ఏడురోజులకు బాలిక మృతదేహం లభ్యం.. | - | Sakshi
Sakshi News home page

ఏడురోజులకు బాలిక మృతదేహం లభ్యం..

Jun 15 2024 1:56 AM | Updated on Jun 15 2024 8:20 AM

-

బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వెళ్లిన కుటుంబం

ఈ నెల 7న అదృశ్యమైన బాలిక

మహబూబాబాద్‌: బతుకుదెరువు కోసం హైదరాబాద్‌ వెళ్లిన దంపతుల కుమార్తె మియాపూర్‌లో ఈ నెల 7న అదృశ్యమైంది. అనంతరం అదే మియాపూర్‌ జంగల్‌లో 7రోజుల తర్వాత బాలిక మృతదేహం శుక్రవారం లభ్యమైంది. వివరాలిలా ఉన్నాయి.

మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం లక్ష్మాతండా గ్రామ పంచాయతీకి చెందిన బానోతు నరేశ్‌, శారద దంపతులు బతుకుదెరువు నిమిత్తం ఇద్దరి పిల్లలతో గత 20రోజుల క్రితం హైదరాబాద్‌కు వెళ్లారు. అక్కడ మియాపూర్‌ ఏరియా పరిధిలోని నడిగడ్డతండాలో ఉంటూ కూలీ పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 7వ తేదీన వారి కుమార్తె బానోతు వసంత (12) సమీపంలోని కిరాణా షాపు వద్దకు వెళ్లింది.

ఎంతకూ ఇంటికి రాకపోవడంతో బాలిక తండ్రి నరేశ్‌ చుట్టు పక్కల వెతికినా ఆచూకీ దొరకలేదు. దీంతో మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టగా మియాపూర్‌ జంగల్‌లో కుళ్లిపోయిన స్థితిలో బాలిక మృతదేహం లభ్యమైంది. బాలిక అనుమానాస్పదంగా మృతి చెందినట్లు భావించిన పోలీసులు వసంత తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వారు సదరు మృతదేహం తమ బిడ్డదేనని గుర్తించి బోరున విలపించారు.

Advertisement
 
Advertisement
Advertisement