర్‌: జడ్చర్ల మండలంలోని చిన్న ఆదిరాల గ్రామపంచాయతీ తుపుడగడ్డతండాకు చెందిన మంజుల (26) అనుమానాస్పద స్థితిలో మృతిచెందగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రమేశ్‌బాబు తెలిపారు. బాధితుల కథనం మేరకు.. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం నల్లరాళ్లతండాకు చెందిన మంజుల, తుపుడగడ్డతండాకు చెందిన రమేశ్‌నాయక్‌ ఆరేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు.

వీరికి ఇద్దరు కుమార్తెలు. భర్త, కుటుంబ సభ్యులు వరకట్నం తీసుకురావాలంటూ పలుమార్లు ఒత్తిడి చేయడంతో పాటు మానసిక, శారీరక వేధింపులకు గురి చేశారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. భర్త రమేశ్‌, మరిది, అత్తామామలు తీవ్రంగా కొట్టడంతోనే అపస్మారక స్థితిలోకి వెళ్లిందని.. నోట్లో పురుగుమందు పోసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని మంజుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకొని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మాట్లాడలేక మూగ సైగలతో వివరించిందన్నారు.

నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ బుధవారం పోలీస్‌స్టేషన్‌ ఎదుట మృతురాలి కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. సీఐ రమేశ్‌బాబు పోస్టుమార్టం నివేదిక ఆధారంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. బాధితుల ఫిర్యాదు మేరకు భర్త రమేశ్‌నాయక్‌, మరిది శ్రీకాంత్‌, అత్త దేవి, మామ లక్ష్మణ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఆందోళన చేసిన వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ఇవి చదవండి: లభించని శ్రీమాన్‌ ఆచూకీ.. రోదిస్తున్న తల్లిదండ్రులు

Advertisement
Advertisement